మొలకలపల్లి కోటేశ్వరరావు
99892 24280
కొంతమంది రచయితలు మంచి భావాలతో మంచి తెలుగు కథలు రాసారు. రాస్తున్నారు. అయితే వాటికి ఇంగ్లీషు శీర్షికలు పెట్టి ఆ కథల విలువ కొంత వరకూ తగ్గించుకుంటున్నారు. ఇంగ్లీషు రచయితలు ఎవరైనా కథలు రాసి వాటికి తెలుగు పేర్లో, తమిళం పేర్లో, మలయాళం పేర్లో పెడితే ఎంత అర్థరహితంగా వుంటుందో ఇదీ అలాగే వుంది.
ఈ నాటికీ మన సమాజంలో నూటికి 40, 50 మంది నిరక్షరాస్యులుగానే వున్నారు. అక్షరాస్యుల్లో కథలు చదివేవాళ్ళు, అంటే సాహిత్యాభిలాష కలిగిన వాళ్ళు నూటికి ఒకరో, ఇద్దరో వుంటారు. ఇక వాళ్ళలో ఆంగ్లం చదివేవాళ్ళు, ఆ కథల శీర్షికని అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది? కథకి ఇంగ్లీషు పేరు పెడితే, ఆ భాష బాగా రాని ఎంత మంచి పాఠకుడికైనా ఆ కథ చదవాలని వెంటనే అనిపించదు. కథ పేజీ తిప్పి మరో శీర్షికలోనికి వెళ్ళి పోతాడు. అది ఎంత మంచి కథ అయినా చదవడానికి మొదట్లో ఆసక్తి కలగదు.
వ్యాపార రచయితలు వేరు. వాళ్ళు బడాయికీ, డాంబికానికీ తమ కథలకీ, నవలలకీ ఇంగ్లీషు పేర్లు పెడుతుంటారు. అది ఆకర్షణ కోసమనో, పాఠకాదరణ పొందుతుందనో వాళ్ళ ఉద్దేశ్యం కావచ్చు. ప్రజా రచయితలు, ప్రజల పక్షం వహించి ప్రజలకి మేలు కలగాలనే ఒక అంకితభావంతో రచనలు చేసేవాళ్ళు తమ కథలకి ఇంగ్లీషు పేర్లు పెట్టడమే ఇబ్బందికరం.
ఎంతో మంచి కథలు రాసిన పాత తరం రచయితలు ఎవరూ కథలకి ఇంగ్లీషు పేర్లు పెద్దగా పెట్టలేదు. శ్రీ పాద సుబ్రమణ్య శాస్త్రి 76 కథలు రాసారు. ఆ కథలు మొత్తంలో ఆయన ఒక కథకి మాత్రమే ఇంగ్లీషు పేరు పెట్టారు. అది 'లీగల్ అడ్వైస్ '. మరో కథకి పోలీసు అని పేరు పెట్టారు.
పోలీసు, పోస్టు మ్యాను, రైలు, ఇంటర్వూ, స్టేషనూ,
మీటింగూ, పంపూ, ఇంటర్నెట్, ఫోనూ లాంటి ఇంగ్లీష్ పదాలకి సమానార్థకమైన తెలుగు పదాలు దాదాపు మరుగునపడి పోయాయి. లేదా లేవు. ఒకవేళ ఎవరైనా వీటి తెలుగు పదాలు మాట్లాడితే కఅతకంగా వుంటుందేమో! పోలీసుని 'రక్షక భటుడు' అని ఎవరైనా అంటారా? అంటే జనం నవ్వుతారు. అలాగే రైలుని పొగబండి అంటే ఎబ్బెట్టుగా వుండదూ? ఇంగ్లీషు అన్య భాషా పదాలని తనలో ఎలా ఇముడ్చుకుందో అలాగే తెలుగులో కూడా ఇంగ్లీషు పదాలు కొన్ని అంతర్భాగమై పోయాయి. అలాంటి పదాల్ని (పై మాటల్ని ) ఈ వ్యాస పరిధి మేరకు నేను తెలుగు మాటలుగానే పరిగణించి లెక్కలోకి తీసుకోలేదు. అందుకే శ్రీ పాద రాసిన పోలీసుని నేను ఇంగ్లీషు శీర్షికగా పేర్కొన లేదు. నిజానికి శ్రీ పాద ఇంగ్లీషుని అంతగా ఇష్టపడక పోగా ద్వేషించాడు కూడా! అయితే ఆయన మీద సంస్క ృత ప్రభావం అధికంగా వుంది. ఆయన కథల పేర్లు కొన్ని : 'అపిదళిత వజ్రస్య హృదయమ్', 'యావజ్జీవ హౌష్యామీ', 'షట్కర్మయుక్తా', 'శుభికే! శిరఆరోహ' , 'కన్యాకాలేయత్నాద్వరితా '. సంస్క ృతంలో పెట్టిన ఈ కథల శీర్షికలే గాకుండా, ఆయన కథల్లోనూ అక్కడక్కడా సంస్క ృత పద బంధాలూ, పదాలూ తారసపడతాయి.
గుంటూరు జిల్లా శ్రామికుల, రైతుల, కష్ట జీవుల బాధల్నీ, వేదనల్నీ, జీవిత ఘర్షణల్నీ అద్భుతంగా, అత్యంత ప్రతిభా వంతంగా పామర భాషలో అక్షరీకరించిన మా.గోఖలే 50 కథలు రాసారు. వాటిలో ఒక్కటి కూడా ఇంగ్లీషు పదం లేదు. అన్నీ తెలుగు శీర్షికలే. అవి కూడా గుంటూరు మాండలికంలోనే వున్నాయి. పెల్లాం బూసిమ్మ, సీకటి పొత్తు, పాలెంలో దీపాలమాశ, పెల్లి, ఆరికేం మారాజులు, పులిస్త్రాకులు, పల్లె గూడెం కాడ, మనసు పుట్టుద్ది, అడక్క దినక సేసేదేంది ..
శీర్షికలు ఇలా వున్నాయి.
ఇదే జిల్లాకి చెందిన త్రిపురనేని గోపీచంద్ 105 కథలు రాసారు. వాటిలో రెండు కథల పేర్లు కథకి 'క్లయిమాక్స్', 'పుష్' అనే చొరవ. ఈ రెండు కథల పేర్లలో వచ్చిన ఇంగ్లీషు పదాల్ని రచయితే కొటేషన్స్లో పెట్టారు. అంటే, అవి అన్య భాషాపదాలు అనే కదా ఆ కొటేషన్స్ భావం. మిగతా 103 కథల పేర్లూ తెలుగులో వున్నాయి.
చలం 98 కథలు రాసారు. ఆయన కథల్లో రెండు కథలకి ఇంగ్లీషు శీర్షికలు వున్నాయి. అవి : వాణీ ఏ స్టడీ, ఆర్గుమెంట్.
ఆత్మీయత లాంటి మంచి కథలు రాసిన అందే నారాయణ స్వామి కథలు అన్నీ తెలుగు పేర్లతోనే వున్నాయి. వాసిరెడ్డి సీతాదేవి 50 కథలు రాసారు. (మా. గోఖలే, సీతాదేవి వాళ్ళ సమగ్ర రచనల సంపుటాల్లో వాళ్ళ కథలు కచ్చితంగా 50 వున్నాయి.) ఈ రచయిత్రి కథల్లో మూడు కథల పేర్లు : మిసెస్ కైలాసం, జాక్ పాట్, మిస్టర్ ముకుందం.
విరసం ప్రచురించిన కొడవటిగంటి కుటుంబ రావు సమగ్ర రచనల సంకలనాల్లో నా దృష్టికి వచ్చిన కథలు మొత్తం 254. ఆయన 330 కథలు రాసినట్లు ఆ పుస్తకాల సంపాదకులు లెక్క తేల్చారు. అందులో 280 సేకరించినట్లుగా వాళ్ళ ముందుమాట చెపుతోంది. అయితే 254 మాత్రమే నా పరిశీలనలో కనిపించాయి. అందులో 7 కథలకి ఇంగ్లీషు శీర్షికలు వున్నాయి. అవి : 32 డౌన్ క్రాసింగ్, ఎక్స్ ట్రా, సినిమా స్టార్, ఫాలౌట్, బ్లాక్ మార్కెట్, ఫోర్త్ డైమన్షన్, ట్యూషన్. ఇక ఈ రచయితే రాసిన దిబ్బ కథలు 12, గొలుసు, దిబ్బ కథలు కలిపి 6, హపూర్వ హపరాధ పరిశోధక కథలు 16, శాస్త్ర విజ్ఞాన కల్పన కథలు 3. ఇవి మొత్తం 37. వీటిలో డిటెక్టివ్ అనే పదం తప్ప ఇక అన్నీ తెలుగు పేర్లే. గల్పికలు 73 రాసారు. వాటిలో ఫారిన్ కొలాబరేషన్ ఒక్కటే ఇంగ్లీష్ శీర్షిక. మిగతా 72 గల్పికలకీ తెలుగు పేర్లే వున్నాయి. నాటికలు 19 రాసారు. అన్నీ తెలుగు పేర్లు తోనే వున్నాయి.
