ఆదిత్య ముఖర్జీ, మృదులా ముఖర్జీ
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కారణంగా విద్యా కార్యక్రమాలను కోల్పోయిన పిల్లలపై భారాన్ని తగ్గించడానికే పాఠ్య పుస్తకాల నుండి కొన్ని భాగాలను తొలగించాల్సి వచ్చిందని ఎన్సిఇఆర్టి డైరెక్టర్ వివరణ ఇచ్చారు. చరిత్ర, సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్రాల పాఠ్యపుస్తకాల నుండి తొలగింపులు, ఆ సందర్భంగా పాలక పార్టీ సభ్యుల రాజకీయ ప్రకటనలు, చరిత్ర వక్రీకరణ కోసం హిందూ మతతత్వవాదులు సుదీర్ఘకాలం గా చేస్తున్న ప్రయత్నాల చరిత్రను విశ్లేషిస్తే మనకు అసలు విషయం స్పష్టమౌతుంది. మతపరమైన ప్రాజెక్టుకు మతపరమైన భావజాలం అత్యంత ముఖ్యమని ఆర్ఎస్ఎస్ చాలా ముందు గానే గుర్తించింది.
మహాత్మా గాంధీ హత్య నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ తమ సంస్థ కేవలం ఒక సాంస్క ృతిక సంస్థగానే పని చేస్తుందని ప్రమాణం చేసిన తరువాత మాత్రమే ఆర్ఎస్ఎస్పై నిషేధాన్ని తొలగించారు. తరువాత ఆర్ఎస్ఎస్ తన భావజాలాన్ని వ్యాప్తి చేసే పనిలో నిమగమైంది. 1950 నుండి ఆర్ఎస్ఎస్ తమ పాఠశాలలు (మొట్టమొదటి సరస్వతీ శిశుమందిర్కు నాటి ఆర్ఎస్ఎస్ అధినేత ఎం.ఎస్.గోల్వాల్కర్ ప్రారంభోత్సవం చేశాడు), పాఠ్యపుస్తకాల ద్వారా వక్రీకరించబడిన చరిత్రను, పూర్తిగా ఊహాజనితమైన చారిత్రిక దక్పథాన్ని ప్రచారం చేసేందుకు ప్రయత్నించింది. ఇతర మతాల వారిని ప్రమాదకారులుగా కూడా చిత్రించింది.
చరిత్రను వక్రీకరించడానికి, లౌకిక వైజ్ఞానిక చరిత్రపై దాడి చేయడానికి ఆర్ఎస్ఎస్ తన రాజ్యాధికారాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. 1977-79 మధ్య కాలంలో కేంద్రంలో జనతాపార్టీ అధికారం చేపట్టినప్పుడు మొదటిసారి చరిత్రపై పెద్దఎత్తున దాడి జరిగింది. అప్పటికే
ఆర్ఎస్ఎస్ రాజకీయ అనుబంధ సంస్థ జనసంఫ్ు, జనతా పార్టీలో విలీనమై అధికారంలో భాగస్వామిగా ఉంది. ప్రపంచ ప్రసిద్ధ మేథావులైన రొమిల్లా థాపర్, బిపన్ చంద్ర, సతీష్ చంద్ర, ఆర్.ఎస్.శర్మ, అర్జున్దేవ్ లాంటి వారు రచించిన ఎన్సిఇఆర్టి పాఠ్య పుస్తకాలను నిషేధించాలని చూశారు. కానీ ఈ విషయమై ఎన్సిఇఆర్టి లోపల, మీడియా, విశ్వవిద్యా లయాల్లో దేశవ్యాప్తంగా ప్రతిఘటన రావడంతో వాటినే కొనసాగించారు.
ఆ తరువాత 1999లో కేంద్రంలో ఎన్డిఎ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. ఆర్ఎస్ఎస్ కు ఒకప్పుడు రాజకీయ అంగంగా ఉన్న జనసంఫ్ు స్థానంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వానికి సారథ్యం వహించింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని (లౌకిక వైజ్ఞానిక చరిత్రకారులపై దాడి ప్రారంభిం చడానికి ముందు), సిలబస్ కమిటీలలోని కీలకమైన వ్యక్తుల్ని, ఎన్సిఇఆర్టి, యుజిసి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సంస్థల్లో ఉన్నత స్థానాల్లోని కీలక వ్యక్తులను తొలగించింది. మతపరమైన భావనలు గాయపడ్డాయనే కారణంగా ఆర్.ఎస్.శర్మ, రొమిల్లా థాపర్, బిపన్ చంద్ర, సతీష్ చంద్ర లాంటి వారు రచించిన ఎన్సిఇఆర్టి పాఠ్యపుస్తకాల్లోని 41 పేరాలను తొలగించాలని కోరారు. ఆ పేరాల్ని తర్వాత తొలగించారు. ఎన్సిఇఆర్టి నూతన డైరెక్టర్గా నియమితుడైన జె.ఎస్.రాజ్పుత్ తన వ్యాసంలో లౌకిక మేథావులు, వారిని సమర్థించిన వారిని (వీరిలో నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్, భారత రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్, ప్రధాన వార్తాపత్రికల సంపాదకులు ఉన్నారు) 'జాతి వ్యతిరేకులు'గా అభివర్ణించారు.
