పేపకాయల ప్రసాద్
94907 12967
తెలుగునాట స్థానిక చరిత్రలపై మౌలిక పరిశోధన ఒకప్పటితో పోల్చితే ఇపుడు చాలా తక్కువే కాని... మన సంఘ చరిత్ర బహుముఖ పార్శ్వాల మీద వ్యయ ప్రయాసలకోర్చి - సమగ్రమైన పరిశోధన జరిపి, ఎన్నో విశేషాలు వెలికితీసి, అమూల్యమైన సమాచారాన్ని అందిస్తోన్న జాస్తి దుర్గాప్రసాద్, ఈమని శివనాగిరెడ్డి వంటి మంచి పరిశోధకులు ఇప్పటికీ కొందరున్నారు. స్థానిక చరిత్రల పరిశోధనను ప్రోత్సహించేందుకు ఏర్పడిన తెలంగాణ సాహిత్య అకాడమీ వారి 'మన ఊరు - మన చరిత్ర' వంటి ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్లో లేవు. ప్రభుత్వం మాట అటుంచి, ఇప్పటి సాహిత్య పత్రికలు గాని, ఇతర పత్రికలు గాని సృజనాత్మక సాహిత్యానికి... అందునా ఆధునిక కవిత్వానికి, విమర్శకు ఇస్తున్న ప్రాధాన్యం చరిత్రకు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో చరిత్ర రచనకు పూనుకుంటున్న రచయితలు సొంత ఖర్చులతో పుస్తకాలు ముద్రించుకుంటే తప్ప వారు చెప్పదలచిన అంశాలు పాఠకులకు చేరే అవకాశం ఉండటం లేదు. స్థానిక చరిత్రల శకలాలను పూర్వ పరిశోధనల గనుల నుంచి తవ్వి తీసి, వాటినన్నిటిని ఒకచోటికి చేర్చి, ఓ చక్కని చారిత్రక విశేషాల సమాహారంగా పుస్తకం రూపంలో సంతరించడం అనేది పెద్ద సాహసమే. ఆ సాహసాన్ని పిఠాపురం చరిత్ర విషయంలో ధైర్యంగా చేయగలిగారు బండి రాజకుమార్. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన రాజకుమార్ తరగతి గదిలో ఒకనాడు అడిగిన ప్రశ్నకు - పిల్లలు అజ్ఞానంతో చెప్పిన సమాధానం - మనకు తెలియని మన పిఠాపురం పుస్తకం పుట్టుకకు ప్రధాన కారణమైంది.
రామగిరిని చూస్తూ - 'తలపోసి, తలపోసి - ఆనాడు యీ స్థలం యేలా వుండెనో... బౌద్ధులు యేమి యేమి చేసేవారో?' అని గురజాడ వారి 'మీ పేరేమిటి' కథలో కథకుడికి కలిగిన జిజ్ఞాస లాంటిదే చరిత్ర పరిశోధకులెందరికో ఉంటుంది! ఆ ప్రేరణతోనే కాబోలు - పిఠాపురంపై మౌలిక పరిశోధనను 50 ఏళ్ల కిందటే దాదాపుగా పూర్తిచేశారు కుందూరు ఈశ్వర దత్తు, కురుమెళ్ళ వెంకటరావు, శ్రీరామ పరబ్రహ్మ కవి వంటి ఉద్ధండులు. వీరు పిఠాపురం చరిత్రపై లోతైన పరిశోధన వ్యాసాలు వెలువరించారు. 'కథలు - గాథలు' పేరుతో చెళ్లపిళ్ల వారు, దిగవల్లి వెంకటశివరావు గారు కూడా పిఠాపురం గాథలు కొన్నింటిని కథనం చేశారు. అయితే అక్కడొకటి ఇక్కడొకటిగా ఉన్న ఆయా కథలన్నింటినీ ఒకచోటికి చేర్చి, ఈ తరం పాఠకులకు పరిచయం చేసిన ఘనత మాత్రం బండి రాజ కుమార్దే! 2021 ఆగస్టులో ఆవిష్క ృతమైన ఈ పుస్తకంలో పొందుపరిచిన అంశాలన్నీ వ్యాసరూపంలోనే ఉన్నా - చాలా మటుకు కథన శైలిలోనే కనిపిస్తాయి. ఏ విషయాన్నైనా - కథల రూపంలో చెప్పినపుడు హృదయానికి హత్తుకునేలా చెప్పే అవకాశం ఉంటుంది. ఈ అభిప్రాయంతోనే ×ట ష్ట్రఱర్శీతీy షవతీవ ్aబస్త్రష్ట్ర్ ఱఅ ్ష్ట్రవ టశీతీఎ శీట ర్శీతీఱవర, ఱ్ షశీబశ్రీస అవఙవతీ bవ టశీతీస్త్రశ్్ీవఅ అన్నాడు రుడ్యార్డ్ కిప్లింగ్ అనే ఇంగ్లిష్ నవలాకారుడు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం ఇప్పుడొక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. మన దేశంలో ఇపుడు మనుగడలో ఉన్న ప్రధాన ధర్మాల్లో చాలావరకు ఈ పట్టణంలో కనిపిస్తాయి. ఊరినిండా పరుచుకున్న ఇరుకుదారులు, మలుపులు, మెలికలతో కూడిన పిఠాపురం భౌతిక స్వరూపం - సందర్శకు లను పెద్దగా ఆకర్షించక పోవచ్చు కాని.. ఆ ఊరి గర్భంలోను, పరిసర ప్రాంతాల్లోను దాగున్న ఎన్నో చారిత్రక విశేషాలు ఎందరో పరిశోధకులను పిఠాపురం వైపు సదా ఆకర్షిస్తాయి.
శ్రీమచ్చంకర భగవత్పాదులు, మహా వీర జైనుడు వంటి పలువురు ధార్మికులను; ఖారవేలుడు, సముద్ర గుప్తుడు, చాళుక్య పులకేశి వంటి సామ్రాట్టులను; యువాన్ చాంగ్ వంటి విదేశీ యాత్రికులను సైతం ఆకర్షించి, పిఠాపురానికి రప్పించిన చరిత్ర ఈ నేలది. సామ్రాట్టులు మొదలు సామంతుల వరకు ఎందరో వీరుల ప్రతాపాలకు సాక్షిగా నిలిచిన పిఠాపురం క్రీస్తు పూర్వం నుంచి జమీందారీ యుగం వరకు తెలుగు భాషా సాహిత్యాల పోషణతో పాటు దేశ రాజకీయాల్లోను కీలకపాత్ర పోషించింది.
వక్తవ్యాంశాలను ఓ చక్కని ప్రణాళికతో వింగడించి, వాటి మధ్య సమన్వయతను సాధించిన రచయిత సుమారు 240 పుటల్లో, 13 ప్రధాన వ్యాసాలుగా ఈ పుస్తకాన్ని కూర్చారు. మొదటి వ్యాసంలో పిఠాపురం భౌగోళిక - చారిత్రక విశేషాలు వివరించారు. క్రీ.శ.210 నుంచి జమిందారీ వ్యవస్థ రద్దయ్యేంత వరకు ఉన్న చరిత్రను స్థూలంగా పరిచయం చేస్తూ సాగిన ఈ వ్యాసంలో జమిందారీ యుగపు వ్యక్తుల వివరాలే ఎక్కువగా ఇచ్చినప్పటికీ - పిఠాపురం చరిత్ర అనగానే - వెంటనే స్ఫురించేంత పేరు ప్రఖ్యాతులున్న రావు గంగాధర రామారావు, సూర్యరాయ బహుద్దూర్, రాణి చిన్నమాంబల జీవిత విశేషాలను మరో 3 వ్యాసాల్లో పొందుపరచడం సముచితంగా ఉంది.
జైనం, బౌద్ధం, శైవం, శాక్తం, వైష్ణవం, గురు సంప్రదాయం అనే విభిన్న ధర్మాలు పాటించే వారందరికీ పిఠాపురం గొప్ప ప్రదేశమే! దేశంలోనే అత్యంత ప్రాధాన్యమున్న ఆధ్యాత్మిక క్షేత్రంగా పిఠాపురం వన్నెకెక్కిన విశేషాలను తరువాతి వ్యాసంలో కథనం చేశారు రచయిత. సంగీత, సాహిత్య, నాట్య రంగాలకు పిఠాపురంలో లభించిన ఆదరణను; రంగస్థలం పై రాణించిన ధ్రువతారలను - రంగుల తెరపైన, తెర వెనుక ప్రసిద్ధులైన విభిన్నులను; సంఘ సంస్కరణలో పాలుపంచుకున్న మహ నీయులను గూర్చిన వివరాలను తదుపరి వ్యాసాల్లో విశదీ కరించారు. నఱర్శీతీy ఱర ఎవతీవశ్రీy a శ్రీఱర్ శీట రబతీజూతీఱరవర అన్నారు అమెరికన్ రచయిత కర్ట్ వానెగట్.
