సాహిత్య ప్రస్థానం, మార్చి 2023

ఈ సంచికలో ...

కథలు
బ్యాంకాకులు : వి.రెడ్డెప్ప రెడ్డి
అంచనాలు : పి.శ్రీనివాస్‌ గౌడ్‌
జీవ వైవిధ్యం : పిఎల్‌ఎన్‌ మంగారత్నం
ఇద్దరూ ఒక్కరే! : కుడుపూడి శ్రీను

కవితలు
ఊపిరి శబ్దం నాన్న : పుట్టి గిరిధర్‌
ఎర్ర కవల గులాబీలు : కవి కొమ్మవరపు
రాజమండ్రి పద్యం : మెట్టా నాగేశ్వరరావు
పాలకోవా బిళ్ళ : వంజారి రోహిణి
ఎదురీది చూడు : శ్రీదేవి సురేష్‌ కుసుమంచి
నది ప్రశ్నిస్తోంది : నూతలపాటి సాంబయ్య
ఆమెకు ప్రేమతో ... : గంగవరపు సునీత

బ్యాంకాకులు

వి. రెడ్డెప్ప రెడ్డి
94400 44922

ఢిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రి, గుండెజబ్బుల విభాగం, దేవళంపాడు చలమేశ్వరకు కృత్రిమశ్వాసకై వారంపాటు అమర్చిన వెంటిలేటరును తప్పించి 2022, జనవరి, పదిహేనవ తేదీన మరణ ప్రకటన వెలువడింది. ఉత్తమ దినాల్లో చావు, శ్రాద్ధకర్మ జరిగితే మోక్షప్రాప్తి లభిస్తుందని నమ్మి వారంపాటు వెంటిలేటరుపై ఉంచారు. చలమేశ్వర కొడుకు పరమేశ్వరను పరామర్శించడానికి వచ్చినవారు ''మీ తండ్రి ఉత్తరాయణ ప్రవేశ పుణ్యకాలంలో స్వర్గస్థులయ్యారు. పుణ్యలోకాలకు వెళతారు'' అన్నారు. పదమూడవ రోజు ''ఉత్తరాయణం, గురువారం, దశమి పుణ్యతిధినాడు శ్రాద్ధకర్మ నిర్వహిస్తుండడంతో మీ తండ్రికి స్వర్గప్రాప్తి లభిస్తుంది'' అంటూ కర్మ నిర్వహించిన స్వాములూ చెప్పారు.
చలమేశ్వర దైవభక్తి అందరికీ తెలిసిందే. అంతకుముందు ఏ మేర పాటించేవారో తెలీదుకానీ, ఎంపీ అయ్యాక అతడికి దేవుడిపై భక్తి పెరిగిందని తెలిసినవాళ్లంటారు. ఎంతగా అంటే, పూజాసమయానికి బయలుదేరవలసి వచ్చినా, లేదా పూజాసమయానికి దిగలేనేమోననిపించినా విమానం కూడా ఎక్కేవాడు కాదు. పూజావేళలు తప్పించే పార్లమెంటుకు కూడా హాజరయ్యేవాడు.

భూత భవిష్యత్‌ వర్తమానాల 'పుస్తకాలం'

