వివక్షపై గళమెత్తిన కలం గుర్రం జాషువా

డాక్టర్‌ డి.ఉదయకుమారి
అసోసియేట్‌ ప్రొఫెసర్‌
ద్రావిడ విశ్వవిద్యాలయం
కుప్పం - 517 426

కవులు కవిత్వం వెంట నడుస్తారు. కానీ కవిత్వం మహాకవుల వెంట నడుస్తుంది. కవులు అంతటా ఉంటారు. మహాకవులు అరుదుగా ఉంటారు. మహా కవుల కవిత్వం ఆపాత మధురమై, అనుభూతిసిద్ధమై, అవ్యక్త ఆనందాన్ని అందిస్తుంది. స్ఫూర్తిదాయకమై ఉంటుంది. తన కలం బలంతో కులాన్ని కూకటివేళ్ళతో పెకలించడానికి ప్రయత్నించిన జాషువా నిస్సందేహంగా మహాకవి. కఠినమైన జీవితం, కఠోరమైన సాధన, కవితా వధూటి వరించి ప్రసాదించిన సహజమైన ప్రజ్ఞ కలగలసింది జాషువా కవిత్వం.
మనిషి సృష్టించిన మహాపరాధం మతం. మతం చేసిన మరొక అపరాధం కులం. వీటి మధ్య నలిగి, రాటు దేలిన కలం జాషువాది. జాషువా కవిత్వం ఆయన జీవించిన సమాజానికి ప్రతినిధి. తాను ఎదుర్కొన్న వివక్ష, అవమానాలు, ఆకలి బాధలే ఆయన కవిత్వానికి నిజమైన ప్రేరణ. తన కవిత్వానికి నిజమైన ప్రేరణను, నేపథ్యాన్ని గురించి చెబుతూ ''నాకు గురువులు ఇద్దరు. పేదరికం, కుల మత భేదం. ఒకటి సహనాన్ని నేర్పితే .. రెండోది నాలో ఎదిరించే శక్తిని పెంచింది'' అనడంలోనే జాషువా కవితా వ్యక్తిత్వం మనకు స్పష్టమవు తుంది.
జాషువా స్వప్న జగత్తులో విహరించిన కవి కాడు. వాస్తవంలో సంచరించిన మహాకవి. అయితే ఆయన కవిత్వంలో భావుకతకు కొదువలేదు. ఆయన ప్రతి పదం అనుభూతి వ్యక్తంగా, ఆలోచనా ప్రేరకంగా, మనోహరంగా ఉంటుంది.
జాషువా కవిగా పుట్టే నాటికి దేశవ్యాప్తంగా జాతీయోద్యమ ప్రభావం విశేషంగా పడింది. అంతకుముందే సంఘ సంస్కరణ, సాంస్క ృతిక పునరుజ్జీవన ఉద్యమాలు నడిచాయి. కవిత్వోద్యమాలు, భాషోద్యమాలు నడుస్తున్నాయి. కవిత్వంపై వివిధ 'ఇజం'ల ప్రభావం మొదలైంది. గాంధేయ వాద ప్రభావం దేశాన్ని ఒక ఊపు ఊపుతున్నది. స్వభావంలో నవ్య కవిత్వం, స్వరూపంలో వచన కవిత్వం పరుగులు పెడు తున్నాయి. విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు' ప్రకటించి సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం 'చెలియలికట్ట' వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నండూరి ఎంకి ప్రేమలో తరిస్తుంటే, అప్పుడప్పుడే కృష్ణశాస్త్రి ప్రకృతి ఒడిలో పరవశిస్తు న్నాడు. కానీ, జాషువా మాత్రం కాల్చే ఆకలి, కూల్చే వేదన, అవమానాలు, అపహాస్యాలతో పోరాడుతూ సంప్రదాయ వాదులు నిందించిన 'మైల కవిత్వం'తో, 'పంచమ స్వరం'తోనే ఆంధ్రదేశాన్ని మైమరపించాడు. ఇటువంటి నేపథ్యంలో జాషువా పద్య కవిత్వానికే పట్టం కట్టినప్పటికీ ఆయన స్వభావంలో పరిపూర్ణంగా ఆధునికుడు.
తనను, తన కవిత్వాన్ని అవమానించాలని చూసిన వారికి 'గవ్వకు సాటిరాని పలుగాకుల మూకలసూయ చేత నన్నెవ్విధ దూలినన్‌ నను వరించిన శారద లేచిపోవునే' అంటూ ఆత్మాభిమానంతో జవాబివ్వడం జాషువా వంటి కొందరికే సాధ్యమౌతుందేమో! 'నా కత్తి కవిత, నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు. దాని విధానంపైన ద్వేషం' అని, మత పిచ్చి గాని, వర్గోన్నతి గాని, స్వార్థచింతన గాని నా కృతుల్లో కనబడదని జాషువా స్పష్టంగా చెప్పుకున్నాడు. 'ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయింత్రుగాని దు:ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్‌ మెతుకు విదల్చదీ భరత మేదిని' అంటూ కుండ బద్దలు కొట్టి చెప్పాడు. ముప్పది మూడు కోట్ల దేవత లెగబడ్డ దేశంలో భాగ్య విహీనుల ఆకలి ఎలా తీరుతుందని? ప్రశ్నించాడు.
