పిల్లా తిరుపతిరావు
70951 84846
బాల సుధాకరమౌళి .. ఒక సామాజిక ఉపాధ్యాయుడు. నేడు సమాజంలో ఉపాధ్యాయులు అనేక రకాలుగా కనబడతారు. ఒక చట్రంలో బిగించబడి పాఠశాల విధులకు పరిమితమయ్యే వారు కొందరైతే, ప్రాపంచిక దృక్పథంతో బోధనను బాధ్యతగా భావించేవారు మరికొందరు. మౌళి రెండో కోవకు చెందుతారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోనే సరిపెట్టుకోరు. బోధనకు ఆవల ఉన్న సామాజిక బాధ్యతను గుర్తెరిగినవారు. ఆ బాధ్యతను పిల్లలు ఎత్తుకునేలా చేస్తారు. ఉపాధ్యాయునికి పుస్తక పఠనం అనివార్యమని నమ్మే వ్యక్తి. చారిత్రక అంశాలతో పాటు వర్తమాన విషయాలను ఆకళింపు చేసుకునేలా ప్రతి ఉపాధ్యాయుడూ ఉండాలి. అందుకే ఉపాధ్యాయుణ్ణి నిత్య విద్యార్థి అంటారు. గురువు కేవలం పుస్తకాల్లో ఉండే అంశాలనే విద్యార్థులకు బోధిస్తే సరిపోదు. రాజకీయ సామాజిక నేపథ్యాలు, ఆ నేపథ్యాల మాటున నలిగిపోతున్న జనం, వారి అవసరాలు, ఆకాంక్షలు బోధించే ఉపాధ్యాయుడే భావి పౌరులపై గాఢంగా ముద్ర వేయగలడు. విద్యార్థులలో మానవీయ కోణాలను ప్రోదిచేస్తూ, సామాజిక స్ప ృహను కలిగించేలా మౌళి బోధన చేస్తారు. మౌళికి ఈ బోధనలో అతడి నిరంతర సమగ్ర అధ్యయనం తోడయ్యింది. ఆ భావనలు, అధ్యయనాలలోంచి అతని కవిత్వం పుడుతున్నది. ఆ కవిత్వానికి ఒక నిర్ధిష్టమైన దృష్టికోణం ఉంది. ఆ కోణంలోంచి మౌళి విభిన్నమైన సామాజిక, రాజకీయ కవిత్వ సృజన చేస్తున్నారు.
'జాతి నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది'... అన్న డి.ఎస్.కొఠారి మాటలను మౌళి గుర్తెరిగినవారు కాబట్టే తన 'తరగతి గది స్వప్నం' దీర్ఘ కవితలో 'ఈ దేశ తరగతి గదులన్నీ ఫలవర్ధకమైనప్పుడే ఈ కవితకు సజీవిత' అన్నారు. 'నా చుట్టూ అలుముకున్న రాజకీయ సామాజిక ఆవరణం ఈ కవిత పుట్టుకకు ప్రేరణ. నా కార్యస్థానం ఈ కవితకు కేంద్రస్థానం' అని ఉద్ఘాటిస్తారు. ఇంకా 'ఈ భూమ్మీద గొప్ప ప్రదేశాలుగా విద్యార్థులకు నేను తరచూ చెప్పేవి రెండు. ప్రజలు ఆకలిని తీర్చి శక్తిని కూర్చే పంటభూమి ఒకటైతే, నూతన తరాన్ని తయారు చేసే తరగతి గది రెండోది' అని నమ్ముతారు.