ఎమ్వీ రామిరెడ్డి
98667 77870

చిరిగిన చొక్కానైనా తొడుక్కోబీ ఒక మంచి పుస్తకం కొనుక్కో.
- కందుకూరి వీరేశలింగం
మనసులేని మనిషి, పుస్తకం లేని ఇల్లు నిరర్థకం. ఆస్తులూ అంతస్తులూ సమస్త బాంధవ్యాలూ కోల్పోయినా, పుస్తకం ఒక్కటీ తోడుగా ఉంటే చాలు. అది మనల్ని పునర్నిర్మిస్తుంది. రక్తమాంసాలు ఎక్కిస్తుంది. జవజీవాలు ప్రసాదిస్తుంది. ఇంత సాహిత్యాన్ని ప్రసాదంగా పెడుతుంది. సాహిత్యం జీవితాన్ని ఉన్నతీకరిస్తుంది. సమాజాన్ని సమున్నతం చేస్తుంది. పుస్తకాలు ప్రసాదించిన వెలుగులోనే ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకున్న, తీసుకుంటున్న మహానుభావులు ఎందరో ఉన్నారు.
కానీ, ప్రస్తుతం పుస్తకం బిక్కమొహం వేసి దీనంగా చూస్తోంది. తనను తాకే చేతుల సంఖ్య తగ్గిపోయిందన్న దిగులుతో కుంగిపోతోంది. డిజిటల్‌ యుగంలో తన ప్రాధాన్యాన్ని విస్మరిస్తున్న మనిషి వంక జాలిగా చూస్తోంది. పుస్తకం విలువ తెలియని మనిషి కళాహీనంగా, చైతన్యరహితంగా నిస్సారమైన జీవితాన్ని అనుభవిస్తాడన్న జాలి అది. పుస్తక ప్రాభవం గుర్తించని వ్యక్తులు ఈ సమాజంలో వెలుగుధారలు నింపలేరన్న జాలి అది.

అంచనాలు

పి.శ్రీనివాస్‌ గౌడ్‌
99494 29449

''హలో సురేష్‌..''
''ఆఁ.. ఆంటీ..''
''ఏమనుకోకయ్యా.. చాలామంది వున్నారని మాట్లాడలేక పోయాను''
''ఏం పర్లేదు ఆంటీ.. అర్థం చేసుకోగలను..''
''మొన్న ఒక సంబంధం వచ్చిందని చెప్పా కదా..''
''ఏది ఆంటీ..''
''అదేనయ్యా.. వైజాగ్‌ది..''
''ఆఁ..ఆఁ..''
''అమ్మాయి ఫొటోలో బాగా డామినేటింగ్‌గా కనపడుతుంది. వయసు కూడా ఎక్కువగానే వున్నట్టుంది..''
''వెళ్లి చూసొస్తానన్నట్టున్నారుగా, ఆంటీ..''
''ఆఁ.. ఏం వెళ్లడం.. నేనే ఎగరగొట్టేశాను..''
''అదేంది.. ఎందుకాంటీ..?''
''ఆఁ.. ఆ పిల్ల అంత అణకువగా అనిపించలేదయ్యా.. రేపు వచ్చి మన మీదే పెత్తనం చేస్తే..?''
''ఒట్టి ఫొటో చూసి అలా అనుకోవచ్చా ఆంటీ..?''
''ఆ.. మొఖం చూసి కొన్ని చెప్పేయొచ్చు.. నీకేం తెలుసు..''
''...............''

మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా కవులూ, రచయితలూ గొంతెత్తాలి!

అరసం రాష్ట్ర మహాసభల పిలుపు

- కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ
ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర 19వ మహాసభలు, 80వ వార్షికోత్సవాలు ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఉత్తేజపూరితంగా జరిగాయి. మహాసభలకు ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల నుంచి 200 మంది ప్రతినిధులుగా హాజరయ్యారు. సరిగ్గా 80 ఏళ్ళ క్రితం ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం ప్రథమ మహాసభల ఆతిథ్యం ఇచ్చిన తెనాలి ఇప్పుడు మరోసారి మహాసభల వేదిక అయింది. అభ్యుదయ సాహిత్యోద్యమ నాయకులు ప్రముఖ రచయిత అమరజీవి బొల్లిముంత శివరామకష్ణ సాహిత్య ప్రాంగణం (శ్రీ తెనాలి రామకష్ణకవి కళాక్షేత్రం)లో 11వ తేదీ ఉదయం అరసం గౌరవ అధ్యక్షులు డా|| పి.సంజీవమ్మ అరసం పతాకను ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించారు. మహాసభల ఆవరణలో ప్రముఖ చిత్రకారులు ఎన్‌.వి. రామశాస్త్రి చిత్రించిన కవులు, రచయితల రేఖాచిత్రాల ప్రదర్శనను, పుస్తక ప్రదర్శనను ప్రొఫెసర్‌ గుజ్జర్లమూడి కపాచారి ప్రారంభించారు.
ప్రారంభ సభకు అరసం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షత వహించగా, ఆహ్వాన సంఘం అధ్యక్షులు ప్రముఖ రచయిత సాయిమాధవ్‌ బుర్రా స్వాగతోపన్యాసం చేశారు. అరసం ఉద్యమ చరిత్రలో తెనాలి ప్రాధాన్యతను, తెలుగు సాహిత్య రంగంలోని తెనాలికి చెందిన ప్రముఖ రచయితలను ప్రస్తావించారు. యువ రచయితలను ప్రోత్సహించాలని, వారికి శిక్షణా కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని అన్నారు.