ఇక చాసోగా ప్రసిద్ధి చెందిన చాగంటి సోమయాజులు మొత్తం కథల్లో మూడు పేర్లు ఇలా వున్నాయి : జంక్షన్లో బడ్డీ, ఫారిన్ అబ్బాయి, ప్రెశిడెంట్ లక్ష్మీకాంతం. ఫారినూ, జంక్షనూ, ప్రెసిడెంటు ఇవి దాదాపు తెలుగు పదాల్లోనే కలిసి పోయాయి. మిగతా శీర్షికలన్నీ చక్కటి తెలుగు మాటలతోనే వున్నాయి.
కె.ఎన్. వై. పతంజలి 44 కథలు రాసారు. వాటిలో 'అడల్ట్ స్టోరీ' ఒక్కటే ఇంగ్లీష్ శీర్షిక. రాచకొండ విశ్వనాధశాస్త్రి కథలు నేను చూసినవి 43. వీటిలో 'ది స్మోకింగ్ టైగర్' అను పులి పూజ, బేడ 'ట్రాజడి', మొదటి నెల జీతం 'జాస్మిన్'. ఈ మూడు కథలకీ సగం ఇంగ్లీషు, సగం తెలుగు పదాలతో వున్న శీర్షికలు వున్నాయి. వీటిలో ఇంగ్లీషు పదాల్ని రచయిత కొటేషన్స్లో పెట్టారు. కాళీపట్నం రామారావు 53 కథలు రాసారు. వాటిలో 'నో రూం', 'ఫ్లాట్ ఫారమో' ఇంగ్లీషు పేర్లతో వున్నాయి. మిగతావన్నీ తెలుగు శీర్షికలే.
'నేను రాయలసీమకు చెందిన ఒక గ్రామీణ రచయితని' అని చెప్పుకున్న మధురాంతకం రాజారాం వందల కథలు రాసారు. అప్పుడు కొన్నీ, అప్పుడు కొన్నీ నేను చదివిన కథలు 180. వీటిలో 7 కథలకి ఇంగ్లీషు పేర్లు వున్నాయి. అవి : స్పాట్ లైట్, గ్రూప్ ఫోటో, యమర్జెన్సీ, సర్వీసు రిజిష్టరు, లెస్ లగేజీ మోర్ కంఫర్ట్, మిస్ ఎమరాల్డ్ ఫ్రమ్ ఫ్రాన్స్, కార్టూన్.
ఇవి కాలం చేసిన రచయితల కథల వివరాలు. వీళ్ళు చాలా అరుదుగా, అతి తక్కువగా కథలకి ఇంగ్లీషు పేర్లు పెట్టారు. వర్తమానంలోనికి వస్తే కొందరు రచయితలు కథలకే కాదు, తమ తెలుగు కథల సంకలనాలకి కూడా ఇంగ్లీషు పేర్లు పెడుతున్నారు.
అంపశయ్య నవీన్ రాసిన 23 కథలతో ఒక సంకలనం వచ్చింది. ఆ పుస్తకం పేరు 'ఫ్రమ్ అనూ రాధ, విత్ లవ్'. ఈ సంపుటిలో మరో రెండు కథలకి ఇంగ్లీషు శీర్షికలు వున్నాయి. బ్లాస్ట్ బ్లాస్ట్, ట్యూషన్ మేష్టారు అనేవి. మిగతా 20 కథలకీ తెలుగు పేర్లే వున్నాయి. మరి కథకుడు ఈ సంపుటికి ఇంగ్లీషు పేరు పెట్టాడు.