హిందూ మతోన్మాద చారిత్రిక దక్పథాన్ని అంగీకరించని
వారిపై దాడి చేసే ధోరణి పెరిగింది. ముఖ్యంగా భారత జాతీయ వాదానికి స్వీయ నియమిత రక్షకులుగా చెప్పుకునే ఒక గ్రూప్ వారు నాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి మురళీ మనోహర్ జోషి ఇంటి దగ్గర చేరి రొమిల్లా థాపర్, ఆర్.ఎస్.శర్మ, అర్జున్ దేవ్ లాంటి చరిత్రకారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసినప్పుడు ఆ విషయం స్పష్టమైంది. వీరు రచించిన చరిత్రను 'మేథో తీవ్రవాదం'గా ముద్ర వేయడం ద్వారా తమ ఫాసిస్ట్ ధోరణికి విద్యామంత్రి మరింత ఆజ్యం పోశారు. అంతేకాక ఈ మేథో తీవ్రవాదం సరిహద్దు తీవ్రవాదం కంటే ప్రమాదమైన దనీ, దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి వ్యాఖ్యానించారు. చివరకు వారు రచించిన ఎన్సిఇఆర్టి పాఠ్యపుస్తకాలు తొలగించి, కొత్త పాఠ్యపుస్తకాలను తెప్పించారు. తిరిగి 2004లో కేంద్రంలో హిందూత్వ శక్తులు అధికారం కోల్పోవడంతో మతతత్వ దాడుల నుంచి కొంత ఉపశమనం కలిగింది.
2014, 2019లో బిజెపి నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో ఆర్ఎస్ఎస్, బిజెపి లు తమకు అనుకూలమైన చరిత్రను తిరగరాసే అవకాశాన్ని పొందాయి. ముద్రణలో ఉన్న ఎన్సిఇఆర్టి పాఠ్యపుస్తకాల్లోని తొలగింపుల నివేదికలు బయటపడడం మొదలయ్యాయి. 2001లో మాదిరిగా ఎన్సిఇఆర్టి పాఠ్యాంశాల తొలగింపుకు ముందు ఆర్ఎస్ఎస్ ప్రచురణలు కూడా దాన్నే డిమాండ్ చేశాయి. జూన్ 2021లో బిజెపి ఈ-ట్రైనింగ్ సెల్ నేషనల్ కన్వీనర్ నేతృత్వంలోని 'పబ్లిక్ పాలసీ రీసెర్చ్ సెంటర్' ప్రస్తుత చరిత్ర పాఠ్యాంశాల్లో మార్పుల్ని డిమాండ్ చేస్తూ ఒక నివేదికను రూపొందించింది. అదేవిధంగా బిజెపి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త సహస్ర బుద్ధే నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కూడా ఇలాంటి నివేదికనే రూపొందించింది. ఎన్సిఇఆర్టి సవరించిన సిలబస్ను రూపొందించింది. ఈ సిలబస్లో మొఘలుల కాలంనాటి చరిత్రతో పాటు ఢిల్లీ సుల్తానులు, తుగ్లక్లు, ఖిల్జీలు, లోడీల చరిత్ర భాగాల్ని పెద్దఎత్తున తొలగించారు.
