వి.రెడ్డెప్ప రెడ్డి
94400 44922
పాటూరుకు వెళ్ళే పల్లెవెలుగు నైట్ హాల్టు బస్సు బస్టాండులో ఆగంగానే, తూర్పుపఠానికి భయపడి సర్రుమని బిలాల్లోకి దూరి పోయే రెయిమేత గువ్వల్లా తోసుకుంటూ, తొక్కుకుంటూ, కసురుకుంటూ, అరుచుకుంటూ బస్సులోకి దూరడం, దూకడం ప్రయాణీకుల అలవాటు. ఎవరికి వారు కర్చీప్, టవల్, బ్యాగు ఏది అందుబాటులో ఉంటే అది వేసి సీట్లు రిజర్వు అనడం, వాటిని పక్కకు తోసేసి ముందుగా బస్సెక్కిన వాళ్ళు సీట్లు ఆక్రమిం చుకోవడం కూడా అలవాటే. అలాంటిది ఆ రోజు ఒక్కొక్కరు ఒకో సీట్లో కూర్చున్నా బస్సులో ఇంకా సీట్లు మిగిలి ఉండటం దోణప్పకు ఆశ్చర్యం కలిగించింది. చిన్నపుడు వాళ్ళ నాన్న అడిగిన, 'యెన్నుకొగటి కూసుంటే వొగ గువ్వ మిగుల్తుంది, రెండేసి కూసుం టే వొగ యెన్ను మిగుల్తుంది, చేన్లో గువ్వలెన్నో, యెన్నులెన్నో చెప్పు' ప్రశ్న గుర్తొచ్చింది.
తల్లిదండ్రులను సొంతూరులో వదలి దోణప్ప భార్యాపిల్లలతో బెంగళూరులో స్థిరపడి పదేళ్ళవుతూ ఉంది. పదేళ్ళలో ఇసుక, కంకర, సిమెంటు అందించే కూలీ స్థాయి నుంచి నాణ్యమైన తాపీమేస్త్రీగా ఎదిగాడు. నాలుగిళ్ళలో పాచిపనికి కుదిరిన తన భార్య శంకరమ్మ ఇపుడు ఆ పని మానేసి పిల్లల వెంటపడి చదివిం చడం మొదలెట్టింది. రోజువారి పనుల్లో సతమతమయ్యే దోణప్ప దంపతులకు వేసవి సెలవుల్లో పిల్లలతో సొంతూరికి పోవడం అలవాటు.
రాత్రి ఎనిమిది గంటలకు బస్సు పాటూరు చేరింది. అది యాభై ఇండ్ల పల్లె. రెండే వీధులు. ఎగువ వీధిలోని దోణప్ప ఇంటికి బీగం వేసి ఉంది. ఆవుదూడ మాత్రం పక్కన సపారిలో కట్టేసి ఉన్నాయి. దోణప్ప అమ్మానాన్న ఎక్కడికెళ్ళారో చెప్పడానికి ఆ వీధిలో ఎవరూ లేరు. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు కూడా లేరు. ఇండ్లన్ని బోసిగా ఉన్నాయి. ఎక్కడికెళ్ళారా? ఆలోచి స్తూ ఆలుమగలు నిలబడ్డారు. నానమ్మ, తాతయ్య ఒడిలో వాలి
పోవాలనుకున్న నాగరాజు, నాగమణి నిరాశలో మునిగారు.
'ఇప్పుడెలా?' అనుకుంటూ దోణప్ప వీధి వెంట చూస్తున్నాడు. ఏళ్లుగా వెలిగి వెలిగి అలసిన వీధి లైటు వెలిసిపోయి ఒకింత పసుపు రంగు కలుపుకుని గుడ్డి వెల్తురు పరుస్తున్నది. 'కొత్త రక్తం గావు' అన్నట్లు కుప్పలుగా దోమలు వీళ్ళ చుట్టూ తిరుగుతూ పొలికేకలు పెడుతున్నాయి. రాత్రంతా దోమలకు ఆహారమైతే మాత్రం నలుగురూ అనారోగ్యం మూటకట్టుకు పోవాల్సిందే, మరి ఎక్కడుండాలని ఆలోచిస్తున్నాడు దోణప్ప.