జొన్నవిత్తుల శ్రీ రామ చంద్రమూర్తి కథలతో ఒక సంకలనం వచ్చింది. ఇందులో మొత్తం 16 కథలు. వీటిలో చాలా మంచి కథలు వున్నాయి. మంచి స్త్రీ వాద కథ 'వంజ'. పేద దళిత, వెనుక బడిన వర్గాల విద్యార్ధుల తిరుగుబాటు స్వరంతో 'పంచన్ లామా'. ఇలా 16. వీటిలో ఒకటి మినహా అన్ని కథలకీ తెలుగు శీర్షికలే! ఒక్క కథకే ఇంగ్లీషు పేరు. అది 'ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్'. పుస్తకానికి ఈ కథ పేరు పెట్టారు. అడపం, వైతరణి, సిద్థుల మర్రి, బిత్తల బోకి, తెలుగు పతాకం. సంపుటిలోని కథల్లో ఇవి కొన్ని. వీటిలో ఏ పేరు పెట్టినా ఎంతో బాగుండేది. రచయిత ఏరికోరి ఇంగ్లీష్ శీర్షికతో రాసిన కథ పేరు పెట్టారు సంపుటికి. వివిన మూర్తి 'వాల్ పేపర్' పేరుతో ఒక సంకలనం తెచ్చారు. పుస్తకానికి పెట్టిన కథ పేరు మినహా సంపుటిలోని ఇతర కథలు అన్నిటికీ తెలుగు శీర్షికలే! ఎంతో మంచి కథలు , గొప్ప కథలు రాసిన డా. గీతాంజలి తన కథల సంకలనానికి పెట్టిన పేరు 'హస్బెండ్ స్టిచ్'. ఈ పేరుతో రెండు సంకలనాలు వెలువరించారు. రెండో సంకలనానికి 'హస్బెండ్ స్టిచ్ 2' స్టోమా అని పేరు పెట్టారు.
నేను ఈ వ్యాసం రాస్తూ కొన్ని పుస్తకాల్నీ, కథల్నీ పరిశీలించాను. రచయితల కంటే రచయిత్రులే కథలకి ఎక్కువగా
ఇంగ్లీష్ శ్షీర్షికలు పెట్టారని నాకు అనిపించింది. అంటే రచయిత్రులకి ఇంగ్లీష్ భాషాభిమానం లేదా ఆ భాష వ్యామోహం ఎక్కువగా వుందా?
ఇవి చూడండి : పి.సత్య వతి : సూపర్ మామ్ సిండ్రోమ్, పేపర్ వెయిట్; బీకే.వరలక్ష్మి : గేప్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్; ఆర్.శశికళ : డ్రాపవుట్, స్కూల్ ఫస్ట్, బై మిస్టేక్; ఎం.ఆర్. అరుణ కుమారి : టచ్ మి నాట్, ఐ లవ్ ఇండియా, కేర్ కేర్; ఎస్.జయ : బ్లాంక్ చెక్; కవిని ఆలూరి : ఫ్రమ్ అడ్రస్, ఎలక్షన్ డ్యూటీ; వాడ్రేవు వీర లక్ష్మీ దేవి : బి వేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, పేరెంట్; ముదిగంటి సుజాతా రెడ్డి : వైరస్, బ్రెయిన్ డ్రెయిన్; కుప్పిలి పద్మ : వాటర్ ఫ్రంట్, వే టు మెట్రో, కవర్ పిక్, నో ఎగ్జిట్, ఫూలింగ్, ది లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్, మదర్ హుడ్ ఏ రియాల్టీ చెక్, సెకండ్ హస్బెండ్, బ్రేకప్ బొకే, ఇన్స్టెంట్ లైఫ్, విడిఆర్ఎల్, క్యూట్ గర్ల్; జి.లక్ష్మి : థర్డ్ ఆప్షన్, డి.లీట్, రూట్ కెనాల్; సి.సుజాత : కండీషన్డ్ ప్లాంట్, త్రీ ఇన్ వన్, స్మైల్స్ ఫర్ సేల్; చంద్రలత : రిమోట్ కంట్రోల్, కొలీగ్స్, స్పెసిమన్; సాహితి (ఎస్.శ్రీ దేవి) : లివింగ్ టు గెదర్; పసుపులేటి గీత : ట్రోజన్ హార్స్ ... రచయిత్రులు పెట్టిన కథల పేర్లు ఇవి.
రంగనాయకమ్మ గారు 84 కథలు రాసారు. వాటిలో 22 కథల ప్రచురణని ఆపేసారు. పునర్ముద్రణ ఆపేసిన వాటితో కలుపుకుని మొత్తం 84. ఇన్ని కథల్లోనూ ఒక్కటంటే ఒక్క కథకి కూడా ఇంగ్లీషు పేరు లేదు. అన్నీ తెలుగు పేర్లు.
