
కెపి అశోక్ కుమార్
97000 00948
ప్రముఖ విమర్శకుడిగా పేరుగాంచిన చందు సుబ్బారావు కవి, కథకుడు, నవలాకారుడు కూడా. చదివింది సైన్స్ అయినప్పటికీ, మొదటినుండి చందు సుబ్బారావు సాహిత్యం పట్ల ఎక్కువ ఆసక్తి కనబరిచేవారు. క్రమంగా అతనిలో సాహిత్యాభిలాష పెరగడంతో చివరకు ఆంధ్రా విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు తన క్లాసు పుస్తకాలు పక్కనబెట్టి, అక్కడి గ్రంథాలయంలో వున్న తెలుగు సాహిత్యాన్ని అంతా క్షుణ్ణంగా మధించి శోధించాడు. తనపై గురజాడ, శ్రీశ్రీ, గుర్రం జాషువాల ప్రభావం వుందని చెప్పుకునే చందు సుబ్బారావు దాదాపుగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో కృషి చేశాడు. కవిత్వం రాశాడు. నలభైకి పైగా కథలు, ఎనిమిది నవలలు, అయిదు విమర్శా గ్రంథాలు వెలువరించారు. విషయ నిపుణుడిగా అతను రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి.