సజీవ జీవన విహంగాలు విహారి కథలు

ఎమ్వీ రామిరెడ్డి
98667 77870

వెల కట్టలేని ఆస్తి- అనుభవం!
అధ్యయనానుభవం. సజనానుభవం.
పరిశీలనానుభవం. పరిశోధనానుభవం.
అమూల్యమైన అలాంటి ఆస్తిని పుష్కలంగా సంపాదించు కున్న సాహితీవేత్త విహారి. పద్యకవిగా, వచనకవిగా, కథ-నవలా రచయితగా, వ్యాసకర్తగా, విమర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను కూడబెట్టుకున్న సరస్వతీ పుత్రుడాయన. సాహిత్య ప్రస్థానంలో షష్టిపూర్తి జరుపుకొన్న అరుదైన మూర్తిమంతు డాయన. 'జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి' కాస్తా సర్వ సంపూర్ణంగా 'విహారి'గా రూపాంతరం చెందటం- తెలుగు సాహిత్యానికో చేర్పు.
1980 నుంచి 2015 వరకు విహారి గారు రాసిన కథల్లోని ఆణిముత్యాలను గుదిగుచ్చి, 'విహారి కథలు' మకుటంతో పాఠకుల చేతిలో పెట్టింది నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌. సుదీర్ఘ సాహిత్య ప్రయాణంలో కొన్ని మైలురాళ్లు ఇవి. మానవ జీవితాన్ని విభిన్న పార్శ్వాల్లో ఆవిష్కరించిన ఆయన దృక్కోణాలకు దర్పణాలివి. కాలినడకకు సైతం కనికరించని రహదారుల దగ్గర్నుంచి పల్లెల్నీ పట్టణాల్నీ నగరాల్నీ డిజిటల్‌ కాలుష్యం కమ్ముకున్న ఆధునిక యుగం దాకా కాలం ఆనవాళ్లను కథలుగా రికార్డు చేస్తున్న రచయిత అనుభవం నిస్సందేహంగా అపారమే.

ఉమ్మడి కుటుంబాల్లోని ఆత్మీయానుబంధాలు, పొరపొచ్చా లు, అలకలు, రాజీ పడటాలు; మధ్య తరగతి సంసారాల్లోని సాధకబాధకాలు, అత్తెసరు సంపాదన, ఆచార వ్యవహారాలు, ఆర్థిక ఇబ్బందులు, సర్దుకుపోవటాలు; కాలానుగుణంగా జీవితాల్లోకి చొచ్చుకొచ్చే మార్పుచేర్పులు... ఇవే విహారి కథాసామగ్రి. ఊహాపోహలు, కల్పనలు, కృత్రిమ సందర్భాలు, జీవంలేని సంఘటనలు, వాస్తవదూర వాతావరణం... ఇవేవీ ఈ కథల్లో కనిపించవు.
ఈ కథల్నిండా మనుషులుంటారు. మమతలుంటాయి. అనుబంధాలు, ఆరాటాలు, కలవటాలు, కలిసుండటాలు, విభేదాలు, విడిపోవటాలు... ఇవన్నీ అక్షరాల్లోంచి ఎగిరొచ్చి మనముందు పక్షుల్లా వాలతాయి. కువకువలాడుతూ ఆ పరిణామాలను వివరిస్తాయి.
ప్రతి మనిషీ మోయక తప్పని బరువు- బాధ్యత. జీవన గమనంలో అనుభవం మీద పడేకొద్దీ బాధ్యత అదనపు భారం మోపుతుంది. 'వలయం' కథలో 'ఆయన'కు పెళ్లి చేయటం ఓ బాధ్యత. కోడలికి సాయంగా పల్లె నుంచి పనిమనిషిని ఢిల్లీకి పంపటం ఓ బాధ్యత. అయిన వాళ్లకు సంబంధాలు కుదర్చటం, ఆనక ఆలుమగల మధ్య రాజీలు కుదర్చటం, కోడలి ప్రతిపాదనతో ముడిపడిన చిన్న కొడుకు పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి రావటం... ప్రతి బాధ్యతా ఆయన మోయక తప్పని బరువే! ''ముప్పై ఏళ్ళనాడే తండ్రి ఉండి కూడా కుటుంబంలో సంపాదనాపరుడిగా, ఏకైక పుత్రుడిగా అన్ని బాధ్యతల్నీ స్వీకరించాల్సి వచ్చిన' ఆయన 'ఏమిటీ బతుకు నడక బాధ్యతల వలయంలోనేనా?' అనే ఆలోచన్ల మధ్య నలిగిపోయిన తీరును విహారి చిత్రీకరించిన తీరు అద్భుతం.
తరాల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ఆధునిక సౌఖ్యాల సంకెళ్లలో చిక్కుబడిపోతున్న యువత అలవాట్లను మొన్నటి తరం జీర్ణించుకోలేకపోతోంది. అవసరాలూ ప్రాధాన్యా లూ మారుతున్నాయి. రుచులూ అభిరుచులూ భిన్నంగా ఉంటున్నాయి. 'కొత్త నీరు' కథలోని పెద్దాయనకు మనవడి వేషధారణ నచ్చదు. మనవరాలి టాటూ నచ్చదు. గదులు అస్తవ్యస్తంగా ఉండటం నచ్చదు. అటు పెద్దోళ్లకు నచ్చజెప్పాలో, ఇటు ఈ తరాన్ని బుజ్జగించాలో తెలీక నిన్నటి తరం నిశ్శబ్దంగా ఉండిపోతోంది. చూస్తూ కూచోలేని పెద్దాయన మాత్రం సూచనలూ హెచ్చరికలూ జారీ చేస్తూనే ఉన్నాడు. ఏమైంది మరి? ఆయన మాటలు పిల్లల చెవుల వద్దే ఆగిపోయాయా లేక మనసు దాకా ప్రయాణించి మార్పునకు బీజం వేశాయా? ఆసక్తికర కథనంతో ఆకట్టుకునే ఈ కథ చదివి తీరాల్సిందే.
'నేనంటే యిట్టంగుండు. లేదంటే ఆ యమ్మాయి గతే' అని ఓ పోకిరీ బెదిరింపు! 'ఎట్టా పెంచేదే బిడ్డా నిన్ను? ఏం చేయించేదే? ఏడ దాచగలనే తల్లీ? పెట్టవన్నా కాకపోతివే- ఏ గంపకిందో దాచేదాన్ని' అని ఆ తల్లి ఆక్రోశం. ఇవాళ్టికీ మండుతున్న సమస్య గురించి ఒకటిన్నర దశాబ్దాల క్రితమే రాసిన కథ 'బతుకంత చావు'.
మునసబు కొడుకు సూరి, మునసబు దగ్గర పాలేరుగా పనిచేసే సుబ్బయ్య కొడుకు చంద్రం క్లాస్‌మేట్స్‌. ఓ సందర్భంలో ఇద్దరికీ మాటా మాటా పెరిగింది. యాభై తాటిముంజలు తింటే అయిదు రూపాయలిస్తానని పందెం కడతాడు సూరి. చంద్రం సరేనంటాడు. పందెం మొదలైంది. మన కళ్లు అక్షరాల వెంట పరుగులు తీస్తుంటాయి. ఒక దశలో 'అసలు ఇదేం పందెం! ఇదేం కథ?' అని మనలో ఏదో అసంతృప్తి మొదలవుతుంది. కానీ, ఒక బరువైన ముగింపు వాక్యం మనల్ని పట్టి కుదిపేస్తుం ది. అక్కడే రచయిత అనుభవం అబ్బురపరుస్తుంది. అతి సాధారణంగా కనిపించే సూరి, చంద్రం పాత్రల ద్వారా కలిమి లేముల అంతస్సారాన్ని తెలియజెప్పిన తీరు ప్రశంసనీయం. ఈ కథకు 'చిరంజీవి ఆశ' అనే శీర్షిక పెట్టడం సముచితం.
పాపపుణ్యాలు కేవలం ఊహాకల్పనలేనా? అవి నిజంగా మన చుట్టూ పరిభ్రమిస్తాయా? మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయా? తండ్రి చేసిన పాపం కొడుక్కి గాయం చేస్తుందా? తాత చేసిన పుణ్యం మనవరాలిని శిఖరం ఎక్కిస్తుందా? అన్నీ తాత్విక ప్రశ్నలే. సమాధానాల కోసం సంఘటనల్ని జల్లెడ పట్టాలి. జీవనఖాతాలో జమ పడుతున్న సుఖదుఃఖాలను విశ్లేషించుకోవాలి. 'ఇల్లు- ఒక చేదు మాత్ర' కథలోని రామ్మూర్తి జీవితాన్ని ఇదే కోణంలో సాకల్యంగా విశ్లేషించారు విహారి.
తల్లి చనిపోయినప్పుడు విదేశాల్లో ఉన్న కొడుకులిద్దరూ వచ్చారు, వెళ్లారు. తండ్రి మంచాన పడ్డాడు. పనిమనిషి సాయంతో వెంకటేశ్వర్లు (బాబాయి) చూసుకుంటున్నాడు. ఇండియా వచ్చిన పెద్ద కొడుకుతో 'ఇక నా వల్ల కాదు, మీ నాన్నను మీరే చూసుకోవా'లంటూ వెంకటేశ్వర్లు మొర పెట్టుకున్నా ఫలితం లేదు. స్టీలు సామాను అమ్ముకునే దంపతుల రూపంలో కాస్త ఆదరవు దొరుకుతుంది. ఆ విషయాన్ని చిన్న కొడుకు మాధవకు చెప్పినప్పుడు, అతని భార్య అడిగిన ప్రశ్నకు వెంకటేశ్వర్లులో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఫోన్‌ పెట్టేసి వెంకటేశ్వర్లు అన్న మాటలు...
''వాడేమో రామయ్యా యాదమ్మా చేయబోయే సహాయంలో వ్యాపార సంబంధాన్ని చూస్తున్నాడు. ఈవిడేమో- తన చెల్లెలు ఇంగ్లీష్‌ వాణ్ణి చేసుకున్నా ఆమోదించిన అభ్యుదయవాది- ఇక్కడ కులప్రసక్తి తెస్తోంది. ఇంతలో వుంది మానవ సంబంధాల విలువ! వీళ్ళ మనసులన్నీ ఇరుకూ మురికీ!''
కథాసమయానికి కనకాభిషేకం చేస్తూ 'రోగం' కథలో ఓ పాత్ర ద్వారా ఈ ఆగ్రహ ప్రకటన చేసిన విహారి గారి సాహితీ పరిజ్ఞానానికి ప్రణామాలు.
గంపెడు సంసారాల్ని ఈ తరం పిల్లలు చూసి ఉండక పోవచ్చు. నిన్న మొన్నటిదాకా ఆ సంసారాల సమాహారమే సమాజం. తాతతండ్రులు, జేజమ్మలు, అమ్మలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, వదినా మరదళ్లు, బావలు, మరుదులు... వీరందరి సారథి ఆ కుటుంబ పెద్ద. అతడి లేదా ఆమె బాధలూ బాధ్యతలూ దేవుడికే ఎరుక. ఎన్ని ఇబ్బందులున్నా అందరినీ సమన్వయం చేసుకుంటూ, అందరి అవసరాలూ తీరుస్తూ, అంతిమంగా రాత్రి ఏకపంక్తి భోజన సూత్రాన్ని పరిరక్షించగలిగే ఆ కుటుంబపెద్ద నైపుణ్యం అనిర్వచనీయం. 'మౌనలిపి' కథలోని వదిన పాత్ర ద్వారా ఆ పెద్దరికాన్ని దృశ్యమానం చేశారు రచయిత.