జీవ వైవిధ్యం

పి.ఎల్‌.ఎన్‌. మంగారత్నం
97014 26788

ఆ రోజు ఉదయం ..
తొమ్మిది గంటలకు నేనింకా .. వంటలో ఉండగానే వీధి గుమ్మంలోనుంచి ఉషామణి గారి నుంచి పిలుపు. నన్ను పేరుతో పిలిచేది ఆవిడ మాత్రమే!
రెండు బ్లాకులుగా కట్టిన ఈ అరవై పోర్షన్ల అపార్టుమెంటులో మిగిలిన వాళ్లందరికీ నేను 'అంటీ'నే. పిల్లలకైనా, పెద్దలకైనా. ఇంకా ఉంటే .. వాళ్ళ మనవలకైనా. రిటైరు అయి రెండేళ్ళు గడిచిన నా వయసు కన్నా .. మరో పదేళ్ళు పెద్దది ఆవిడ.
మా డోర్‌ కర్టెను పక్కకు లాగి పట్టుకుని, లోపలి తొంగి చూస్తూ 'పనిలో ఉన్నారా?' మళ్ళీ అడిగింది.
ఉదయం, నిద్ర లేచినపుడు తీసిన తలుపు .. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడే వేసేది. అయిదవ ఫ్లోర్లోని లిఫ్ట్‌ పక్క పోర్షన్‌ అయినా సరే, అది అలానే ఉంటుంది ఎప్పుడూ. నాకు తలుపులు తెరుచుకుని ఉండే అలవాటు ఉన్నందుకేమో! ఎదురు పోర్షన్లోకి ఎవరు వచ్చినా తలుపులు బిడాయించుకునే ఉంటారు.
అలాగే, ఈవిడా. ఎంతో అవసరం అయితే తప్ప బయటకు రాదు. కనిపిస్తే పలకరించుకోవడమే. అలాంటిది ఏం అవసరం వచ్చిందో, పొద్దుటే, గుమ్మం ముందుకు వచ్చింది. ఇంతకు ముందు అయితే .. సాయంత్రాలు వాళ్ళ తలుపులు తెరిస్తే, అప్పుడప్పుడూ ఇంట్లికి వెళ్లి కూర్చునేదాన్ని. ఇంట్లో ఆవిడా, అన్న గారు ఇద్దరే ఉంటారు.
ఆవిడకి భర్త లేకపోతే .. అన్న గారికి భార్య లేదు.
ఉషామణి గారికి ఒక కొడుకూ, కూతురు అయితే .. అన్న గారికీ ఓ కొడుకూ, కూతురే. ఈవిడ కొడుకు సుదర్శనరావు హైదరాబాదులో మంచి ఉద్యోగంలో ఉంటే .. కూతురు పెళ్లై అత్తవారింటిలో ఉంది. కొడుక్కి చేసుకున్నది, ఇంకో అన్న కూతుర్నే. అయినా, ఆ పిల్లకి మేనత్త పొడగిట్టక పోవడంతో .. రిటైరు అయినా కొడుకు దగ్గరకు వెళ్లి ఉండక .. ఉన్న ఊరిలోనే ఉండిపోయింది ఒంటరిగా. ఆ తరువాతి కాలంలో, అన్నగారికి భార్యా, కొడుకూ పోవడంతో .. చెల్లెలి దగ్గరకు వచ్చేసాడట, ఆవిడది సొంత ఇల్లు కావడంతో.