పిఠాపురం కథల్లో పఠితలకు సంభ్రమాశ్చర్యాల్ని కలిగించ గల విశేషాలెన్నో ఉంటాయి. కోపం వస్తే ఎంత వారికైనా సిగ తెగ్గోయించే రాజా గంగాధర రామారావు కాలంలో పిఠాపురం సరస్వతీ నిలయమై భాసించిందట. శ్రీ కుంతీ మాధవాలయంలో తొమ్మిది రాత్రులు - శ్రీ కృష్ణ సత్యభామల ప్రణయగాథను 'నవజనార్దన పారిజాతం' పేరిట నృత్యంగా స్త్రీలు మాత్రమే ప్రదర్శించేవారట. ఈ నృత్యంలో ఆనాటికి సాటిలేని మేటి నర్తకి పెండ్యాల సత్యభామ. ఆమె అభినయాన్ని వీక్షకులు ఆద్యంతం రెప్పవేయకుండా చూచేవారట. గుత్తుర్తి వీరాస్వామి 'శంఖం వీణ' అనే కొత్త రకం వీణను తయారు చేసారట! ప్రముఖులెందరో పిఠాపురంలో వీణలు తయారు చేయించి, పట్టుకువెళ్లారట! ఇలాంటి సంగతులు పఠితలను విశేషంగా ఆకట్టుకుంటాయి.
శ్రీరంగం కోవిలలో ఆళ్వారులతో పాటు పిఠాపురం వారి మూలపురుషుడైన మాధవ రాయణిం గారూ పూజలందుకుంటు న్నారన్న సంగతి ఆశ్చర్యం కలిగిస్తుంది. పొరుగునే ఉన్న పెద్దాపురం ప్రభువులతో పిఠాపురం వారు చేసిన పొత్తులు - ఇరు రాజ్యాలూ దూసిన కత్తులు; ఉండూరు, దోమాడ యుద్ధాలు తదితర గాథలను రచయిత పరిచయం చేసిన తీరు బాగుంది.
పరమ గ్రాంథికవాదిగా ప్రసిద్ధిగాంచి, ఆంధ్ర సాహిత్య పరిషత్తు అనే ఓ మహాసంస్థను పోషించి, రూ.20 లక్షల భారీ వ్యయంతో నిఘంటు నిర్మాణం చేపట్టి, ధన్యుడైన సూర్యారావు బహద్దర్ గారి గాథ చదువుతున్నపుడు రచయిత రాజకుమార్ ఈ పుస్తకానికి ముఖచిత్రంగా సూర్యారావు గారి చిత్రాన్ని పెట్టడంలో ఉన్న ఔచిత్యం అర్థమవుతుంది. ఈ జమీందార్ - బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయడు గారి శిష్యులై, బ్రహ్మ సమాజాన్ని నడిపించారు. దివాన్ మొక్కపాటి సుబ్బారాయడు గారి సలహాలతో, నాయడు గారి ఆశీస్సులతో గాంధీగారి కంటే ముందే మద్యపాన నిషేధం, హరిజనోద్ధరణ, స్త్రీ అభ్యున్నతి లక్ష్యాలుగా త్రికరణ శుద్ధితో కృషిచేశారు. పదుల సంఖ్యలో కవి పండితులను, శాస్త్ర విద్వాంసులను, కర్మిష్ఠులను, కళా కారులను పోషించి అభినవ శ్రీ కృష్ణ దేవరాయలుగా నుతులం దారు. కవి పండిత పోషణ - వేద, శాస్త్రాల వ్యాప్తి; భాషా సాహిత్య వివాదాల్లో ప్రముఖపాత్ర, కళాశాల స్థాపన, సంఘ సంస్కారం, కళలు, పత్రికలు, పరిషత్తులు, గ్రంథ సంపాదనలు - ప్రచురణలు; శరణాలయాలు - ప్రార్థన మందిరాలు ... ఒకటా రెండా! ఈ పాలకుల ఔదార్యాన్ని చాటే విశేషాలెన్నో ఈ పుస్తకంలో గుదిగుచ్చారు రచయిత. ఆనాటి పిఠాపురం సంస్థానాధీశులు, వారి ఆశ్రితులు అనుభవించిన వైభవాన్ని; రాజకుటుంబంపై జరిగిన కుట్రలు, అంతఃపుర విశేషాలు తదితరాలను తెలుసుకోవడానికి పనికివచ్చే సాధికార రచన యువరాజు గంగాధర రామారావు గారి ఆత్మకథ. అందులోని కొంత భాగాన్ని ఈ సందర్భంలో పొందుపరచడం బాగుంది.