వీరి ఆలోచనలను తుంచేస్తూ ఓ బస్సు వచ్చి ఎదురుగా ఆగింది. రెండుసార్లు 'కురు కురు' మంటూ హారన్ మోగగానే, అలవాటైన స్కూలు పిల్లల్లాగా ఊరి దిగువ వీధినుంచి పిల్లాజెల్ల కలిపి యాభైమంది ఉరుకులు పరుగుల మీద బస్సులోకి ఎగ బడ్డారు. బస్సులో నుంచే దోణప్పను గుర్తుపట్టిన బాల్యమిత్రుడు యెంగటేసు ''మీ నాయనోళ్ళు ఆసుపత్రికి బొయిండారు, మీరుగుడక రాండి'' అన్నాడు.
ఆసుపత్రికి పొయినారనంగానే ఊపిరాగినంత పనైంది దోణప్పకు. పల్లెలో మిగిలిందేమైన ఉంటే పట్నానికి ఎగేసుకు పోదామనొచ్చాడు. అలాంటిది అమ్మానాన్న ఆసుపత్రి పాలైతే పట్నంలో బుడుక్కొచ్చిందంతా పల్లెలో ఖర్చుపెట్టాల్సొస్తుందనే భయపడ్డాడు. మరో ప్రశ్న వేయకుండా బస్సెక్కాడు, వెనకే భార్యాపిల్లలు కూడా.
ఐదు కిలోమీటర్ల ప్రయాణం తరువాత ఓ పెద్ద గేటు గుండా లోపలికి చేరింది బస్సు. ప్రయాణంలో మిత్రుడు చెప్పిన వివరాల ప్రకారం.. 'మెడికల్ కాలేజీ కొత్తగా ఏర్పాటయింది. కాలేజీ
నడపాలంటే అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో రోజుకు కనీసం రెండు మూడొందల మందయినా రోగులుండాలి. కొంతమంది ఆసుపత్రిలో ఇన్-పేషంట్లుగా ఉండాలి. మిగతావారు అవుట్-పేషంట్లుగా వైద్యం అందుకుంటూ ఉండాలి.
కానీ ఇక్కడి ఆసుపత్రికి అంత మంది రోగులు రారు. రేపటినుంచి మూడు రోజులు మెడికల్ కాలేజీ తనిఖీ ఉంది. ఆ మూడ్రోజులూ రోగులు కావాలి. అందుకే చుట్టూ నాలుగు గ్రామాల్లో ఉన్న జనాలను ఆసుపత్రికి బస్సులో తరలిస్తున్నారు. ఇలాంటి తనిఖీ సందర్భంలో చాలావరకు వైద్యం ఉచితంగా అందుతుంది. ఇదే అదునని కొందరు పేరబెట్టుకున్న జబ్బులకు వైద్యం చేయించుకుంటారు. మిగతా అవసరమైన రోగుల సంఖ్యకోసం ఏ రోగమూ లేకపోయినా వచ్చి బెడ్లపై పడుకుంటారు. ఒకో రోగి ఎన్ని రోజులుగా ఆసుపత్రిలో ఉంటున్నారనేది డాక్టర్లే తనిఖీ అధికార్లకు చెబుతారు. ఒక వేళ తనిఖీ అధికార్లు అలాంటి ప్రశ్న రోగులను వేస్తే, డాక్టర్లు చెప్పిన మాటలే రోగి అప్పచెప్పాలి. ఏదైనా విభాగంలో రోగులు తక్కువైనపుడు ఈ విభాగం నుంచి వెళ్లి డాక్టర్లు చెప్పిన మరో విభాగంలో చేరాలి. ఈ పద్దతిని 'పేషంటు సైక్లింగ్' అంటారు వాళ్ళు. అలాగే ఆసుపత్రిలో రోగులు చేరుతున్నట్లు, ఆరోగ్యం కుదటపడి డిశ్చార్జి అవుతున్నట్లు కనిపించాలి. రోగులుగా చేరిన వాళ్లకు రోజుకు ఐదువందల రూపాయల కూలి ఇస్తారు. మూడు పూట్ల భోజనం, పాలు, బ్రెడ్, పండ్లు ఇస్తారు. అత్యవసర వార్డులో చేరిన రోగులకు అదనంగా వంద రూపాయలు ఇస్తారు.'
బస్సు దిగంగానే ఒక్కొక్కరి పేరు, వయసు, లింగం, రోగం రాసుకుని ఎవరు ఏ వార్డుకు వెళ్ళాలో అక్కడున్న డాక్టర్లు నిర్ణయిం చారు. ఏ రోగం లేదన్న వారికి వయసు, లింగం, శరీర పరిస్థితి ఆధారంగా రోగం నిర్ణయించారు. మిడాలు, మోకాళ్ళు, నడు ములు నొప్పులనే ముసలివాళ్ళను ఎముకల వార్డులో చేర్చు కున్నారు. వాళ్ళలో పదిమందికి సెలైన్ ఏర్పాటు చేశారు. ఇద్దరు యువకులకు, నలుగురు పిల్లలకు కాలో చెయ్యో విరగకపోయినా కట్లు కట్టారు. అంతకు ముందెన్నడో తీసిన ఎక్స్రేలు వీళ్ళ మంచాలకు వేలాడదీశారు. అదే వయసు పిల్లలకు సంబంధించిన ఎక్స్ రేలు వాడారు. రోగులకు ఎముకల విరగలేదు కాబట్టి ఎక్స్ రేల ఆధారంగా కట్లు కట్టారు. కొందరికి ఐవి ఇంజక్షన్ వేయడానికి వీలుగా చేతికి కాథ్ ఏర్పాటు చేశారు. కాథ్ ఏర్పాటుకు ఒప్పుకున్న వాళ్లకు యాభై రూపాయలు అదనంగా ఇస్తారు. దోణప్ప పిల్లలను చిన్నపిల్లల వార్డులో రోగులుగా చేర్చుకున్నారు. పిల్లలకు చాకోలెట్లు, బిస్కట్లు కూడా ఇచ్చారు. అలా ఏ విభాగానికి కావలసిన రోగులను ఆయా విబాగాధిపతులు చేర్చుకున్నారు. దోణప్పను కార్డియాలజీ విభాగంలో చేర్చుకున్నారు. రెండురోజుల ముందు రాత్రి గుండె నొప్పి వచ్చినట్లుగా రికార్డు తయారయింది. అప్పటికే అతడి తండ్రి అదే విభాగంలో రోగిగా నమోదయి ఉన్నాడు. దోణప్ప తల్లి కాళ్ళు నొప్పులంటూ అప్పుడప్పుడు ఎదారి పడుతుంటుంది. ఆమె ఎముకల వార్డులో చేరింది. దోణప్ప భార్య ప్రసూతి విభాగంలో గర్భసంచి తీయించుకోవడానికి నమోదయి నట్లుగా పత్రాలు తయారు చేశారు.
రోజుకు రెండుపూటలా పెద్ద డాక్టర్లు వచ్చి ప్రతి బెడ్డుకు
కట్టిన ఫైళ్ళలో ఏవేవో రాసి పోతున్నారు. పెద్ద డాక్టర్ల వెనక కోడిపిల్లల్లాగా చదువుకొనే పిల్ల డాక్టర్లు వస్తున్నారు. పెద్ద డాక్టర్లు చెప్పిన వివరాలు పిల్ల డాక్టర్లు తమ నోటు పుస్తకాల్లో రాసుకుంటు న్నారు. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన తనిఖీ అధికార్లు వివిధ వార్డులకు వచ్చారు. భాష రాకపోవడంతో రోగులతో మాట్లాడే అవకాశం వాళ్లకు లేకపోయింది. మూడు రోజులు ఆసుపత్రిలో గడిపిన దోణప్ప కుటుంబానికి రూ.8 వేల 'రోగి కూలి' ముట్టింది. వాళ్ళిచ్చిన కూలి డబ్బుల కంటే, ఆ ఏసి గదుల్లో ఉండటం గొప్ప అనుభవం వాళ్లకు. దోణప్ప బయటకు వస్తూ 'ఎబ్బుటికైనా బిడ్డలను యిట్టా చోట వైదిగం చదివించాల.' అనుకున్నాడు.
ఙఙఙ
కథలో రాజుగారి ఏనుగు దారినబోయే దానయ్యకు పూల మాల వేయడం, అతడిని రాజుగా పట్టాభిషేకం చేయడం ఒక పేరా తేడాలో జరిగిపోతుంది. అలాగే దోణప్ప జీవితంలో కూడా స్వల్పకాలంలో మార్పొచ్చింది. మెడికల్ కాలేజీనుంచి ఇంటికి రాగానే ఆస్తి అమ్మడానికి తల్లిదండ్రులను ఒప్పించి ఐదెకరాలు భూమి ఐదు లక్షలకు అమ్మి బెంగుళూరుకు డబ్బు తెచ్చుకున్నాడు.