సముద్ర జలాల మీద పోరాట యోధుడి సంతకం

డాక్టర్‌ కె.జి.వేణు
98480 70084

సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత ఎర్నెస్ట్‌ హెమింగ్వే 1951లో రాయగా, 1952లో ప్రచురితమై, 1953లో పులిట్జర్‌బహుమతిని, 1954లో నోబుల్‌ బహుమతిని సొంతం చేసుకున్న 'ది ఓల్డ్‌ మేన్‌ అండ్‌ ది సీ' నవల, ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదమై, కాలంతోపాటు నిలిచిన ఉత్తమ నవలల సరసన తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ నవలలో 'శాంటియాగో' పేరుగల ముసలోడు 84 రోజులు చేపల వేటకు వెళ్లినా రోజూ ఖాళీ చేతులతోనే తిరిగి వచ్చేవాడు. 85వ రోజున మళ్లీ చేపల వేటకు వెళ్లాడు. సముద్రంలోనే మూడు రోజులు రాత్రింబగళ్లు గడిపి, చివరకు 18 అడుగుల భారీకాయం కలిగిన చేపను పట్టి, దాన్ని ఒడ్డుకు తీసుకురావటానికి అతడు చేసిన పోరాటాన్ని టన్నుల కొద్ది కాగితాలనిండా విశ్లేషకులు, విమర్శకులు, సాహితీవేత్తలు తమ ప్రశంసలను అన్ని భాషల్లోనూ గ్రంథస్థం చేశారు. కాని అసలు పోరాటం జరిపిన నన్ను అనగా ముసలాడు పట్టిన భారీ చేపను మాత్రం అందరూ మరచిపోయారు. 'ఓ నా సాహితీవేత్త లారా! ప్రపంచంలో ఎందరో చేసిన పోరాటాల కంటే భయంకర మైన పోరాటాన్ని నేను చేశాను. మరి నా గురించి మీరెందుకు మాట్లాడుకోవటం లేదు. నా పోరాటాన్ని ఎందుకు ప్రశంసించటం లేదు. నా చావు పట్ల మీరెవరూ కన్నీళ్లు కార్చనక్కరలేదు, నా పోరాటాన్ని ఒక్కసారి గుర్తించండి చాలు. నవలలో కనిపించని, వినిపించని, రచయిత కలం నుంచి వెలువడని అంతర్లీన విశేషా లను తెలుసుకోవాలనుకొనే ఆసక్తి మీకుంటే ఒక్కసారి మీరంతా నాతో కలిసి సముద్రమనే మా సామ్రాజ్యంలోకి నాతో పాటు అడుగులు వేయండి.

విపరిణామాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు

కేశవ్‌
98313 114213

ద్వంద్వ ప్రమాణాలతోనూ, పతన విలువలతోనూ, ప్రగతి నిరోధక ఆర్థిక విధానాలతోనూ, దిగజారుడు మనువాద సంస్క ృతితో కుళ్ళిపోతున్న వ్యవస్థ మీద నిప్పురవ్వల్ని కురిపించిన వ్యాసాల పరంపర 'కొంచెం నిప్పు - కొంచెం నీరు'. నిద్రాణమైన పాఠకుడ్ని మండించడానికి, బాధతో, ఆవేదనతో దుఃఖించేలా చెయ్యడానికి ముందుకొచ్చాడు రచయిత అరణ్య కృష్ణ.
'ఒక సంస్కృతిని వికసింపజేయాలన్నా, విధ్వంసం చేయాలన్నా భాష ఒక బలమైన సాధనం' (పే.72). సరిగ్గా, అలాంటి భాషనే బలమైన సాధనంగా, పదునైన ఆయుధంగా, మండించే నిప్పుగా మార్చి ఈ వ్యాసాలు సమకూర్చారు. నేటి సంక్లిష్ట సామాజిక పరిస్థితుల్లో ఈ వ్యాసాల అవసరం చాలా ఉంది. సామాజిక, సాంస్కృతిక భావజాలాలను వెనక్కి తీసుకెళ్ళడానికి, ప్రజలను మరలా అంధకారంలో తోసెయ్యడానికి అహర్నిశలూ ప్రయత్నం చేస్తూ, అనుక్షణం ప్రగతి నిరోధక భావాలను వ్యాప్తి చెయ్యడానికి వెనుకాడని హిందూత్వ భావజాలం నేపథ్యంలో పుకార్లకూ, నిజాలకు మధ్య భేదాన్ని తెలుసుకొని, రాజ్యం వర్గ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకంలోని అన్ని వ్యాసాలూ దోహదపడతాయి.

