- శ్రీనివాస మూర్తి
7499985329
రామకుప్పం మండలాఫీసు దగ్గరలో కొంచెం బయలు ప్రదేశం వున్న ప్రాంతం. పదిమంది యువకుల గుంపు. వయసు పద్దెనిమిది నుంచి ముప్పై మధ్య.... వాళ్ళతో పాటూ ఒక బక్కపల్చటి పెద్దాయన, సుమారు నలభై ఏండ్లు వుండొచ్చు. అద్దాలు పెట్టుకున్నా చికిలించినట్టు కనబడే కళ్ళు. హడావుడిపడుతూ ఏదో ఏర్పాటు చేసుకుంటున్నారు.
స్కూళ్ళు వొదిలే సమయం కాబట్టి దారినబడిపోతున్న కాలేజి పిల్లలు, స్కూలు పిల్లలతో అక్కడ సందడిగా వుంది. ప్రజల ధ్యాసను తమవైపు మళ్లించడానికి ఏం చేద్దామని వాళ్ళ నాయకుడు ఆలోచిస్తున్నాడు...వాళ్ళ దగ్గర డప్పుగానీ, తప్పెట గానీ అందుబాటులో లేవు. అంతలో హఠాత్తుగా జనం మధ్యలోకి ఒక సాధువు చొచ్చుకొచ్చాడు. మెరుపులు మెరిసే పదునైన కంఠం తో పద్యం ఎత్తుకున్నాడు.
''తలఁగవు కొండలకైనను;
మలఁగవు సింగములకైన మార్కొను కడిమిం;
గలఁగవు పిడుగులకైనను
నిల బలసంపన్న వత్తి నేనుఁగు గున్నల్.''
మనుషులందరూ ఒక్కసారిగా వులిక్కిపడ్డారు. ఆయనెవరో అక్కడెవరికీ తెలియదు.
నల్లటి నిగనిగల చర్మం. వంపు తిరిగిన భుజాలు, పలుచగానే వున్నా దఢమైన శరీరం, కాయకష్టంతో మొరటుబారినట్టు కనబడే చేతులు. నలుపు తెలుపు కోలగడ్డం. జులపాలుదీరి వెనక్కి వదిలిన వెంట్రుకలు, నుదుటిన విభూది పట్టెలు. తెల్లటి బట్ట బనియను. కావిరంగు పాత పంచ. చేతిలో పొడవాటి కర్ర.
కళ్ళు మూసుకొని ఆయన ఏకాగ్రతతో పద్యం పాడుతున్నాడు. పద్యం అయిపోయాక కర్ర పక్కన పెట్టి అక్కడే కూర్చుని అలాగే కళ్ళు ముసుకున్నాడు. ఒక్కసారి పదిమందిని కట్టిపడేసిన అద్భుత కంఠం. నాయకుడికి ఇది మంచి సమయం అనిపించింది. సైగ చేసాడు. అనుచరులు మొత్తం చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. పది పన్నెండేళ్ల పిల్ల కళ్ళకునల్లటి రిబ్బను కట్టి హాస్పిటల్ కాంపౌండు గోడపై కూర్చోబెట్టారు. కళ్ళు మూసుకున్న సాధువు మనసులో కల్లోలం.. ఆయన మేను వణుకుతున్నది. పొలం గట్టు వెంటపరిగెడుతున్న కొడుకు పదేళ్లప్పటి ముద్దుగారే మొగం గుర్తొచ్చింది. కొలకుల్లో నిలిచిన కన్నీళ్లు ...ఎవరూ గమనించలేదు.
మెడ ఎడమవైపు నుంచి కుడి చంక కిందివరకు జనపనార పట్టీ కట్టుకున్న అబ్బాయి ముందుకొచ్చి'' జడ్జిగారొస్తున్నారహో.......వస్తు........హో.......వస్తు ......హో..'' మూడుసార్లు అరిచాడు. గాంధీ కళ్ళద్దాల పెద్దమనిషి. బాగా బట్టనెత్తి. ముతక కాటన్ జుబ్బాతో వున్నాడు. మెల్లగా నడిచొచ్చి అమ్మాయి కిందుగా అమర్చిన రెండు రాళ్లపై కూర్చున్నాడు. చేతిలో ఉన్న సైకిల్ టైరు ముక్కను నేలపై కొట్టి సైలెన్స్... సైలెన్స్... అన్నాడు. అతని మొహంవైపు చూసిఅందరూ నవ్వారు.ఆయనకూ నవ్వొచ్చింది. ఆపుకొని గంభీరమైన మొగం పెట్టాడు. అప్పటికి అర్థమైంది వాళ్ళందరికీ ఆక్కడేదో నాటకం నడుస్తుందని.