కూలీగా మొదలై తాఫీ మేస్త్రీగా ఎదిగిన క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం వాసన వంటబట్టింది. కుడిచేతికి మొలిచిన అదనపు చెయ్యి తాపీని పక్కన పడేశాడు. యాభై లక్షలకు ఎకరం బేరం చేసి, ఐదు లక్షలు అడ్వాన్సుగా ఇచ్చి అగ్రిమెంటు రాసుకున్నాడు. ఆరునెలల్లో ప్లాట్లు వేసి కోటి రూపాయలకు అమ్మాడు. బెంగళూరు కార్పొరేషన్ అనుమతి పొందడానికి, రోడ్లు వేయడానికి, కరెంటు స్తంభాలు నాటడానికి పెట్టిన ఖర్చులు, భూమి సొంతదారుడికి కట్టాల్సిన డబ్బులు పోగా ఇరవై లక్షలు మిగుల్చుకున్నాడు. ఈసారి ఇరవై లక్షల అడ్వాన్సుతో ఐదెకరాల భూమికి అగ్రిమెంటు రాయించుకున్నాడు. అలా అడ్వాన్సు ఇచ్చి భూములుపై అగ్రిమెంట్లు చేసుకోవడం, ప్లాట్లు వేసి అమ్మడంతో పదేళ్ళలో కోటీశ్వరుడయ్యాడు. నిర్మాణాలు చేసుకునే వారికి సిమెంటు, ఇసుక, రాయి, నీళ్ళు, కూలీలు, తాఫీ మేస్త్రీలను సమకూర్చడంతో మరో నాలుగు మెట్లెక్కాడు. తాఫీ మేస్త్రీలకు ట్రైనింగ్ ఇప్పించి భవన నిర్మాణంలో నాణ్యత పెంచాడు. గంజికి కష్టపడ్డ దోణప్ప బెంజిలో తిరగడం మొదలెట్టాడు. ఇరవై మంది ఆఫీసు ఉద్యోగులతో పాటు ఇండ్లు, ఇండ్ల ప్లాట్లు అమ్మే ఏజెంట్లు యాభై మందికి పని కల్పించాడు. అతడి భార్య కూడా రియల్ ఎస్టేట్ పనుల్లో చేదోడు వాదోడుగా నిలుస్తున్నది.
పాటూరులో తల్లిదండ్రుల జీవనానికి వదలిన ఎకరం నేలలో పెద్ద బంగళా కట్టాడు. తల్లిదండ్రులను బంగాళా అంటీరూముల్లో ఉంచాడు. తల్లిదండ్రులకు కావలిసిన సామగ్రి బెంగుళూరు నుంచి పంపిస్తున్నాడు. బెంగళూరు రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు సంబం ధించి ఏవైనా పెద్ద డీల్స్ చేయాల్చొస్తే ఈ బంగళాలోనే జరుపుతుంటాడు. ఈసారి వేసవిలో పిల్లలతో గడపడానికి బంగాళాకొచ్చాడు.
ఙఙఙ
దోణప్ప కొడుకు, కూతురు మెడికల్ కాలేజీ అడ్మిషన్ కోసం నాలుగోసారి ప్రవేశ పరీక్ష రాసినా ఎంబిబిఎస్ సీటు రాలేదు. ''పిల్లలకు మెడికల్ కాలేజీల్లో సీటు సంపాదించలేని రియల్ ఎస్టేట్ డబ్బెందుకు?'' అనుకున్నాడు. పదేళ్ళ క్రితం తను రోగిగా వెళ్ళిన మెడికల్ కాలేజీ సీనియర్ డాక్టర్లకు బంగాళాలో మందు పార్టీ ఇచ్చాడు. పదిహేను మంది డాక్టర్లు వచ్చారు.
ఆ డాక్టర్లతో మాట్లాడి విదేశాల్లో ఎంబిబిఎస్ చదివిన పిల్లల గురించి తెలుసుకున్నాడు. ''విదేశాల్లో చదివిన వారు ప్రాక్టీసు చేయాలన్నా, పిజి ప్రవేశ పరీక్ష రాయాలన్నా దేశ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష పాసవ్వాలి. అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా వారు పిజి ప్రవేశ పరీక్ష ద్వారా సీట్ సంపాదించడం గగనం. వారిలో చాలామంది పిజి సీట్ల కోసం ఏళ్ల తరబడి ప్రవేశ పరీక్షలు రాస్తూ, ప్రైవేటు ఆసుపత్రులలో డ్యూటీ డాక్టర్లుగా చేరి ముప్పై నలభై వేల నెలసరి జీతానికి పనిచేస్తుంటారు.'' వచ్చిన వాళ్ళలో ఓ డాక్టర్ చెప్పిన విషయం నిజమేననిపించి, బయట దేశాల్లో తమ పిల్లలను ఎంబిబిఎస్ చదివించకూడదని నిర్ణయిం చుకున్నాడు.