భాషా దోషాల నివారణకు జాగ్రత్తల సూచి

దొండపాటి కృష్ణ
90523 26864

ప్రస్తుతమున్న శాస్త్ర సాంకేతిక, పోటీ ప్రపంచంలో మాతృభాషలో నెగ్గుకురావడం కష్టమని చాలామంది అభిప్రాయం. అదే నిజమనుకుంటే పరభాషలు రానివారు ఎలా మనుగడ సాగించగలుగుతున్నారనేది సమాధానం లేని ప్రశ్న. పరభాష అనేది మనం నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరడానికి ఊతమందించే చిన్న ఉపకరణం మాత్రమే! అదే పూర్తి జీవితం, జీవనమూ కాదు.
కథలు, కవిత్వం, నవలలు... ఏదైనా సాహిత్య ప్రక్రియలో మనమెంత అందుబాటులో ఉన్నామనే అంశం మీద తెలుగు భాష అస్థిత్వం ఆధారపడి ఉంటుంది. దాన్ని గుర్తించి తెలుగు భాషలో రచనలు చేస్తూ అందుబాటులో ఉండాలి. విరామ చిహ్నాలు వాడకపోతే ఏమవుతుందిలే, మనం చెప్పాలనుకున్న విషయం చేరిపోతోంది కదా, అనుకుంటే పొరబాటే...

ఆ ఇద్దరూ ఒక్కరే ..!

కుడుపూడి శ్రీనివాస
చల్లటి చలి చంపేస్తుంది.
'వరాల దిబ్బ' గజగజలాడిపోతుంది. ఆ దిబ్బ మీద గుడిసెల్ని మంచు మబ్బులా కమ్మేసింది. ఆ దిబ్బ చుట్టూ తివాచీలాగా పరుచుకున్న పచ్చ పచ్చని వరిచేలు. ఆ దిబ్బకి తూర్పు దిక్కునున్న నల్లరాతి కొండలపై నుండి చూస్తే పచ్చని చేల మధ్యలో లేచిన పుట్టగొడుగుల్లా మిణుకు మిణుకుమంటాయా గుడిసెలు. ఆ నల్ల రాతి కొండల్లో రాళ్లను తెచ్చి, చెక్కిన శిల్పాల్లా ఉంటారు ఆ గుడిసెల్లో మనుషులు.
తెలతెలవరకుండానే ఆ గుడిసెల్లోని మట్టి పొయ్యిలో ఎర్రటి నిప్పు కణికలు సెగలు కక్కుతున్నాయి. తాటాకు కొప్పుల మీద నుండి పైకి లేస్తున్న పొగ, పొగ మంచులో కలిసి వెలిసి పోతోంది. ఆ తాటాకు గుడిసెల మధ్యలో బీరపాదు అల్లుకున్న 'చుట్టెగుడెసె'లో నిప్పు రాజుకోకుండానే వెచ్చని సెగలు రగులు కుంటున్నాయి.

కవయిత్రి ఇందిర కన్నుమూత

గజల్‌ రచయిత్రి, కవయిత్రి భైరి ఇందిర (60) గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాథపడుతూ... 19.2.2023వ తేదీన హైదరాబాదులో కన్నుమూశారు. కడదాకా నిండైన ఆత్మస్థైర్యంతో జీవించి, అందరికీ స్ఫూర్తిని పంచి, 'నేను పోయినప్పుడు' అనే తన వీలునామా కవితను రాసుకున్న అక్షరజీవి ఇందిర. ఖమ్మం జిల్లా ఇల్లెందులో బైరి రామ్మూర్తి - వెంకటరమణ దంపతులకు 19 డిసెంబర్‌ 1962న ఆమె జన్మించారు. ఇల్లందు ,హైదరాబాదు, వరంగల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసి ఉపాధ్యాయ శిక్షణ కూడా చేశారు.
తండ్రి ప్రోత్సాహంతో సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. వివాహానంతరం దీక్షతో చదివి 1997లో ప్రభుత్వ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు.