కె.ఉషాబాల
'కథ'ను రసవత్తరంగా ఎలా రాయాలి? మంచి కథ అంటే ఏమిటి? ఈ అంశాలు కథా రచన ప్రారంభంలో బహుశా ఏ రచయిత తనను తాను చర్చించుకోడు. క్రమేపి కధా రచనలో అనుభవం, అనుభూతి, గాఢత వంటివి ఏర్పరుచుకొని వస్తువు, నేపథ్యం, పాత్రలు, అనుభవాలు, అనుభూతి వంటి వాటిని అర్ధం చేసుకుంటాడు. ఓ గొప్ప ఆలోచనలో కథను ప్రారంభించాలని అనుకొన్నా, చివరకు అది పేలవంగా తయారవచ్చు కారణం - ఆలోచనలోని బలం, సాంద్రత 'కథా గమనం'కు ఉపయోగపడే పాత్రలు, నేపథ్యం, వస్తువు, భాష వంటి వాటి వద్ద తేలిపోతాయి. ఎందరో ప్రసిద్ధులు ఒక ఆలోచనకు సంవత్సరాల తరబడి 'చిత్రిక' పట్టి కథారూపంగా తీర్చిదిద్దిన సంఘటనలున్నాయి. కథగా ప్రారంభమైంది 'నవల'గా మారిన సందర్భాలు ఉన్నాయి. రా.వి.శాస్త్రి గారి 'మూడు కథల బంగారం' 'ఇల్లు' వంటివి ఇందుకు ఉదాహరణ. పూర్వ కవులు, పాశ్చాత్యులు కూడా కథలను కావ్యాలుగా తీర్చిదిద్దే కృషి చేసారు. చెకోవ్, ఓహెన్రీ, మొపాసా వంటి వారి కథలు ఇందుకు ఓ గొప్ప ఉదాహరణ. వారి కథల్లో 'మెరుపులు' ఎలా సాధ్యమయ్యాయి? కాష్కా కథల్లోని 'గాఢత' ఎక్కువ మందికి అర్ధం కాదు. 'అబ్సర్డిటీ' గా పెర్కొనవారు ఉన్నారు. కారణం - పాత్రలు వాటి మధ్య ఓ 'అంతు చిక్కని లోతైన' ఆలోచనా విధానం, భాష వంటివి ఇందుకు ప్రత్యేకంగా చెప్పకోవచ్చు. అనుభవాలు, అనుభూతులుకు తగిన భాగస్వాయ్య అవసరం. మామ్, శరత్, చలం వంటి వారి పాత్రలు - వాటి భాషలను పరిశీలిస్తే 'ఒక స్థాయి' లో ఉంటాయి. వారి కథా వస్తులు తగిన పాత్రలతోనే ఈ 'విశేషం' సాధించారు. అసలు ఏ భాషా ఎటువంటి భాష అనేది సమస్య కాదు. ప్రాంతం, పాత్ర పరిధి, అర్హతలు, స్థాయి, రాజకీయ, సామాజిక, మతపరమైన 'అంశాలను దృష్టిలో ఉంచుకొని 'భాష'కు ప్రాధాన్యతనివ్వాలి. ఒక్కొక్కసారి 'పాత్రను' మించిన భాష కూడా ఇబ్బందికరమైన అంశంగా ఉంటుంది. కనుకనే కథకునికి జాగూరుకత అవసరం చలం, శ్రీపాద వంటి వారి కథలు చదివితే 'భాష' యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. కథ రమ్యమై రూపం ఇవ్వగలిగేది 'భాష'. చదువరులను ఎన్నాళ్లయినా వెంటాడగలిగేది కూడా అదే. కనుకనే కథల్లో భాషకు ప్రాధాన్యతనిచ్చారు. 'భాష' అనేది 'శైలి-శిల్పం' అనే వాటికి ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతీ రచయితకు తనదంటూ ఒక వ్కక్తిత్వం ఉంటుంది. దానికనుగుణమైన 'శైలి' అలవర్చుకుంటాడు. శైలికి తగిన భాషను ఎన్నుకుంటాడు. చలం, శరత్, బుచ్చిబాబు, శ్రీపాద, కా.రా మాష్టారు, భూషణం, విశ్వనాధ, శ్రీశ్రీ, అరుద్ర ఇలా చెప్పకుంటూ పోతుంటే ఆయా రచయితల 'శైలి - భాష' అనేవి చదువరుల మనస్సులో 'ముద్ర' వేస్తాయి. వెనువెంటనే 'ఒక చిత్రం' వారికి తడుతుంది. వీరి కథలు చూడండి (చదవండి) 'విభిన్నత' అర్ధమవుతుంది. అదేవిధంగా సతీష్చంద్ర, బీనాదేవి, పతంజలి, ముళ్ళపూడి యర్రంశెట్టి, మల్లాది, వీరేంధ్రనాథ్ తదితరుల కథలను గమనిస్తే వారి శైలి - భాష - వ్యక్తిత్వాలు స్పష్టం. ఏతావాతా చెప్పేదేమిటంటే 'మంచి రచనకు మంచి భాష' అవసరం. ఇక్కడ గమనించవలసిన అంశం ఒకటుంది. మన దేశం, రాష్ట్రం, ప్రాంతం తదితరాలను 'కథల్లోని వస్తువుగా స్వీకరిస్తే ఆ ప్రాంతపు వాతావరణం, ప్రాంతీయత, వ్యవసాయం, ప్రకృతి, వ్యక్తులుకు దగ్గరగా పాత్రలు, భాష అవసరం చిత్తూరు (మథురాంతకం) శ్రీకాకుళం (కా.రా, అట్టాడ, భూషణం) తెలంగాణా, రాయలసీమ (బి.ఎస్రాయులు, కేశవరెడ్డి, సన్నపురెడ్డి) ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ప్రత్యేక భాష, యాస ఉన్నాయి.
కాని బుచ్చిబాబు వంటి రచయితలు మాత్రం మానవ సమస్తత్వ విశ్లేషకు ప్రాధాన్యతనిచ్చి చివరివరకు ఆ దిశగానే తమ రచనలు కొనసాగించారు. చలం, పాలగుమ్మి, భానుమతి, బుచ్చిబాబు ఇంకా ఎందరో తమదైన 'ముద్ర'ను ఏర్పరుచు కున్నారు. రచనకనువైన 'భాష'ను ఏర్పరుచుకున్నారు.
బుచ్చిబాబు గారు కథా రచయితగానే సుప్రసిద్దులు 'చివరకు మిగిలేది' ఒక్కటే ఆయన నవల, దాదాపుగా 50 వరకు ఆయన కధలున్నాయి. అన్నింటిని పరామర్శించే సమయం, స్థలం లేదు కనుక కొన్నింటిని మాత్రం స్పశించుకుంటున్నాను. కధా నేపథ్యంను వివరించే క్రమంలో ఓ ప్రధానమైన ఆయుధం భాష. కధలోని వాస్తవికతను తెలియజేసేది భాషతో పాత్రలు తమ భావాలన వ్యక్తం చేసే వారథి. పాత్రలు చెప్పకోని వాటిని రచయిత చెబుతాడు (బుచ్చిబాబు రచనల్లో ఇది ఎక్కువ). పాత్ర మాట్లాడే భాష 'ఆ పాత్ర పైన నమ్మకం'ను కలిగిస్తాయి. 1910 లో గురజాడ 'దిద్దుబాటు' ను మొదటిలో గ్రాంధిక భాషలో రాసి, తరువాత వ్యవహారిక 'భాష'లోనికి మార్చారు. శ్రీపాద వారు 'కధకు' సాధారణమైన భాషకు శ్రీకారం చుట్టారనే చెప్పాలి. నేపధ్యానికి, పాత్రలకు, కథాంశానికి మధ్య ఉన్న సజీవ సంబంధాన్ని చిత్రించే ప్రయత్నం చేసిన తొలి కథా రచయిత శ్రీపాద వారనవచ్చు. ఇటువంటి భాషా కథనాలు బుచ్చిబాబు రచనల్లో కనిపిస్తాయి ఈయన కథ 'పొగలేని నిప్పు' శీర్షికలోనే ఓ విచిత్రం ఉంది. ఇది కథలో కూడా కనిపిస్తుంది. ఈ కథలో ప్రధాన పాత్రలు నాగయ్య, భార్య సీతారత్నం, భాస్కరం అతని భార్య పార్వతి. ఈ నాలుగు పాత్రలనడుమనే కడప, చిత్తూరు, బళ్ళారి ప్రాంతాల నడుమనున్న 'సంభాషణలోని' విరుపులు క్రొత్త క్రొత్త పదాలును తెలియజేస్తారు. 'నువ్వుశానా మంచి మొగుడువేగా, నాగయ్యలాగా పీకులాట మనిషి కావులే' అని అనటంలోని ఓ 'రహస్యంతో కూడిన సరసం' ఉంటుంది. సీతారత్నమంటే భాస్కరానికి ఇష్టం. ఇది ఏ రకం ఇష్టం అనేది చివరి వరకు 'సస్సెన్స్' - ఎవరికి తోచిన నిర్వచనాలు వారివి. నాగయ్యకు, పార్వతికి కూడా ఈ 'చనువు' తెలుసు. అందరూ కలిసే ఉంటారు. 'మరి చాశ్మరత్నం' 'మీది మీది కొస్తావేం, పాడు పిల్లడ' 'మజుబూతిగా (అనగా - గట్టిగా అన్న మాట) 'ఆయుత్తు పరుస్తాలే' 'తలంటుపోసుకుంటే' 'జులాయిస్తుందిలే' (మైకంగా ఉంటుందనుకో)' యెండగొట్టబడి నట్లుండావు - ఇలా ఆ సోదా వేసుకో' ఇలా ఎన్నెన్నో సంభాషణల్లో ఓ 'చిత్రమ'యిన భాష ఉంది. మరో కథ 'నేటి పావురం రేపటి నెమలి' ఇందులో కామేశం, కుమారి, రామ్మూర్తి వంటి పాత్రలున్నాయి. పాత్రల వ్యక్తిత్వాన్ని 'భాష'కు అనుగుణంగా వాడుకోవటం బుచ్చిబాబు రచనా చమత్కృతి. ఆయన సంభాషణల్లోనే కాదు 'వర్ణన' లోను ఓ 'ప్రత్యేకమైన పదబంధాలను' ఉపయోగిస్తారు. కామేశం గురించి 'చెబుతూ నడివయిస్సు స్తబ్ధత దిగవిడిచి, వెనక్కి యవ్వనంలోకి ప్రయాణం సాగిస్తున్నామా' అన్న అనుమానం అతనిది' అంటారు. 'చెడ్డ వాళ్ళ మంచితనం అంతటి ప్రమాదం' మరో కథ 'నిరంతరత్రయం' కరుణాకరం, కామేశం, సుగుణ, రచయిత ఇందులోని పాత్రలు ముగింపులో 'కరుణాకరం' ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకు అనేది పాఠకులు (రకరకాలుగా) ఊహించుకోవచ్చు. ఇక్కడ రచయిత మాట 'చటుక్కున నా మనస్సుకి వోభావం స్ఫురించింది. అదేమిటో చెప్పేసి, తర్కించి, పాఠకుల కాలం వృథాపరచటం అన్యాయం అంటారు. ఈయన ఉపయోగించే భాష 'ఓ రహస్య మార్మీకత' ఉంటుందనిపిస్తుంది. కథా ప్రారంభంలో 'ప్రపంచంలో నేటి అరిష్టాలకి కారణం తెలివిహీనులు నిస్సంకోచంగా ప్రవర్తించడం, తెలివిగలవారు శంకలతో, సందేహాలతో బాధపడి అసహాయులవడం' అని మొత్తం కథను 'సంకేత భాష'లోనే చెప్పేస్తారు. ఈ విషయం కథ చివర్లో తెలుస్తుంది. కరుణాకరం ఏ కోవలోకి వస్తాడు అనేది. ఎందుకు ముగింపు వాక్యాలు ఆ విధంగా ఉన్నాయి అని కూడా తెలుస్తుంది.
కథలో మరో సందర్భంలో 'మనస్సు శరీరాన్ని కలవర పెడుతుంది. శరీరం మనస్సును చిరాకు పరుస్తుంది. ఆ రెంటి సమన్వయం సంపూర్ణ ఆరోగ్యం'. సుగుణ, కరుణాకరం, కామేశం అనారోగ్యం వెనుక ఈ చిన్న సూత్రం వారికి తెలియకపోవటమే అనుకుంటారు చదువరులు. ఓ ప్రహేళిక యుతమైన భాషను ఉపయోగిస్తూ, సంభాషణలతో ముందకు వెలుతున్న కొద్ది గాఢతను పెంచుతూ చిరవకు 'పజిల్'న తెలియనట్టు అమాయకంగా 'గడుసుతనంతో' విడదీయటం ఆయన శైలికి వన్నెలద్దిన 'భాషా' నిపుణత. సుగుణను గూర్చి ఒక వర్ణనలో 'తీక్షణమైన ప్రాచీన మానవత్వాన్ని , పురుషత్వాన్ని సూచిస్తున్నాయి.' అంటారు. 'నిండైన అందమైన ప్రేమలో విషాదం ఉంది కాబోలు' సుగుణ గురించి చెబుతూ, 'ఆమె అనారోగ్యానికి ముందు 'నర్సింగ్ హోమ్ కాదు. రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారం' అంటారు. ఆమె బహిరంగంగా పది మందిలో ఉన్నప్పుడే తీక్షణంగా జీవించగలుగుతుంది(ట) మరో కథ' అరకులోయలో కూలిన శిఖరం' 'ఎల్లోరాలో ఏకాంత సేవ' అనే కథల్లో కూడా ఈ విధమైన 'వర్ణణాయుత' 'ప్రయోగాత్మక' 'ప్రణాళికయుతమైన' 'ఓ రహస్య సందేశా త్మకమైన' భాష ముమ్మరంగా కనిపిస్తుంది. ఈ కారణం చేతనే ఆయన కథలను తొలిసారి కన్నా రెండు, మూడు సార్లు చదివిన తరువాతనే వాటిలోని 'వాస్తవిక దృక్పథం' 'జీవన తాత్వికత' 'జీవనసారం' అవగతమవుతాయి. నేపధ్య చిత్రణలో, పాత్రలను పరిచయం చేస్తూ వాటి వ్యక్తిత్వాల్లోని గాఢతను వివరించడంలో 'భాష' ప్రాముఖ్యతను తూకం వేసి చిత్రించ గల నేర్పరి - బుచ్చిబాబు గారు.