పద్యం పాడి ధ్యానంలోకి వెళ్లిన సాధువు లేచాడు. చుట్టూ నిలబడ్డ వాళ్ళను కార్యకర్త వలె కూర్చోబెడుతున్నాడు.
చేస్తున్న పని పట్ల చాలాశ్రద్ధగా వున్నాడు. హఠాత్తుగా వూడిపడ్డ ఈ కొత్తపాత్ర గురించి నటులు కంగారుపడ్డారు. ఏమీ కాదు, నువ్వు మొదలు పెట్టమన్నట్టు నాయకుడు సైగ చేసాడు. బిళ్ళజవాను మళ్లీ ముందుకొచ్చి
పౌరహక్కుల సంఘం.... పౌరహక్కుల సంఘం...మూడుసార్లు అరిచాడు.
బక్కపల్చటి వ్యక్తి జడ్జి గారి దగ్గరికి పోయాడు. ఇద్దరు అబ్బాయిలు చేతులు ఙ ఆకారంలో పెట్టి ఆయనచుట్టూ కోర్టుబోనులా దడి కట్టారు. వాళ్ళ నైపుణ్యానికి అక్కడ గుమిగూడిన ప్రజలు ఆశ్చర్యపోయారు. వాళ్ళకిది కొత్త.
''అభియోగమేమిటి'' జడ్జిగారు తన పక్కనున్న వ్యక్తిని అడిగాడు.
''ఏనుగులు వూళ్లమీద పడి పంటలు తినేసాయి. ఇక్కడి రైతులందరి తరుపునా నష్టపరిహారం అడుగుతున్నారు'' క్లుప్తంగా చెప్పాడు.
''ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చినాడా!'' అడిగాడు జడ్జీ.
కాఖీచొక్కా వేసుకున్న వ్యక్తి వచ్చి నిలబడ్డాడు.
''మీ జవాబు''
''అయ్యా! ఈ ఏనుగులు మనవి కానే కావు. ఇవి మైసూరు అడవులవి. మన కడప చిత్తూరు జిల్లాలకు అంత పెద్ద అడవి ఏనాడూ లేదు అన్నీ కంప తుప్పలే''
అన్నాడు వేళాకోళంగా....
ఆయన మాట నోటిలో ఉండగానే సాధువు గిర్రున లేచాడు. అఫీసరు పాత్రవైపు తిరిగి
''మాతులుంగ, లవంగ, లుంగ, చూత, కేతకీ, భల్లాత, కామ్రాతక, సరళ, పనస, బదరీ, వకుళ, వంజుళ, వట, కుటజ, కుంద, కురవక, కురంటక, కోవిదార, ఖర్జూర, నారికేళ, సింధువార, చందన, పిచుమంద, మందార, జంబూ, జంబీర, మాధవీ, మధూక, తాల, తక్కోల, తమాల, హింతాల, రసాల, సాల, ప్రియాళు, బిల్వామలక, క్రముక, కదంబ, కరవీర, కదళీ, కపిత్థ, కాంచన, కందరాళ, శిరీష, శింశు పాశోక, పలాశ, నాగ, పున్నాగ, చంపక, శతపత్ర, మరువక, మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంతసమయ సౌభాగ్య సంపదంకురిత, పల్లవిత, కోరకిత, కుసుమిత, ఫలిత, లలిత, విటప, విటపి, వక్ష రాజంబులు బీ కనకమయ సలిల కాసార కాంచన, కుముద, కల్హార, కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీంకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విటసముదయ సమీప సంచార సముదంచిత శకుంత, కలహంస, కారండవ, జలకుక్కుట, చక్రవాక, బక, బలాక, కోయష్టిక ముఖర జలవిహంగ విసర వివిధ కోలాహల బధిరీ భూత భూనభోంతరాళంబును; ...'' ఇంత అడవి, ఇట్లా ఉందని పోతన చెప్తే అడివి లేదంటావా? శరీరం వూగి పోతుండగా ''ఆగ్రహంతో గుడ్లు ఉరిమి చూసాడు. నిజాయితీ గల ఆ చూపుకు ఫారెస్ట్ ఆఫీసరు పాత్ర నిజంగానే భయపడ్డాడు.
''అడవి కాదు..... అప్పుడు ఏనుగులు లేవు'' స్క్రిప్ట్ లో లేని ఈ ట్విస్టు కు ఏం మాట్లాడాలో తోచక నత్తిగా ఏదో వాగేసాడు.
థిక్! అని మోకాలిపై నిలబడిన సాధువు ''ఏనుగులు లేవా!'' వెటకారంగా అని అట్లాగే జడ్జీ వైపు తిరిగి పరమవినయంగా ''అయ్యా! ఎటువంటిపక్షులు,ఎటువంటి జంతువులు... పోతనామాత్యుడిని ఆలకించండి.
గంధగజ, గవయ, గండభేరుండ, ఖడ్గ, కంఠీరవ, శరభ, శార్దూల, శశ, చమర, శల్య, భల్ల, సారంగ, సాలావక, వరాహ, మహిష, మర్కట, మహోరగ, మార్జాలాది నిఖిల మగనాథ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబునై యొప్పు యడవి. అంతేనా..
అక్కడి ఏనుగులు నడుస్తుంటే.....
''పులుల మొత్తంబులు పొదరిండ్లలోఁ దూఱు-
ఘోరభల్లూకముల్ గుహలు సొచ్చు;
భూదారములు నేల బొఱియలలో డాఁగు-
హరిదంతముల కేఁగు హరిణచయము;
మడువులఁ జొరఉబాఱు మహిషసంఘంబులు-
గండశైలంబులఁ గపులు ప్రాఁకు;
వల్మీకములు జొచ్చు వనభుజంగంబులు-
నీలకంఠంబులు నింగికెగయు.''
తానే ఒక మదగజమైనంత భావావేశం... సమ్మోహపరిచే ఆ పద్యంలోనే కాదు ఆయన శరీరంలోనూ కనిపించింది
ఈ సాధువు పాత్రవల్ల నిజానికి ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తి రేకెత్తింది. యిది అనుకోకుండా ప్రవేశించిన పాత్ర అన్న విషయం వారికి తెలియదు.
నాయకుడికేమో ఈ ముసలాయన చెబుతున్న వాటిలో పరమ సత్యం గోచరించింది.తాము ఈ దిక్కున ఎప్పుడూ ఆలోచించలేదు. ''ఆనాడు తనున్న జీవితవాస్తవాన్ని కాదని ఏ రచయితా రచన చేయలేడు కదా...'' అనుకున్నాడు...
ఈ తతంగాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి జడ్జి పాత్రధారి. ''ఎమ్మార్వో ను పిలిపించమని పొయిన వాయిదాలో చెప్పాము ..వచ్చారా?'' పాతకాలపు అరవజడ్జీ లాగా నెత్తి గోక్కుంటూ విసుక్కున్నాడు. పక్కన్నే బండిదగ్గర పుల్ల ఐస్ తింటున్నవాన్ని కేకేసారు. వాడు పుల్ల నోట్లో వుండగానే పరుగెత్తుకొచ్చాడు. మధ్యలో రాయి తట్టుకొని పడబోయి తమాయించుకు నిలబడ్డాడు. చుట్టూవున్నవాళ్ళు నవ్వారు. ''ఆడివన్నాక ఏనుగులు రాక ఎలకలొస్తాయా!'' నోటిలో ఐసు పుల్ల పక్కన పడేస్తూ జడ్జీ నుంచి ప్రశ్న వచ్చేలోపే వాడి మాటను వాడు గాభరాగా అప్పజెప్పేశాడు. గోల్లున నవ్వారు జనం.
''బుద్దిలేకపోతే సరి. ఆలోచించి మాట్లాడండి. లేకపోతే ఈ రోజంతా కోర్టు సమయం పూర్తయ్యే వరకు నిలబడే వుంటారు జాగ్రత్త!''
'' ఒకే ప్రభుత్వంలో వున్న ఇద్దరు అధికారులు. ఒకరు ఆడివే లేదంటే మరొకరు ఏనుగులరాక సహజమే అంటారు. మీకు మీకే స్పష్టత లేదు. మీ ప్రభుత్వానికి అంటూ ఒక పాలసీ ఉండాలికదా'' జడ్జీ సూటిప్రశ్నకు జనంలోని రైతులు కొందరు గట్టిగా చప్పట్లు కొట్టారు.
నాయకుడు చెయ్యెత్తి నిలబడ్డాడు. జడ్జీ మాట్లాడమన్నట్టు సైగ చేశాడు. కోర్టులో చేసినట్టు
''మిలార్డ్!'' అంటూ వంగి నమస్కరించాడు.
''ప్రాచీన కాలం నుంచే మన దేశంలో ఏనుగుల మచ్చిక వుంది. ఏనుగులు కష్టపడి పనిచేసే జంతువులు. అడవులలో భారీ వక్షాలను పడగొట్టడానికి, తరలించడానికి ఉపయోగించే వారు. ఇలాంటి పనులకు ముఖ్యంగా ఆడఏనుగులను వుపయోగించేవారు. దీని కోసమే రాజులు ఏనుగులను వేటాడే వారు కూడా.1652 లో ప్రెంచ్ నగల వ్యాపారి, పర్యాటకుడు టావేర్నియర్ పర్యటనలో ఇక్కడ ఏనుగుల వేట జరిగినట్టు తన యాత్రా చరిత్రలో రికార్డు చేసాడు. కుతుబ్ షా సేనాని మీర్ జుమ్లా గండికోట మీద దాడి చేసి పెమ్మసాని తిమ్మానాయకుని ఓడించి సామంతరాజుగా మార్చుకున్నాక ఆ యుద్దంలో గెలిచిన ఆనందంతో రామకుప్పం అడవిలో ఏనుగుల వేట ఏర్పాటు చేయమని ఈ ప్రాంత దండ నాయకుణ్ణి ఆదేశించినట్టు చరిత్ర''
సాధికారంగా మాట్లాడి ఆపాడు ఆయన.
''చూశారా?'' అన్నట్టు ఎమ్మార్వో వైపు చూసి కళ్ళెగరసాడు జడ్జీ .'' నిజానికి ఈ ఏనుగులు కర్నాటక అటవీ ప్రాంతంలో బయలుదేరి తమిళనాడు హోసూరు అడవుల గుండా కుప్పం పెద్దూరు అడవుల్లోకి వచ్చాయి.1984 లో మొదటిసారి మానవ ఆవాసాల దగ్గరకొచ్చాయి.అంతకు ముందు వచ్చినా ఎన్నడూ గ్రామాల్లోకి జొరబడలేదు. కాబట్టి సమస్య కాలేదు.''
ఆ వివరణతో సంతత్తి చెందిన జడ్జీ ప్రభుత్వ లాయర్ ను అడిగాడు ''ఇప్పుడే ఎందుకు గ్రామాల మీద పడుతున్నాయి?'' నల్లటి ఫుల్ షర్ట్ లోని లావుపాటి వ్యక్తి కష్టంగా లేచి నిలబడ్డాడు. ''వీళ్ళు వొక ఏనుగు పిల్లను చంపేశారు. అందుకని అవి పగ బట్టాయి'' ఆసక్తిగా ముందు వరుసలో కూర్చుని గమనిస్తున్న సాధువు బాధగా మళ్లీ కళ్ళు ముసుకున్నాడు....'' అవే మాటలు... ఏళ్ళు గడిచినా అవే మాటలు...'' అన్నాడు. కోర్టులో ఆరునెలల పాటు విన్న మాటలు.....'' మనసులో గొణుగుడు.
ఏపుగా ఎదిగిన వరిపైరు. పంట చూసి గర్వంగా నవ్వుతున్న కొడుకు.. గాలికి వెన్నులూపుతున్న పంట.. ఒక్క రోజులో ధ్వంసం... పంట తిని, వరిమడి నీళ్లలో విచ్చలవిడిగా పొర్లిన ఏనుగుల గుంపు. ఆ దుఃఖపు క్షణాన కొడుకు మొహం ఎంత ప్రయత్నించినా జ్ఞప్తికి రావటం లేదు. రూపం చెదిరి పోతున్నది...కళ్ళు తెరిచి గంభీరంగా ''ఈ వద్ధ జంబూకాన్ని నమ్మకండి సామీ....'' అన్నాడు. ఈ వూహించని పాత్ర ఎక్కడో తమకు కనెక్ట్ అవుతున్నట్టు క్రమంగా నటులందరికీ అర్థమౌతున్నది. మునుపటి గాభరా ఇప్పుడు ఎవరికీ లేదు. మాటలకు తడుముకో పనిలేదు.
''మీరేమైనా మాట్లాడాలనుకుంటే ముందుకొచ్చి మాట్లాడాలి'' జడ్జీ తనముందు ఒక స్థలాన్ని చూపాడు. సాధువు నిలబడ్డాడు ''మొదటి తూరి వచ్చిన ఇరవై ఏనుగుల గుంపులో ఒకటి ప్రసవించింది. రెండు రోజుల కూనను ఆడివిలో వదిలి ఏనుగుల గుంపంతా తిండివేటకు పోయింది. చీకటి పడుతుండగా ఆ గున్న మేతకు ఆడివిలోకి పోయిన పశువు వెంట ఎరికం బట్టు గ్రామం చేరింది. రైతులు కంగారు పడ్డారు. పసి గున్నకు పాలు పట్ట ప్రయత్నించారు. అది తాగలేదు. సమాచారాన్ని పేర్ణంబట్టు పారెస్టోళ్లకు చెప్పంపారు. వాళ్లొచ్చి ఏనుగుపిల్లను పట్కపొయ్యారు. ఇప్పుడు ఏనుగు పిల్లను తెచ్చిందెవరు? చంపిందెవరు?'' ఎదురు ప్రశ్న వేశాడు సాధువు.
''ఏనుగు తన పిల్లను ఇరవైరెండునెలలు కడుపులో మోస్తుంది. తొమ్మిదినెల్లు మోసే మనకే ఇంత మమకారముంటే దానికెంత నెనరుండాలి?'' సంధించి వదిలిన ప్రశ్నలు.. చూస్తున్న వాళ్లకు ఇది రాను రాను ఆసక్తికరంగా మారుతున్నది. గుమిగూడిన గుంపు పెద్దదైంది. ఒకటి రెండు పల్లె ఆటోలు, ఒక కారు కూడా రోడ్డు పక్కన ఆగాయి. మళ్లీ ఫారెస్టు ఆఫీసర్ వైపు తిరిగాడు జడ్జీ
'' మేము దాన్ని మద్రాస్ జూ కు పంపాము.'' అసంకల్పితంగా జవాబు చెప్పాడు ఆఫీసరు.
''ఎందుకు?'' జడ్జీ
''ఈ దేశంలోఎవరికీ చెందనిదేదైనా ప్రభుత్వ ఆస్థి అవుతుంది కదా?'' ఇదే చట్టమన్నట్టు మాట్లాడిన ఆఫీసర్ మాటలకుజడ్జీ తలపట్టుకొని
''అలా మీ చట్టాల్లో ఎక్కడైనా రాసుందా?
అయినా దాని తల్లితో సహా ఏనుగుల మంద ఇక్కడుండగా కూనను మద్రాసెందుకు పంపారు?''
''ఇక్కడుంటే తిండి ఖర్చు ఎవరు భరించాలి? నా జేబు నుంచి నేను ఖర్చు పెట్టుకోవాలి. తాను దూరకంత లేదు మెడకో డోలు... నా జీతం నా కుటుంబానికే సరిపోదు నేను ఏనుగును ఎక్కడ సాకగలను ..స్వామీ...''
''ఈ విషయం మీపై అధికారులకు తెలుసా?''జడ్జీ
''వాళ్లకు చెప్పే చేశానయ్యా.... మద్రాసు జూ లో ఆ గున్న చచ్చిపోయిన సంగతి కూడా వాళ్లకు తెలుసు.''
''ఏం మనుషులు మీరు! మీ పిచ్చి నిర్ణయాల వల్ల ఒక పసికూన చనిపోయింది.'' జడ్జీ మాటలతో అందరూ విచారంలో మునిగారు. ఏ ఒక్కరూ కదల్లేదు.
''నలభై మంది మనుషులుచచ్చి పోతే పట్టించుకోలేదు గానీ ఒక్క ఏనుగు చచ్చిందని నాకొడుకును జైలుకేశారు''
సాధువు మనసులో గొణుక్కున్నాడు. నాటకం ఆగిపోయేంత దిగులు కమ్ముకుంది అక్కడి వాతావరణంలో.
చక్కదిద్దడం కోసం నాయకుడే లేచాడు.
''మిలార్డ్ ! ప్రభుత్వాలు అనుసరించే రాజకీయ ఆర్థిక పద్ధతుల వల్ల కూడా ప్రజల హక్కులకు భంగం కలగవచ్చుననడానికి యిదే గొప్ప ఉదాహరణ. కొంచెం వివరాలు మీకు తెలియజేస్తాను.
ఒక్కో ఏనుగుకు రోజుకు 200 కిలోల ఆహారం కావాలి అంటే ఒక ఏడాదికి ఒక ఏనుగుకే కనీసం 25 ఎకరాల చిక్కని అడివి కావాలి. ఏనుగులు ప్రతి రోజూ 50, 60 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విహరిస్తాయి. అంటే విస్తారమే కాదు అడివి అవిచ్చిన్నంగా కూడా ఉండాలి.
కలప కోసం అడివి. బాక్సైట్, యురేనియం,
ఇనుము ఖనిజాలకోసం అడివి...ప్రాజెక్టుల
కోసం అడివి... అయ్యా! ఆడవితో ముడిపెట్టకుండా ఏ అభివద్దీ లేదా?
రోడ్లు వేసి అడవిని విచ్చిన్నం చేశారు. వాటికి తగినంతతిండి , తిరగ గలిగినంత స్థలమూ లేకుండా చేశారు. వాటి నివాసంలోకి మనం జొరబడినప్పుడు మన ఆవాసాల్లోకి వాటిని రాకుండా ఆపతరమా?
మొన్నటికి మొన్న హరిబాబు నాయుడుకు చంద్రబాబు ప్రభుత్వం వెంకటగిరి కోట అడవుల్లో ఏటా లక్ష యాభై వేల గ్రానైట్ రాయి తవ్వకానికి అనుమతినిచ్చింది. ఇంత విధ్వంసానికి దారులు తెరిచి ఇప్పుడు బాధ్యతలనుంచి ప్రభుత్వం తప్పుకోవా.....''
నాయకుడి మాట ఇంకా పూర్తి కాలేదు. ఒకే గుంపుగా నలభై మంది అందులో కొందరు పోలీసులు వచ్చారు. నాటకంలో భాగమైన అందరినీ వాన్లోకి బలవంతంగా తోస్తున్నారు. వాళ్ళు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.
''వీళ్ళు నక్సలైట్లు వీళ్ళ మాటలు వినవద్దు.'' పోలీసులు గట్టిగా అరుస్తూ అడ్డువస్తున్న జనాలను చెదరగొడుతున్నారు. హఠాత్తుగా నాయకుడు తన చేతిసంచీలోని కరపత్రాల్ని గాలిలోకి విసిరేశాడు. ''ప్రజలారా! మేము పౌరహక్కుల సంఘం. నక్సలైట్లమ్ కాదు. ఏనుగుల సమస్యతో బాధపడుతున్న రైతుల తరపున హైకోర్టులో కేసు వేశాము. 600 మంది రైతులు ఇందులో పాల్గొన్నారు. పోలీసులను నమ్మకండి'' గట్టిగా అరిచాడు. ''దీని గురించి శుక్రవారం చిత్తూరు టౌన్ హల్ లో మీటింగ్... అందరూ రండి! మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి.'' అరుస్తున్న ఆ నోరుగట్టిగా నొక్కి వాన్లో కుదేశారు. వాన్ కదిలింది. ఐదు నిముషాల్లో ఆప్రాంతం నిర్మానుష్యం అయ్యింది. చీకటి కమ్ముతున్న ఆ సమయంలో అక్కడ కాపలాగా ఇద్దరు పోలీసులు తప్ప ఎవరూ లేరు. వదిలిన చెప్పులతో, విసిరేసిన చేతి బ్యాగులతో, కింద తొక్కి నలిగిన పాంప్లేట్లతో ఆ ప్రాంతం భీభత్సంగా కనిపించింది. ఆ యువకులు చేసిన తప్పేంటో ఇంటిదారి పట్టిన ప్రజలకు అర్థం కాలేదు. వాళ్ళు తమగురించే మాట్లాడుతున్నారన్న విషయం ఆర్థమైంది. దీనివెనక ఏనుగులు కాకుండా ఇంకా ఏవో ఉన్నట్టూ వాళ్లకు మొదటిసారి తెలిసింది.
్జ్జ్జ
వ్యాను వేగంగా పోతూవుంది. ''ఎందుకు మమ్మల్ని అరెస్టు చేశారు? మీ దగ్గర వారంటు వుందా?'' బట్టనెత్తి పెద్దాయనా, బక్కపల్చటి సారూ ఆపకుండా అడుగుతున్న ప్రశ్నలకు వాన్ లో ఏ ఒక్కరూ స్పందించడం లేదు. వాకి టాకీలో ఆదేశాలు మాత్రం అందుతున్నాయి. వి. కోట వైపు పోతున్నట్టు ఆ టీంలోని కొందరు గుర్తించారు.
చీకట్లో నెమ్మదిగా గమనించారు. వాన్లో వాళ్ళతో పాటు సాధువునూ, సంఘంతో సంబంధం లేని మరో ఇద్దరినీ కూడా ఎత్తుకొచ్చినట్టు ఎరుకైంది. సాధువు ఎప్పట్లాగే ధ్యానంలో వున్నాడు. మిగతా ఇద్దరూ భయంతో బితుకు బితుకుమని కూర్చున్నారు. ''ఎమ్మెల్యే సుబ్బయ్య మనుషులు'' వాళ్లలో
వాళ్ళు గుసగుస.
నటులకు యిది కొత్తదీకాదు, మొదటిదీ కాదు. గంట ప్రయాణం తరువాత వ్యాన్ చిన్న పోలీస్ స్టేషన్ ముందు ఆగింది.నిర్జన ప్రదేశమే. పోలీసులు తప్ప జన సంచారం లేదు. అందరినీ దించి స్టేషన్ లోపలికి తరలించారు. పెద్దవాళ్లకు బెంచీలు చూపి మిగతావారిని నేలమీద కూర్చోబెట్టారు.
ఎప్పుడో మధ్యాన్నం తిన్నతిండి. అందరూ నక నకలాడుతున్నారు. ''మీరు ఏమీ చెప్పకుంటేమానె పిల్లలు ఆకలిగొన్నారు ఏమైనా తెప్పించండి.'' బట్టనెత్తి పెద్దాయన రెండొందలు హెడ్డు చేతిలోపెట్టాడు. అరగంటలో ఎర్రటి నూనె కారం దోసెలు వచ్చాయి. స్టేషన్ వెనుక బావినుంచి నీళ్లు తెచ్చుకున్నారు. అవురావురుమంటూ తింటున్నారు. పొట్లం విప్పకుండా, తినకుండా అట్లే వొళ్ళో పెట్టుకొని
'' వెంకటేసుకు కారందోశ చానా ఇష్టం''
సాధువు గుడ్లలో నీళ్లు తిరిగాయి ''ఎప్పుడు కుప్పం కొచ్చినా మునెమ్మ అంగట్లో దోసె తినిపియ్యాల్సిందే'' కొడుకు జ్ఞాపకాలను దేవుకున్నాడు.ఆత్రంగా తింటున్నవాళ్ళు ఒక్క క్షణం ఆగిపోయారు. కడుపు మెలిపెట్టినట్టు అయ్యింది. లోపల దగ్దమయ్యే ఆకలి ఆ వొక్క మాటతో చచ్చిపోయింది. తాను మాత్రం దోశ ముక్క నోట్లో పెట్టుకుంటూ'' ప్రాప్తవ్యమస్తు లభతే మనుష్యహఁ'' నిర్లిప్తంగా అన్నాడు. అందరి మనసులూ వికలమయ్యాయి.
చీకటి పడింది.పై నుంచి సూచనలు బాగానే వచ్చినట్టున్నాయి. లోపల ఒకరు, బైట ఇద్దరు పోలీసులకు సెంట్రీ డ్యూటీ వేశారు. ఆ ఆర్భాటం చూసి నాయకుడు హెడ్డుకు చెప్పాడు. ''మేము దొంగలంకాదు. పారిపోము. రేపు మీ అధికారులు వచ్చాక వారితోనే మాట్లాడతాం. పాపం పోలీసుల్ని ఇబ్బంది పెట్టవద్దు''.
''మా వాళ్ళను కాకుండా మీరు ముగ్గురు వేరే వాళ్లనూ తెచ్చారు. వాళ్లతో మాకు ఏ సంబంధం లేదు. దయచేసి ముందు వాళ్ళను ఇంటికి పంపించండి. వాళ్ళ యింట్లో వాళ్లు కంగారు పడతారు.''
నిజాయితీ నిండిన ఈ మాటలకు హెడ్డు కదిలి పోయాడు. ''సార్ మీ కేసుతో మా స్టేషన్ కు ఏ సంబంధం లేదు. ఈ రాత్రికి ఉంచడానికి మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చారు. రేపు డి.యస్. పి దొరవారు వచ్చేంత వరకు నేను ఏమీ చేయలేను. మా ఎస్సై సారు గూడ వూళ్ళో లేరు. నా మాట నమ్మండి'' చేతి మీద చెయ్యి ఉంచుతూ అన్నాడు.
సాధువు మళ్లీ మన ప్రపంచంలో కొచ్చాడు.అందరూ ఆయన చుట్టూ చేరారు. ''తాతా ఇంతకూ మీదేవూరూ? నువ్వెవరు?'' గుంపులోని పొట్టిబుడంకాయ్ పార్థు గాడు ఆయనగడ్డంతో ఆడుతూ అడిగాడు.
''అండ పిండ బ్రహ్మాండాలలో...
భూ..నభోఅంతరాలలో. పీపీలికా మాత్రమైన అత్యల్ప ప్రాణి యీ మానవుడు..'' కళ్ళు మూసుకున్నాడు.
పరమపిరికి... అత్యంత సాహసి, మహాలోభి...భూరి దానశీలి,
మహా జ్ఞాని.... అంతులేని మూర్ఖుడు..
పరమ క్రూరుడు నిలువెత్తు కరుణామయుడు..
ఒక నాణెం రెండు ముఖాలు.'' చెప్తూపోతున్నాడు
''ఇవన్నీ వద్దు...నీవన్నీ కల్లబొల్లి మాటలు... నిజంగా చెప్పు నువ్వెవరు?''
సొంత తాత అన్నంత గోముపడ్డారు పిల్లలు.
కోల్పోయినదేదో దొరికినంత సంబరం కన్పించింది ఆయనమొఖంలో...ఆశువుగా పాట అందుకున్నాడు
''వీరగుఱ్ఱమ్మ తోపు ఉన్నదొకటి
రెండు కనుమల నడమ లోయ వొగటి
వూరి పక్కన మడుగు ఉన్న దొకటి
మడుగులో తామరల తీరువొగటి
పల్లెలో పదిమంది పచ్చాని రైతులు
రైతులా కనిపెట్టు కలిమి పట్టు
పంటలా పవళించు పచ్చపరుపు
మేఘాలు చిలికేటి చెరుకు తీపి
బరువయ్యి మట్టినీ ముద్దాడు కంకులు
వడ్లు రాగుల వెంట కనులపంట.
మేలి రైతూబిడ్డ మందారి కరియప్ప
పుట్టెనొక పువ్వంటి వెంకటేసు....''
ఆగిపోయాడు....మళ్లీ కన్నీళ్లు...
గొంతు గద్గదమైంది
''మాది మారుమూల పల్లె. పై చదువుకు పంపను అవకాశం లేదు. వూళ్ళో ఐదో తరగతి అయినంక మానేసినాడు.
సదువుమీద వాడిమనసు నిలబడలేదు. వ్యవసాయం వానికి ప్రాణం. మాంచి సేద్యగాడు. మా వూరోళ్ళు ఎరువులు, మందులు కొట్టి పంట తీస్తే... అవేమీ లేకుండా అంత పంట తీసినోడు. ఏదైనా పంటతెగులొస్తే మావూళ్ళో వాళ్ళు సలహా కోసం ఎంకటేసూ... అని పిల్చుక పోయేంత....తెలివి వాడిది. మా బతుకుల్లోకి ఏమని సాములొచ్చినయో...
కుటుంబం నిట్టనిలువు ..కూలిపాయ...
వూరిపక్కనే మడుగుంది. సాములు అక్కడ నీళ్లు తాగేదానికొస్తాయి. మాటిమాటికి పంటలమీద పడతాయి. వరసగా రెండేండ్లు అంటే నాలుగు పంటలు. ఏపుగా పంట చేతికొచ్చే టైములో యిట్లా పొయ్యేటప్పుడో, ఎనక్కు తిరిగి వచ్చేటప్పుడో.... ఏ దేవునికి మా మీద అంత కోపమొచ్చిందో ...పిలిచినట్టు వచ్చేవి. ఆ రెండేండ్లు గడ్డి కూడా ఇల్లు చేరింటే ఒట్టు.
వాటిమీద మాకేమీ కోపం రాలేదు సామీ..
తొలి తూరి వచ్చినప్పుడు ఆ కరియప్పనే మా వూరికొచ్చినట్టు పూజలు చేసి హారతులిచ్చినాం..
రెండేండ్లు నాలుగు పంటలు నాశనమైనా ప్రాప్తమింతే అనుకున్నాం నేనూ నా కొడుకూ. వాటిని చంపాలని అనుకునేంత దుష్టులమ్ కాదు సామీ...
ఈ సారి పంట అనువుగా ఉంది. ఒక్కవారం ఆగితే కోతలు. సాముల సంచారం సమాచారం వచ్చింది మాకు.
నా కొడుకు నాకు తెలీకుండా వాటిని బెదిరించడానికి కరెంటు తీగలు పెట్టినాడు. షాకు తగిలి బెదిరిపోతాయని అంతే. అది పెద్దవైరు.. కరెంటు ఎక్కువ తగిలి ఒక ఏనుగు చచ్చిపోయింది.
అది 1989 స్వతంత్ర దినం మరుసటిరోజు.
వూరు ఊరంతా కదిలింది. దానికి పూజలుచేసి భక్తితో సాగనంపినారు.
విషయం తెలిసి పోలీసులొచ్చి మావాన్ని పట్కపొయినారు. ఆరు నెలలు కేసు నడిచింది. తెలిసిచేసింది కాదు. చంపాలనీ మనసులో లేదు...జరిగిపోయిందంతే... కర్మ పలితం ఐదేళ్ల నుంచీ జైల్లో అనుభవిస్తున్నాడు. చేతికొచ్చిన పిల్లోడు పెండ్లి కావలసినోడు..అగుడుబట్టిపాయ.. బతుకు బుగ్గి అయిపోయ.
వాడు లేకుండా నేను వూళ్ళో ఉండలేకపోతిని. వూర్లో ఎక్కడ తిరిగినా వాడే గుర్తొస్తాడు. మానవుడికి మమకారాన్ని మించిన శిక్ష ఏమీలేదు.'' మహాదేవుడికి నేరుగా ఆత్మనివేదన చేసుకుంటున్నట్టు ఆ మాటలు
''వూరిడిచినా.... దేశాలు పట్టుకోని తిరిగినా. సన్యాసులతో కలిసినా... ఎర్రిస్వామి, తిక్కతాత, కాసిరెడ్డినాయన, వెంకన్న స్వామి.నేను తిరగని ఆశ్రమం లేదు.మొక్కని దేవుడులేడు.... ఏ ఆశ్రమంలో వున్నా పోతన భాగవతం రోజూ చదివి చెప్పించుకునే వాణ్ణి. అది రెండేళ్లు నా మనసుకు మందుపూసింది..''...కళ్ళు మూసే ఉన్నాయి.
''ఇన్నేళ్లకు మనసు పడి కాడి ఇంటిదారి పట్టింది'' చెంపలమీద నీరు ఎండి చారికలు కన్పిస్తున్నాయి....
తొలిఝాము దాటింది...... కువకువలు వినిపిస్తున్నాయి...