భీమేశ్వర పురాణం - ద్వితీయాశ్వాసంలో శ్రీనాథుడు వర్ణించిన పిఠాపురం దేవతా మూర్తుల్లో కొన్నింటి ఉనికిని గుర్తించలేకపోయారని చెబుతూ - కుక్కుటేశ్వరాలయం, పురుహూతికా శక్తిపీఠం పాదగయ, శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం, ఆర్ష - సూఫీ తత్త్వాల సమ్మేళనమై భాసిల్లుతున్న 'విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం' తదితర ఆధ్యాత్మిక సంస్థల గాథల్ని చక్కగా వివరించారు రచయిత. పిఠాపురం సంస్థానం లోని సారస్వత మూర్తులు, సంగీతవేత్తలు, నాట్యకారులు, నటులను గురించి సంతరించిన విశేషాలు ప్రధాన గ్రంథంలో సగభాగాన్ని ఆక్రమించాయంటే - కళలకు ఆనాటి ప్రభువులు ఎంత ప్రాధాన్యం ఇచ్చి ఉంటారో మనం అర్థం చేసుకోవొచ్చు.
కవులు, కళాకారులకు నిలయమైన పిఠాపురాన్ని ఇంగ్లాండు లోని 'లేక్ ల్యాండ్'తో పోల్చవచ్చునేమో! అక్కడి కళా సృజనకి సుందర ప్రకృతి ప్రేరకం కాగా ఇక్కడ మన వారికి - ఏలేరు తీరాన కొలువైన ప్రభువుల కళాతృష్ణ, కవిత్వాభిరుచి ప్రేరణగా నిలిచాయి.
పిఠాపురం అంటే గుర్తుకు రావలసినవి దత్తాత్రేయ క్షేత్రము, పురుహూతికా శక్తి పీఠం మాత్రమే కాదు! 'దేహాన్తే తవ సాయుజ్యమ్మ'నుకుంటూ - కుక్కుటేశ్వరుని సేవలోనే తనువు చాలించి, తరించిన కూచిమంచి తిమ్మకవి, సాహిత్య స్పర్ధ కారణంగా తిరుపతి వెంకటకవులను వాదాలలో ఢకొీట్టిన వెంకట రామకృష్ణ కవులు, ఒక విశ్వవిద్యాలయం చేయాల్సిన పనిని తామొక్కరే చేసి, 'వర్ణన రత్నాకరం' కూర్చిన దాసరి లక్ష్మణ కవి, సాహిత్యాన్ని సంఘ సంస్కార సాధనంగా ఉపయోగించుకున్న పానుగంటి లక్ష్మీ నరసింహారావు, భావుకతా పట్టభద్రునిగా నతులందుకున్న మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి వాజ్మయ మూర్తులు... ఇలా పిఠాపురాన్ని కవితావనంగా భాసింపజేసిన పలువురు కవిశేఖరుల్ని గూర్చి సరళ సుందరమైన భాషలో తెలియజేసారు రచయిత.
శాంతినికేతన్లో వీణావాదన చేసి, విశ్వకవిని తాదాత్మ్యంలో ముంచెత్తిన వైణికవరులు తుమరాడ సంగమేశ్వర శాస్త్రి సాటిలేని ప్రతిభ, లలిత సంగీతాన్ని సామాన్యులకు చేరువ చేసిన బాలాం త్రపు రజనీకాంతరావు నిరుపమానమైన ఉభయకారిత్వం; ఆసేతు శీతాచలం తమ సంగీత రసధారలతో రసజ్ఞులను మైమరపించిన నేదునూరి కృష్ణమూర్తి నైపుణ్యం, మధుర గాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు గారి స్వరంలోని కమ్మదనం, తెలుగు నాటకరంగ విజ్ఞాన సర్వస్వంగా పేరు గాంచిన మలిరెడ్డి బాబీ కార్యవ్యగ్రత, అందాల కథానాయకుడు హరనాథ్ అభినయం, బారిష్టర్ పార్వతీశం పాత్ర ద్వారా తెలుగునాట నవ్వుల తోటను విరియించిన మొక్కపాటి నరసింహ శాస్త్రి హాస్యం; ఉమర్ అలీ షా, అభ్యుదయ కవి ఆవంత్స సోమసుందర్ల కవిత్వ విశిష్టత ... ఇలా పిఠాపురం కీర్తిని ద్విగుణం, బహుళం చేసిన విశేషాలెన్నో - ఈ రచనలోని ప్రతి పుటలో పాఠకులకు తారసపడతాయి. పిఠాపురంలో తయా రయ్యే నూర్జహాన్ సెంటులా మనసును పట్టేసి గుబాళిస్తాయి.