మగవాళ్ళు తమ కథలకి ఇంగ్లీషు పేర్లు పెట్టలేదని కాదు. మగవాళ్ళు కూడా తమ కథలకి ఆంగ్ల శీర్షికలు పెట్టారు. రచయిత్రులే తమ కథలకి ఎక్కువగా ఇంగ్లీషు పేర్లు పెట్టారని నేను పరిశీలించిన పుస్తకాల నించి నాకు కలిగిన అభిప్రాయం.
ఈ రచయిత్రులు అందరూ కూడా తెలుగు రాష్ట్రాలలో వున్నవాళ్ళు. వీళ్ళు రాసిన ఈ కథలు అన్నీ దాదాపుగా తెలుగు సమాజానికీ, తెలుగు కుటుంబాలకీ, తెలుగు నేలకీ, తెలుగు సంస్క ృతీ సాంప్రదాయాలకీ, ఆచార వ్యవహారాలకీ, అలవాట్లకీ, తెలుగు వాళ్ళ వ్యక్తిత్వాలకీ సంబంధించినవి. తెలుగు రాష్ట్రాలలో వున్న వీళ్ళు తెలుగు కథలకి ఇంత ఎక్కువగా ఇంగ్లీష్ పేర్లు పెట్టారు కదా! మరి ప్రవాస భారతీయ రచయితలు రాసిన కథలు కూడా చూద్దాం!
ఆరి సీతారామయ్య 14 కథలతో 'గట్టు తెగిన చెరువు' కథా సంపుటిని వెలువరించారు. ఇందులో రెండు కథల నేపధ్యం భారత దేశం. మిగతా 12 కథలూ అమెరికా జీవితాలూ, అక్కడి చదువులూ వాటికి సంబంధించినవే. ఈ 14 కథల్లో 'థ్యాంక్స్.. మామ్!' పేరుతో ఒక్క కథ మాత్రమే ఆంగ్ల శీర్షికతో వుంది. తెలుగు మాతృభాష కాని ఒక అమెరికన్ పిల్లవాడు వాళ్ళ అమ్మకి చెప్పిన సందర్భం. ఆ కథకి ఆ శీర్షిక పెట్టడమే సరైనది. మిగతా 13 కథలూ తెలుగు పేర్లతోనే వున్నాయి. 'కేన్యా టు కేన్యా' పేరుతో ఈ రచయితే రాసిన మరో సంపుటిలో 15 కథలు వున్నాయి. ఇందులో ఒక్క కథ మాత్రమే మన దేశ నేపధ్యంలో రాసింది. రెండు ఇండోనేషియాకి చెందినవి. మిగతా 12 కథలూ అమెరికా జీవితాలకి సంబంధించినవే! ఈ 15లో 3 కథలకి ఇంగ్లీషు శీర్షికలు వున్నాయి. అవి : లైఫ్ సైన్స్, టెస్ట్, కేన్యా టు కేన్యా.
మరో ప్రవాస రచయిత జె.యు.బి.వి. ప్రసాద్ రెండు కథా సంకలనాలు తెచ్చారు. ఒక దాంట్లో కొన్ని వ్యాసాలు కూడా వున్నాయి. 'ఆ కుటుంబంతో ఒక రోజు' సంపుటిలో 20 కథలు వున్నాయి. ఇందులో 10 అమెరికా నేపధ్యంలోనూ, 10 కథలు ఇండియా నేపధ్యంలోనూ రాసినవి. ఈ 20 కథల్లోనూ ఒక్క కథకి కూడా ఇంగ్లీషు శీర్షిక లేదు. అన్నీ తెలుగు పేర్లే. ఈయనదే మరో కథల, వ్యాసాల సంకలనం 'పెళ్ళాల పులి'. ఇందులో 8 కథలు వున్నాయి. 3 ఇండియా జీవితాలకీ , 4 కథలు అమెరికా జీవితాలకీ, ఒక కథ అమెరికాలో వున్న కొడుక్కి ఇక్కడి విశేషాలతో అమ్మ ఉత్తరం రాయడం. ఈ కథల్లో ఒకదానికి మాత్రమే ఆంగ్ల శీర్షిక వుంది. అది 'మదర్స్ డే'. ఈ డే మన సంస్క ృతి కాదు. బాగా ముదిరి పోయిన అమెరికన్ పెట్టుబడి దారీ సమాజం సరుకులు అమ్ముకోవడానికి రకరకాల డేలు సృష్టిస్తుంది. ఫాదర్స్ డే, వాలైంటైన్స్ డే, థ్యాంక్స్ గివింగ్ డే .. అలాంటిదే మదర్స్ డే! అమెరికాలో వున్న మనవాళ్ళు ఈ డే జరుపుకోవడం గురించి రాసిన కథ. మదర్స్ డేని తెలుగులో రాయాలంటే అమ్మల రోజు అనో, తల్లుల దినం అనో, అమ్మల దినం అనో రాయాలి. అది వికారంగా, అసహ్యంగా వుంటుంది. తెలుగు శీర్షిక పెట్టాలని ఒక నియమం పెట్టుకుని మరో పేరు పెట్టి వున్నట్లయితే ఈ కథ జీవమూ, పరువూ పోయేది. మదర్స్ డే అని పేరు పెట్టడమే ఈ కథకి బలమూ, న్యాయమూ!