విశాల దృక్పథం, ప్రశ్నించే తత్వం, సమానత్వ సాధన కోసం పరితపించడం, అవమానాలను సహించలేని ఆత్మాభి మానం వంటి అనేక లక్షణాలు జాషువాను విలక్షణమైన వ్యక్తిగా నిలబెడుతున్నాయి.
1919లో 'రుక్మిణీ కళ్యాణం'తో కవిత్వం రాయడం ప్రారంభించినప్పటికీ గిజిగాడు, సాలీడు, భారత వీరుడు, భాష్ప సందేశము, శిల్పి, పశ్చాత్తాపము, పంచముడు, ధన్యజీవి, ఆవేదన, ప్రశ్న, నేను వంటి చాలా ఖండకావ్యాల్లో జాషువా నిరసన స్వరం మనకు వినిపిస్తుంది. అంతేకాదు, ఆయన కవిత్వంలో కుల వ్యవస్థపై ధిక్కారస్వరం అంతర్వాహినిగా ఉంటూనే ఉంటుంది. 1932లో ఆయన రాసిన ఫిరదౌసి, ముంతాజ్‌ మహల్‌ కావ్యాలు జాషువాను కవిగా మహౌన్నత స్థానానికి చేర్చాయి. జాషువా కవితా స్వరూపాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించిన కావ్యం గబ్బిలం. ఈ కావ్యంలోని క్షుధానల మూర్తియైన కథానాయకుడు సాక్షాత్తు జాషువాకు ప్రతినిధి. 'నాదు కన్నీటి కథ సమన్వయము సేయ నార్ద్ర హృదయంబు గూడ కొంతవసరంబు' అని చెప్పుకున్నది తన గురించే.
జాషువా, సందేశాన్ని శివునికి వినిపించడానికి గబ్బిలాన్ని ఎంచుకోవడంలోనే అంతవరకు ఉన్న అనవసరపు సాంప్ర దాయాల్ని ఉద్దేశ్యపూర్వకంగానే అతిక్రమించడం కనిపిస్తుంది. ఇందులోని కథానాయకుడు భరత వీరుని పాదాలు కందిపోకుండా చెప్పులు కుట్టి జీవనం సాగించే గొప్ప సేవకుడు. ఆయన గాలి సోకితేనే నాలుగు పడగల హైందవ నాగరాజు కోపంతో బుసలు కొడుతూ ఉంటాడు. కులము లేని నేను కొడుకుల్ని కని, వాళ్లను కూడా ఈ దురవస్థల పాలు చేయడం ఇష్టం లేక బ్రహ్మచర్య దీక్షలో ఉన్న వాడు. ఈ విధంగా ప్రతి మాటలోనూ జాషువా కులవివక్షను కుళ్ళబొడిచే ప్రయత్నం తన జీవన పర్యంతం చేశాడు.
జాషువా కవిత్వంలో దురాచార ఖండనతో పాటు దేశభక్తి ప్రబోధం కూడా మెండుగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన కవిత్వంలోని ఆర్ద్రత కరుణరస సంపూర్ణమై కన్నులు చెమ్మగిల్ల చేస్తుంది. ముంతాజ్‌ మహల్‌ మరణం తర్వాత షాజహాన్‌ చక్రవర్తి మనోవేదనను 'నాదు నేత్ర యుగళి నాట్యమాడెడు నిన్ను నెట్లు దొంగిలించె నీశ్వరుండు' అంటూ, 'ఈవు వసించు చోటు, వసియింతును నేనును, దాచి యుంపుమో దేవి! యొకింత నేల' అంటూ చిత్రించిన తీరు పాఠకుల మనస్సుల్ని కదిలిస్తుంది. దాంపత్య జీవనంలోని ప్రేమను, అనుబంధంలోని గాఢతను ఆవిష్కరిస్తుంది.
జాషువాకు మధుర శ్రీనాథ అన్న బిరుదు నిజంగా సార్థకమైంది. పద్య నిర్మాణ చాతుర్యం, పద విన్యాస సామర్థ్యం కూడా జాషువాను మహాకవిగా నిలబెట్టడమే కాకుండా అలనాటి శ్రీనాథుని గుర్తుకు తెస్తాయి. జాషువా సీస పద్యం నడకలో గొప్ప సౌందర్యం ఉంటుంది. పద్యంలోని ఏ పాదానికి ఆ పాదం పూర్తి అర్థాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. పదాల పోహళింపు కూడా శ్రవణపేయంగా ఉంటుంది.
విశ్వ మానవ శ్రేయస్సును ఆకాంక్షించడం మహా కవులకు ఉండవలసిన లక్షణం. ఈ గుణం మెండుగా ఉన్న జాషువా తాను విశ్వ నరుడను అని చెప్పుకోవడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కవి ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ జాషువా రాసిన పద్యం ఆయనకు నూటికి నూరుశాతం వర్తిసుంది. 'రాజు మరణించె నొకతార రాలిపోయె, కవియు మరణించె నొకతార గగనమెక్కె రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించె ప్రజల నాల్కల యందు'.
గొప్ప విశ్వమానవ దృష్టితో సామాజిక రుగ్మతలపై పోరాటం చేసిన జాషువాను తెలుగు కవితా వినీలాకాశంలో మరొక ధ్రువతారగా చెప్పక తప్పదు.