ఒకే వస్తువుతో నడిచేది దీర్ఘ కవిత. ఆ వస్తువు యొక్క ఇమేజస్ ను కవి అర్థవంతంగా చూపాలి. ఈ కవితలో తరగతి గది వాతావరణమే పూర్తిగా ప్రతిబింబిస్తుంది. ఈ ప్రయత్నంలో మౌళి శతశాతం కృతకృత్యులయ్యారు. మౌళి తరగతిగది ఔన్నత్యాన్ని ఇలా నిర్వచిస్తాడు : 'అతనికి తరగతి గది భూమి అడవి సముద్రం/ తరగతి గది రాబోవు చరిత్రకు ఇప్పటి బీజాక్షరం/తరగతి గది మానవ మహా చైతన్య శిఖరం/ అతనికి తరగతి గది/ ఆదిమ చూపుని జ్వలింపజేసిన/ తొలి కార్యక్షేత్రం' తరగతి గదిలో తెలియనిది, నేర్చుకోలేనిది ఉండదు. ఆట, పాట, మాట అన్నింటిలో ప్రావీణ్యత నేర్పేది. సమాజ స్థితిగతులను అర్థవంతం గా బోధించేది. విద్యార్థి నిరంతర జ్ఞాన దాహార్తిని తీర్చేది. ఇలా చెప్పుకుంటే పోతే సకల దఅశ్యాలను తరగతిగదే ఆవిష్కరింప జేస్తుంది. అందుకే తరగతిని మౌళి ఉదాత్తమైన కార్యక్షేత్రంగా ఎంచుకున్నాడు.
'అక్షరం శిశువు/ కాళ్లూ చేతులూ ఆడిస్తూ/ కొత్తగా లోకానికి పరిచయమౌతుంది/ అక్షరాన్ని తరగతి గది అమ్మై సాకుతుంది/నాన్నై నడక నేర్పిస్తుంది/ అక్షరం బుడిబుడి అడుగులు వేస్తూ/ఆనందంతో తుళ్ళిపడుతుంది/ తరగతి గది/ నడుస్తున్న తరాన్ని పొత్తిళ్లలో పెట్టుకుని/ అదృశ్య నేత్రాలతో కాపాడే/ మాతృమూర్తి' భావితరాన్ని తన పొత్తిళ్లలో పెట్టుకొని రక్షించే కన్నతల్లిగా కవి తరగతిని వర్ణిస్తాడు. మనిషి జీవన గమనంలో తరగతికే మొదటి ప్రాధాన్యత ఇస్తాడు.
అక్షరాన్ని గూర్చి ప్రాణప్రదమైనదిగా కవి చెబుతాడు. 'అక్షరం ప్రాణమున్న సజల నేత్రం/ రెండు గాలితిత్తుల జీవన సౌరభం/అక్షరం ఎన్నిసార్లు గాయపడుతుందో/ అన్నిసార్లూ గాయానికి లేపనమౌతుంది/ అక్షరం గాయాల్ని మాన్పే సంజీవిని/ ఓటమిపై రౌద్రంగా పిడికిలిని బిగించే/ ధిక్కార కేతనం' అక్షరానికి ఉన్న
ధైర్యసాహసాలు, శక్తియుక్తులు మరిదేనికీ లేవంటాడడు.
'కలలు కలలు కలలు/ కలల కెరటాలు/ ఎడారి భూమిలోంచి పచ్చని అరణ్యం/ మొలిచే కలలు/ కటిక చీకటి కారుమబ్బుల్లోంచి/కడలి హౌరు వినిపించే కలలు/ కలలంటే నా తరగతి గది/హృదయ కవాటాల చప్పుళ్లే/ కలలంటే నా తరగతి గదిలో/ క్షణ క్షణం వినిపించే/ విముక్తి గీతాల ఉప్పెనలే' తరగతిని కలలు కనే ప్రదేశమంటాడు. ఆ కలలు తీరే ప్రపంచమంటాడు. అనేక విముక్తి ఉద్యమాల గీతాలను ఆలపించే ఉద్యమ క్షేత్రంగా నిలబెడ తాడు. ఇది తరగతి గది విశిష్టతకు పరాకాష్ట.