అయితే - ఇంత చక్కని ఈ రచనలో - చరిత్ర విశేషాల ప్రకరణంలో కొన్ని దోషాలున్నాయి. మలి ముద్రణలో అలాంటివి లేకుండా జాగ్రత్త పడాలి. ఏలేరుని పిఠాపురంలో 'చెరుకుల కాలువ' అంటారు. తీయని చెరకుల కోసం మారాం చేసిన పిఠాపురం రాకుమారుల కోసం పెద్దాపురం రాజులు ఏలేటిలో చెరుకులు పడవేయించి, పిఠాపురం పంపేవారని ఓ కథ ఉన్నట్లు చెప్పారు రచయిత రాజకుమార్. 'శత్రువుల నుంచి ప్రాణహాని ఉన్నందున - ప్రతి పదార్థాన్నీ ఓ సేవకుడు తిని చూస్తేనే కాని పిఠాపురం రాజులు ఆహారం ముట్టేవారు కాదని' యువరాజు గంగాధర రామారావు ఆత్మకథలో రాసిన మాటలను బట్టి చూస్తే ఈ చెరుకుల కాలువ కథ - సరదాగా ఎవరో పుట్టించిందని అనిపిస్తుంది. బహుశ ఏలేరును జలరవాణా కోసం ఉపయోగించి ఉంటారని ఊహించవచ్చు.
'బండి రాజకుమార్ కూర్చినది బంగారు పిచ్చుక గూడు కాదు. రచనలో మెళకువలు, సోయగాలు లేనందున - ఇది ఓ కాకిగూడే. కాని ఈ ప్రయత్నాన్ని చిన్నచూపు చూడరాదు' అన్నారు ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో ్మఏకా మన్మథరావు గారన్నట్లు - ఇది పిఠాపురం చరిత్రపై మరో లోతు పరిశీలన కాకపోయినా ఈ తరానికి తెలియని ఎన్నో విషయాలను సేకరించి, వీలైనంత సమగ్రంగా అందించేందుకు రచయిత రాజకుమార్ చేసినది మాత్రం సఫల ప్రయత్నమే! ఇది కాకిగూడే కావచ్చు! కాని ఈ గూటిలో సంతరించిన అమూల్యమైన సమాచారం సమీప భవిష్యత్తులో ఎన్నో కోకిల లకు ఆధారమవుతుందని అనుకోవచ్చు.
అమెరికన్ రచయిత అలెక్స్ హేలీ రాసిన =శీశ్ీర నవలలో - ఏడుతరాల మూలాలు సేకరించడానికి కృషి చేసిన కథా నాయకుడి పాత్ర తన పరిశోధనకు ప్రేరణ కలిగించిందన్నారు రచయిత తమ మనవి మాటల్లో. పెద్దల వద్ద విని, వివిధ గ్రంథాల్లో చదివి, సేకరించిన అంశాలను సమన్వయపరచి పాఠకులకు ఒక మంచి పుస్తకంగా అందించిన రాజకుమార్ కూడా ఆ కథానాయకుడి లాగే శ్రమించారనడంలో సందేహం లేదు. పూర్వ పరిశోధకుల కృషి ఫలితంగా లభిస్తున్న సమాచారంతో పాటు మరెంతో విలువైన సమాచారాన్ని మౌఖిక ఐతిహ్యాలు, ఆచారాల నుంచి గ్రహించి, శోధించి అందలి సత్యాలను కథారూపంలో అక్షరీకరించారు రచయిత. పిఠాపురం జొన్నపొత్తులకు ప్రసిద్ధి అని సమాధానం చెప్పిన విద్యార్థి ఎవరో కాని - అతడిచ్చిన జవాబు రచయితను కర్తవ్యోన్మఖుణ్ణి చేసి, ఓ మంచి పుస్తకం రాయడానికి కారణమైంది! పిఠాపురాన్ని గూర్చి ఈ తరానికి తెలియజేయాలనే రాజకుమార్ తపన ఈ పుస్తకం ద్వారా నెరవేరినట్టే భావించాలి.