సాయి బ్రహ్మానందం గొర్తి రాసిన 25 కథలతో 'సరిహద్దు' సంకలనం వచ్చింది. ఇందులో ఇండియా నేపధ్యంలో 12 కథలూ, అమెరికాకి చెంది 12, కెనడా నేపధ్యంలో ఒక్క కథ వున్నాయి. అన్నీ మంచి కథలే. వీటిలో ఒక్క కథకి కూడా ఇంగ్లీష్ శీర్షిక లేదు. 25 తెలుగు శీర్షికలతో వున్న కథలే. మరో రచయిత కన్నెగంటి చంద్ర 'మూడో ముద్రణ' సంపుటిలో 22 కథలు వున్నాయి. ఇందులో 7 అమెరికా, 15 ఇండియా జీవితాలకి సంబంధించినవి. అన్నీ తెలుగు పేర్లతో వున్న కథలే.
'సిలికాన్ లోయ సాక్షిగా' పేరుతో డా.కె.గీత రాసిన 18 కథలతో ఒక సంపుటి వచ్చింది. (ఈమె కథా రచయిత్రి
కె.వరలక్ష్మి గారి కూతురు ) ఇందులోని 18 కథలు వరుసగా : 1. స్పానిష్షూ - ఉష్షూ 2. వర్క్ ఫ్రమ్ హౌం 3. డిపెండెంటు అమెరికా 4. కాలేజీ కథ 5.డ్రైవింగ్ - లైసెన్స్ 6.ఫుడ్డు - వేస్టు ఫుడ్డు 7. హౌం లెస్ 8. ఇల్ హెల్త్ -ఇన్సూరెన్సు 9. సింగిల్ మామ్ 10. ఓపెన్ హౌస్ -1 .11. ఓపెన్ హౌస్ -2 .12.లాప్ టాప్ కథ -1. 13. లాప్ టాప్ కథ -2 .14. లివ్ ఎ లైఫ్ 15. చైల్డ్ కేర్ 16. రిపేర్ ఇన్ అమెరికా 17. ఫీనిక్స్ 18. అమీగాస్. ఇందులో తెలుగు శీర్షికతో వున్న కథలు ఎన్ని? కనీసం ఒక్కటైనా వున్నదా? పాఠకుడి చెంతకి కథ వేగంగానూ, సులభంగానూ చేరాలంటే తెలుగు శీర్షికతోనే వుండాలి. అప్పుడే పాఠకుడు పేజీ తిప్పకుండా మరో కథలోనికి పోకుండా ఆగిపోయి అది చదివే తరువాత కథలోనికి వెళ్ళి పోతాడు. నిన్నటి తరం రచయితల గొప్ప కథలూ, మంచి వస్తువుతో, మంచి భావాలతో రాస్తున్న నేటి తరం రచయితల కథలూ మనకి ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి.
తప్పనిసరి అయితేనూ, నిత్య జీవితంలో వాడే పదం అయితేనూ, తెలుగు భాషలో కలసి పోయిన పదం అయితేనూ, బలం చేకూరుతుందనుకుంటేనూ అనివార్యమైన పరిస్థితిలోనే కథకి ఇంగ్లీషు శీర్షిక పెట్టవచ్చు. అయితే తెలుగు కథకి తెలుగు పేరు పెట్టడమే సమంజసమూ, సమర్థనీయమూ, సహేతు కమూ, సరైనదీనూ! తెలుగు శీర్షికతో వుంటేనే నిస్సందేహంగా పాఠకుడు ఉత్సాహంగానూ, ఆసక్తిగానూ, ఆనందంగానూ కథని ఆస్వాదిస్తూ చదివి ఆలోచిస్తాడు. పాఠకుడు కథని చదివాడూ అంటే ఆ రచయితా, రచయిత్రీ లక్ష్యం పూర్తిగా నెరవేరినట్లే కదా!