'స్వేచ్ఛగా ఎగరాల్సిన అక్షరం/ సంకెళ్ల బరువుతో తూలి పోతోంది/ అక్షరం/ జైలుశిక్ష అనుభవిస్తుంది/ జైలుశిక్ష కలలు మరణిస్తున్న జైలుశిక్ష/ కాంతి/ నిష్కాంతవుతున్న జైలుశిక్ష/ ఎగిసే నిప్పుల సెగపై/ నీళ్లు చిలకరిస్తున్న జైలుశిక్ష' నేడు అక్షరయోధులు స్వేచ్ఛగా సామాజిక అక్షర విన్యాసం చేయలేకపోతున్నారు. కారణం అరాచక వాదులుగా, అర్బన్ నక్సల్స్గా రాజ్యం ముద్రవేస్తున్నది. అక్షరం చైతన్య దీప్తులను వెలిగిస్తుందనే భయంతో పాలకులు ముందే అక్షరానికి జైలుశిక్ష విధిస్తున్నారు.
అక్షరం గూర్చి ఇలా అంటాడు: 'అక్షరం చూపు కోల్పోతుంది/ అక్షరం నడక మారిపోతుంది/కదం తొక్కాల్సిన సమయంలో/కరిగి నీరైపోతుంది/ తలని కిందకి వాల్చి/ మోకాలిపై కూలి పోతుంది/ తరగతి గది మౌనంలోకి/ కూలిపోతుంది'. ఒక్కోసారి అక్షరం తన ఉనికిని కోల్పోయి, తన బాధ్యతను వదిలి పక్కదారుల్ని వెతుకుతోంది. ప్రలోభాలకు లోనవుతుంది. దాని పర్యవసానం 'రెక్కల చప్పుడు లేని ఒక తరం/ గురిలేని తరం పాడలేని తరం/ ఊహలేని తరం' తయారవుతోందని కవి విలపిస్తున్నాడు.
తరగతి గదుల్లో నడయాడే పిల్లల భౌతిక రూపాలను కవిలా బొమ్మకడతాడు... : 'పిల్లలు పిల్లలు పేదపిల్లలు/ పూలులాంటి పిల్లలు/ పూరిగుడిసెల పిల్లలు/ ఉల్లికాడల కాళ్లతో/ పగుళ్లుదేరిన మడమలతో/ జీవన విషాదంలోంచి/ బడికి వస్తున్న పిల్లలు/నోటి నిండా అన్నం ముద్ద/ ఎరగని పిల్లలు/ కళ్లనిండా నిద్రపోని పిల్లలు/ వెలివేయబడిన పిల్లలు/ చెప్పుల్లేని చిట్టిపొట్టి పిల్లలు/చెమట కారుతున్న పిల్లలు/ తట్ట నెత్తిన పెట్టుకుని పేడకళ్లు తీసే పిల్లలు/ కల్లం చుట్టూ తిరిగి తిరిగి/ కసవ పూడ్చే పిల్లలు/ పెండుల్లో పడి గొడ్లు కాసే పిల్లలు' ప్రభుత్వ బడుల్లో బీదవర్గాల పిల్లలే కనబడతారు. వారికి సరైన పోషకాహారం దొరకదు. బక్కచచ్చిన ఆకారాలతో దర్శనమిస్తారు. తరచూ బడికి గైర్హాజరవుతూ ఉంటారు. వాళ్లంతా బాల కార్మికులే. వారు అనివార్యంగా తల్లిదండ్రులకు సాయమందించాలి. శ్రీశ్రీ శైశవగీతిలో పిల్లలను వర్ణించే తీరుకు భిన్నంగా మౌళి ఇక్కడ రూపుకట్టారు. 'మబ్బుల్లోంచి రాలే చినుకులు పిల్లలు/ ఆకుల్లోంచి వీచే చిన్నారి గాలులు పిల్లలు/ మట్టిలోంచి మొలిచే లేలేత
మొలకలు పిల్లలు' ఇలా మౌళి పిల్లలను కొత్తగా దర్శించారు.