సుభద్ర, ఆమె భర్త టీచర్లు. రిటైరైనా, భర్త మరణించినా ఆమె అదే ఊరిని అంటిపెట్టుకొని ఉంటుంది. ఉదయం నుంచీ సాయంత్రం దాకా వివిధ సేవాకార్యక్రమాల్లో నిమగమై ఉంటుంది. తల్లిని తన వెంట తీసుకెళ్లాలనుకుంటాడు కొడుకు భాస్కరం. తల్లి తిరస్కరిస్తుంది. భాస్కరం, అతని అక్క పద్మ కలిసి ఆస్తుల పంపకంపై వ్యూహం రచిస్తారు. వారి పథకాన్ని పసిగట్టేసిన తల్లి తెలివిగా స్పందించిన తీరు రచయిత ఊహాశిల్పానికి ప్రతీక. ఈ కథకు 'దోసిట్లో నీళ్ళు' అనే శీర్షిక పెట్టాలన్న ఆలోచన అంత తేలిగ్గా రాదు.
అఅఅ
ఈ సంపుటిలోని 'ప్రాప్తం' కథను ప్రత్యేకంగా ప్రస్తావించ దలిచాను. వర్ధమాన రచయితలకు పాఠం వంటిది ఈ ప్రాప్తం. ప్రారంభం చూడండి...
''దుర్దినం. కాకపోతే అంతమాట అంటాడా? మాటా అది?

కొలిమిలో ఖణఖణ కాల్చితీసిన కడ్డీతో పెట్టిన వాత!
పుండు సలుపుతోంది.''
కథకు క్లుప్తత ప్రాణం. ఒకే ఒక్క పదవాక్యంతో కథను ప్రారంభించటం ఓ సాహసం.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఆసక్తిని కొలిమిలా మండించే మరో వాక్యం. ఆగుతామా! అమాంతం మనం కూడా ఆ సాహసయాత్రలో భాగం కామూ! ఈ కథలోని ప్రతి విభాగం చివరా 'పుండు సలుపుతూనే ఉంది' అనే వాక్యం ఉంటుంది. ఆ గాయం తాలూకు బాధను అనివార్యంగా మనం కూడా అనుభవించి తీరాల్సిందే.
ఈ కథలోని మరో విశేషం- వాక్యాల మధ్య గొలుసుల నిర్మాణం! చెట్టు మీదున్న చిన్ని ప్రాణి ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకు చెంగుచెంగున దూకుదున్న దశ్యం కనువిందు చేస్తుంది. అట్లాగే పదాల నుంచి పదాలు పొంగుకొచ్చి, అవి వాక్యాలుగా రూపాంతరం చెందుతూ కథనం చిక్కగా ఆవిష్క ృత మవుతుంటే పాఠకుడిలో ఉద్విగమైన అనుభూతి ఉప్పొంగుతుంది. ఉదాహరణకు...
''సున్నకి సున్న. హళ్లికి హళ్లి. మళ్లీ మళ్లీ పాత సామెత? పాత ఏడుపు. కరి మింగిన వెలగపండు!
'కరి' ఎవరు? హరి. అవును హరి.
హరి ఏం చేశాడు? హరించేశాడు. హరియను రెండక్ష రములు హరియించును!''
ఇట్లా పదాలను ఒరుసుకుంటూ వాక్యాలు, వాక్యాలను హత్తుకుంటూ పేరాలు కథను చిక్కబరుస్తాయి.
''వెల్లకిలా పడుకున్నాను. గోలీకాయల్లాంటి కళ్లతో చూస్తున్నాను. పేరుకు ఇల్లు. పెంకు జారిన కప్పు. పొగచూరిన బొంగులు. బూజుపట్టిన మూలలూ, మసిబారిన బాదులూ. పక్కకి చూస్తే- మసిగుడ్డ కట్టినట్లు నల్లచారికల గోడలు. పాతవాసన వేస్తున్న సామాను. కుంటి కుర్చీ. విరిగిన రెండు బెంచీలు...'' అంటూ సుదీర్ఘ జీవన ప్రస్థానాన్ని కథానాయకుడి తోనే చెప్పించిన విధానం వైవిధ్య భరితం. మనసు ప్రక్షాళన పొందితే మునుల శాపాలు సైతం గాల్లో కలిసిపోతాయని; స్వచ్ఛమైన, పవిత్రమైన జీవనాశయంతో సంసారాన్ని సవ్యంగా నడిపించవచ్చని 'ప్రాప్తం' ప్రాథమిక సందేశం.
''చలనం'' కథలో ''పెరట్లో పాడుబడిన బావి- వంటింట్లో దణ్ణెం మీది మడిబట్టలు- తల వెనక్కు మొలిపించే నాన్న అర్చకత్వం- పులుసులో పడిన బొద్దింకల్లా ఇంట్లో ఆడవాళ్లు - ఆ యింటి జనానికే మూసుకుపోయిన లోవాకిళ్ల''ను ఛేదించుకుని- ఉనికినీ ఆచారాల్నీ వదిలిపెట్టి పరుగులు తీసిన శ్రీనివాస్‌ జీవిత చలనం మన ఊహకందదు. అరటిపండు ఒలిచినట్లుగా సాఫీగా నడిపించి, ఆఖరికి శుభం కార్డుతో ముగింపు పలికే కథలు వెలువడుతున్న 1980లలోనే నర్మగర్భ శైలితో విహారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముగింపులో పాఠకుడికీ భాగస్వామ్యం కల్పించే పరిణతితో వ్యవహరించారు.
ఆలుమగలంటే సుఖదుఃఖాల సంగమం. చీకటివెలుగుల సమ్మేళనం. ''గోరంత దీపం'' కథలో భార్యను గెలిపించాలని శివయ్య, భర్తను గెలిపిస్తూ ఉండాలని జయమ్మ అమలు పరిచే అన్యోన్య సూత్రాలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తిరుగులేని సాంకేతిక చిట్కాలు. 1983లోనే ఇంత అద్భుతమైన కథ రాశారంటే నమ్మశక్యం కాదు.
చాలా సమస్యలకు భూమి అమ్మకమే పరిష్కారంగా మారుతున్న అంశాన్ని 'భూ'మధ్యరేఖ కథలో సీరియస్‌గా చర్చించారు. ఓ పెద్దాయన బతుకు పుస్తకంలోని అధ్యాయాల అభినందనీయ సారాంశం ''పోల్చుకోగల రాతే!''.
అఅఅ
పాత్రల నిర్మాణంలో రచయిత పనిమంతుడై ఉండాలి. పునాదుల్లేకుండా ఎవరెవరినో ప్రవేశపెడుతూ పోతే కథ గందరగోళంగా తయారవుతుంది. కథలమేస్త్రిగా రాణిస్తున్న విహారి గారి నుంచి ఈ మెలకువలు తెలుసుకోవాలి. ఉదాహరణకు 'భ్రష్టయోగి' కథానాయకుడి ద్వారా అతని తల్లిదండ్రుల్ని కథలోకి ఎలా ఆహ్వానిస్తారో చూడండి...
''మా నాన్న మండువా అరుగుమీద పడుకుని రాత్రుళ్లు గొంతెత్తి ఏ త్యాగరాజ కీర్తనో, భజగోవింద శ్లోకాలో ఎత్తుకుంటే ఆ రాగ ప్రస్తారంలో కమ్మతెమ్మరలు ఊరంతటికీ మధుర స్పర్శ లిచ్చేవి. మా అమ్మ ఏభై యేళ్ల క్రితమే పదో తరగతి. నాన్న సాన్నిహిత్యం, వేణుగోపాలస్వామి దేవాలయంలో పురాణ శ్రుత పాండిత్యం ఆమెకీ యింత మర్యాదా, మన్ననా, మంచీ, మాటతీరూ వొంట పట్టించాయి''.
ఇట్లా హాయిగా, హృద్యంగా సాగుతున్న కథనం హఠాత్తుగా కుదుపులకు గురవుతుంది. ఊపిరి తీసుకోవటం మర్చిపోయిన పేషెంటులా మనం గింజుకుంటాం. కాలం విసిరిన వలలో చిక్కి, శల్యమైన తన తండ్రి వైఖరిలో వచ్చిన మార్పుల్ని కళ్లప్ప గించి చదువుతుంటాం. అదీ, రచయిత విజయం.
పదాల సమాహారం పదునుగా ఉంటేనే వాక్యం భావగర్భితం గా ఉంటుంది. వాక్యం రసభరితంగా ఉంటేనే కథనం కమనీయంగా ఉంటుంది. 6500కు పైగా పద్యాలతో పదచిత్ర రామాయణం రచించిన పండితుడికి భాషపై ఎంత పట్టు ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ సామర్థ్యం ప్రతి వాక్యంలోనూ కనిపిస్తుంది. కథారచనలోనూ ఆ భావగాంభీర్యం అడుగడుగునా తొణికిసలాడుతుంది. కొన్ని వాక్యాలు చూడండి...
వాతావరణం మూఢంగా ఉంది. మాటలు ఆశ్చర్యాన్ని దొర్లించినై. (రోగం)
వడగాలి వసారాని దాటి నడవని దబాయిస్తున్నది. (దోసిట్లో నీళ్ళు)
పరామర్శ సాగింది. తన ప్రవర చెప్పుకున్నాడు. బతుకు దౌర్భాగ్యపు చినుగుల్ని కప్పుకోకుండా, విప్పుకున్నాడు. (ప్రాప్తం)
నరనరాల్లో వొక్కసారిగా ఆ ఘటన తాలూకు పులుపుదనం వ్యాపించింది! (గోరంత దీపం)
పెరట్లో మందారచెట్టు దిగంబరంగా స్నానం చేస్తోంది. గడ్డివాములు తడిసిన ఏనుగుల్లా నిలబడి వున్నై. (గోరంత దీపం)
సూర్య శకలంలా మండిపోతున్నాడతను; ఇరుసున బెట్టిన కందెనలా కారిపోతున్నాడతను! (చలనం)
మనసంతా గచ్చపొదలా ఉంది. (సహజాతాలు)
మనిషికి భూమి అంటే దేశానికి జెండా వంటిదర్రా.
('భూ'మధ్యరేఖ)
అఅఅ
పాతకాలం నాటి ఇళ్లు, వాకిళ్లు, భోషాణం, కావడిపెట్టి, కవిలెకట్ట, గంగాళం, ఎడ్లు, గేదెలు, రైతులు, రైతుకూలీలు, శ్రమ జీవనం, సంఘటిత సంసారాలు; కాలానుగుణంగా అవన్నీ బక్కచిక్కిపోతున్న దుఃఖభరిత దృశ్యాలు ఈ కథల నిండా కనిపిస్తాయి.
ఆధునిక యుగపు అవలక్షణాలు కనిపిస్తాయి. మనసుల మధ్య విస్తరిస్తున్న అగాథాలు కనిపిస్తాయి. అగాథాలు చదును చేసుకోటానికి అవసరమైన మౌలిక సూత్రాలు కనిపిస్తాయి. పురాజ్ఞాపకాల్లోంచి పునర్నిర్వచించుకోవాల్సిన మానవీయ మూలాలు కనిపిస్తాయి. నండూరి రాజగోపాల్‌ తన ముందు మాటలో అన్నట్లు... ''చాలామంది కథకులు కొంతకాలానికి పెన్ను మూసేసినా, కళ్లజోడు తీసేసినా విహారి మాత్రం నిర్విరామ శ్రామికుడిగా కథా వ్యవసాయాన్ని చేస్తూనే ఉంటారు''.
తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిన కథాసంపుటి 'విహారి కథలు'.
(ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకొన్న విహారి ఇటీవల తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం పొందారు)