అన్ని తొలగింపులతో కూడిన కొత్త పాఠ్యపుస్తకాలు ఏప్రిల్ 2023లో మార్కెట్లోకి వచ్చాయి. పుస్తకాలు విడుదలైన వెంటనే మళ్ళీ బిజెపి నాయకుడు కపిల్ మిశ్రా 2023 ఏప్రిల్ 4న ఇలా ప్రకటన చేశారు : ''ఎన్సిఇఆర్టి సిలబస్ నుండి మొఘలుల తప్పుడు చరిత్ర తొలగింపు గొప్ప నిర్ణయం. దొంగలు, జేబు దొంగల్ని మొఘల్ సుల్తానులని, భారతదేశ చక్రవర్తులని పిలిచారు. అక్బర్, బాబర్, షాజహాన్, ఔరంగ జేబులు చరిత్ర పుస్తకాల్లో లేరు. వారంతా చెత్తబుట్టలో ఉన్నారు''. ముస్లింలను నిత్యం దూషించడం, రోడ్లకు, నగరాలకు పెట్టినవారి పేర్లను తొలగించేందుకు ప్రయత్నించడం, ఇప్పుడు కొత్త పాఠ్యపుస్తకాలు తీసుకురావడం... వంటివన్నీ ముస్లింల పట్ల వారికున్న ఆలోచనలకు అనుగుణంగానే జరిగాయి. ముఖ్యంగా 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన అంశాలు (నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు), ఈ విషయమై జాతీయ మానవ హక్కుల కమిషన్ పరిశీలనలు... తదితర అంశాలను కూడా పాఠ్యాంశాల నుంచి తొలగించారు.
మొఘలులు, సుల్తానుల కాలాల్ని చరిత్రలో లేకుండా చెరిపి వేయడం కూడా మన చరిత్ర అవగాహనకు చాలా హానికరం. భారత ప్రజలు ఈ కాలాన్ని హిందువులపై ముస్లింలు కొనసాగిం చిన ఆగడాల్లో ఒకటిగా చూడలేదు. బ్రిటీష్ వలస సిద్ధాంతకర్తలు మొదటిసారిగా ఆ దృష్టితోనే ఈ కాలాన్ని వీక్షించారు. దీనిని హిందూ మతోన్మాదులు ప్రచారంలో పెట్టారు. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో సైనికులు, అన్ని కులమతాలకు చెందిన వారు బ్రిటీష్ వారిని పడగొట్టే ప్రయత్నం చేశారు. వారి స్థానంలో వచ్చింది మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ తప్ప వేరెవరో కాదు. మన పిల్లలకు ఈ కాలం గురించి తెలియకుండా చేయడమంటే ఎవరి కాళ్ళని వారే నరికేసుకోవడం లాంటిదే.
మహాత్మా గాంధీ హత్య గురించి కూడా పాఠ్యాంశాల నుంచి తొలగించారు. ఇది కూడా చాలా రహస్యంగా చేశారు. ఏప్రిల్ 2022లో పాఠశాలలకు పంపిన జాబితాలో కూడా ఈ తొలగింపుల గురించి పేర్కొనలేదు. భారత దేశాన్ని హిందువుల కోసం మాత్రమే మార్చే ఏ ప్రయత్నమైనా భారత దేశాన్ని నాశనం చేస్తుందనే గాంధీ దృఢ విశ్వాసం గురించి, హిందూ ముస్లిం ఐక్యత కోసం ఆయన చేసిన కృషి గురించి, ఇది నచ్చని హిందూ తీవ్రవాదులు గాంధీజీని హత్య చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారనే అంశాలు కూడా తొలగించబడ్డాయి. పన్నెండవ తరగతి చరిత్రలో గాంధీజీని హత్య చేసిన వ్యక్తికి సంబంధించిన రాజకీయ (సవరించిన పేరాలో) వివరాల్ని తొలగించారు. అది ఇలా ఉంది: 'ఆయన రోజువారీ ప్రార్థనా సమయంలో (జనవరి 30న) గాంధీజీని ఒక యువకుడు కాల్చి చంపాడు. ఆ తరువాత గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సే లొంగిపోయాడు'.
ఇలాంటి తొలగింపులతో మనం ప్రశ్నలు అడగని, ఆలోచించని భక్తుల తరాన్ని సృష్టించడంలో కృతకృత్యుల మౌతాం. అయితే మన పిల్లలు మతాంధులుగా ఉండాలని మనం కోరుకోం. అదృష్టవశాత్తు, ఈ తొలగింపులపై పెద్ద సంఖ్యలో విద్యావేత్తలు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. అనేక వార్తాపత్రికలు ఎన్సిఇఆర్టి నిర్ణయాన్ని విమర్శిస్తూ సంపాదకీయాలు ప్రచురించాయి. రాజ్యాంగ ధర్మానికి, భారత ఉపఖండంలోని ప్రజాస్వామ్య, మిశ్రమ సంస్కృతికి వ్యతిరేకంగా విభజన లక్ష్యాలతో పాఠ్యాంశాల్లో చేస్తున్న మార్పులను వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేయాలి.
(వ్యాసకర్తలు జెఎన్యులో ప్రొఫెసర్లుగా పనిచేశారు)
('ద వైర్' సౌజన్యంతో)