'కాలం తరగతి గదుల్లో కరిగిపోతుంది/ పాఠాలు పాఠాలు
పూర్తి ఐపోతున్నాయి/ పిల్లలు రాత్రి పగలూ యంత్రాల్లా/పనిచేస్తున్నారు/ సృజన లేని పిల్లలు/ ఊహలేని పిల్లలు/ గాల్లో ఈలలు వేయలేని పిల్లలు/ మట్టితో బొమ్మలు చేయలేని పిల్లలు/మబ్బుల్లో ఏనుగులను చూడలేని పిల్లలు/ ఏనుగులెక్కి వూరేగలేని పిల్లలు/ కాగితాలతో పడవలు చేయలేని పిల్లలు/ ఇసుకలో గూళ్లు కట్టలేని పిల్లలు/ పక్షుల్లా ఎగరలేని పిల్లలు/ చేపల్లా ఈదలేని పిల్లలు/ కీలుబొమ్మలు పిల్లలు/ మరబొమ్మలు పిల్లలు/ చదువుల జైళ్లలో బాల్యం బందీ అవుతున్న/ పిల్లలు'
... ఇలా పిల్లల దయనీయ స్థితి గోచరిస్తుంది.
గతకాలపు పిల్లలు అనేక విషయాల్లో ప్రావీణ్యత కలిగి ఉండేవారు... అప్పటి విద్యా విధానం ఒత్తిడి లేనిది కాబట్టి. బోధనలో ఉపాధ్యాయుడికి స్వేచ్ఛ ఉండాలి. విద్యార్థి అభ్యసనంలో స్వేచ్ఛ ఉండాలి. సృజనాత్మకత తరం తయారీకి ఇవే మూలాలు. నేటి కసాయి పాలకులు విద్యను కాషాయీకరణ చేస్తున్నారు. తమకు నచ్చని సిలబస్ను తొలగిస్తున్నారు. ఈ విధానాల వల్ల తరం నిర్వీర్యమౌతున్నది. జాతి అడుగంటిపోతున్నది. ప్రశ్నించేతత్వాన్ని కోల్పోతున్నది. పాలకుల మాయలో పడే తరం తయారవుతున్నది. ఇది ఇలాగే సాగితే భావితరం సొట్టలు పోక తప్పదు.
'పరీక్ష గదులు శవాలను కుప్పపోసిన/ మార్చురీలు/ పరీక్ష గదులు మృత్యువాసనతో/ వర్ధిల్లుతాయి/ వరసలు వరసలుగా అంగడిసరుకుల్లా/ పిల్లలు/ పిల్లలు కలలూ అమ్మకానికి తూగే/సరుకుల్లా/ బాల్యం చితికిపోతున్న పిల్లలు/ బాల్యంలోనే వృద్ధులౌతున్న పిల్లలు' .. ఇలా హేతుబద్ధతలేని మూల్యాంకనాన్ని కవి తప్పుబడతాడు. తీవ్ర ఒత్తిడి వల్ల పిల్లల్లో మానసిక సమతుల్యత దెబ్బతిని, సహజత్వం నశించిపోయి రోగులౌతున్నారు. బాల్యంలోనే వృద్ధాప్యాన్ని చవిచూస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకర మైన స్థాయి. ఇది మారాలి. మార్పు కోసం అందరూ ఐక్యంగా ఉద్యమించాలి. ఇదే కవి లక్ష్యం.
'అతడు విలుకాడు/ నిద్రలోనైనా లేపి గురిచూడమంటే/ అర అంగుళమైనా/ గురి తప్పనివాడు/ వాక్యం విల్లులోంచి అక్షరాన్ని/బాణంలా వదులుతాడు/ అతడు రాలిన ఆకులతో రగడ పుట్టిస్తాడు/చెదిరిన మట్టితో గూడు నిర్మిస్తాడు' ఇది ఉపాధ్యాయుడి శక్తి సామర్ధ్యాల మీదా, బాధ్యత పైనా కవి చెప్పే మాటలు. అవును కదా.. ఉపాధ్యాయుడే తరగతికి మూలం. తన పిల్లలకు సకల జన జీవితాలను పరిచయం చేస్తాడు. అణగారిన వర్గాల స్థితిగతులను కళ్ళముందుంచుతాడు. పిల్లల కలలను సాకారం చేస్తాడు. అందుకే అతన్ని ఆరితేరిన విలుకాడంటాడు కవి. ఇలా ఈ దీర్ఘ కవితను స్ఫూర్తిదాయకంగా ముగిస్తాడు.