కాలేజీ ప్రిన్సిపాలుతో మాట్లాడాలనుకున్నాడు దోణప్ప. తను వెళ్ళినరోజు మెరిట్లో సీట్లు వచ్చిన విద్యార్థులు చేరే రోజు. తల్లిదండ్రు లతో కలిసి వచ్చారు పిల్లలు. కాలేజీ నిండా మనుషులు. ఎక్కడ చూసినా రోగులే, పదేళ్ళలో ఎంత మార్పు అనుకున్నాడు. దోణప్పకు కాఫీ, కూల్ డ్రింక్ లాంటి పానీయాల ఆఫర్ ఇచ్చారు. ప్రిన్సిపాల్ తనకిచ్చిన గౌరవానికి దోణప్ప మురిసిపోయాడు.
పిల్లలిద్దరినీ మేనేజ్మెంటు కోటాలో ఎంబిబిఎస్ కోర్సులో చేర్చాడు. రియల్ ఎస్టేట్ సంపాదన ముందు ఎంబిబిఎస్ సీటు యాభై లక్షలు పెద్ద ఖర్చుగా అనిపించలేదు.
ఆసుపత్రిలో రోగుల సంఖ్యలో పెద్ద మార్పేమీ లేదు. రోజువారి రోగులు యాభైకి మించడం లేదు. ప్రాక్టికల్ పరీక్షల కోసం రోగులను కూలికి తెస్తున్నారు. మధ్యలో ఒకరిద్దరు విద్యార్థులు 'రోగులు లేకుండా వైద్యవిద్య ఏమిటి?' అనుమానం వ్యక్తం చేశారు. అనుమానం వ్యక్తం చేసిన వారిని మరుసటిరోజు ప్రిన్సిపాల్ పిలిపించి, 'హాస్టల్లో అన్నం బాగాలేదని చెపుతున్నారట, ఏమిటి మీ పిచ్చి వేషాలు?'' అంటూ గద్దించాడు. ప్రిన్సిపాల్ అనుకుంటే 'పదేళ్ళయినా ప్రాక్టికల్సులో పాస్ కాలేరని' సీనియర్స్ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇంకెప్పుడు 'రోగులు లేరేమిటని' ఏ విద్యార్థీ ప్రశ్నించలేదు.
ఐదున్నరేళ్ళకు ఎంబిబిఎస్ కోర్సు పూర్తయింది. తరువాత మూడేళ్ళు దోణప్ప పిల్లలు వరసగా పిజి ప్రవేశ పరీక్ష రాశారు.
'తొలేటుకు తోలు తెగంది మలేటుకు మాను తెగేనా?' ప్రవేశ పరీక్షల్లో ఎంబిబిఎస్ సీట్లే రాలేదు, ఇక పిజి సీట్లు వస్తాయా? మేనేజిమెంటు కోటాలో కోటిన్నర లెక్కన సీట్లు కొనక తప్పలేదు. దోణప్ప కొడుకు ఆర్థోపెడిక్స్, కూతురు గైనకాలజీ డాక్టర్లయ్యారు.
ఙఙఙ
ఎంబిబిఎస్, పి జి కోర్సులకు ఇద్దరి పిల్లలకు కట్టిన రెండు కోట్ల డొనేషన్, చదివే సమయంలో ఇతరత్రా ఖర్చుల కోసం పెట్టిన కోటిన్నర కలిపి వడ్డీతో సహా తిరిగి రాబట్టే ఆలోచనలో పడ్డాడు దోణప్ప.
మెడికల్ కాలేజి డాక్టర్లకు మరోసారి పార్టీ ఇచ్చాడు. తన పిల్లలు చేసిన స్పెషలైజేషన్లతో పాటు ఏ ఇతర స్పెషలైజేషన్లు చేసినవాళ్ళు కలిసి ఆసుపత్రి పెట్టుకుంటే వ్యాపారం బాగుంటుం దో తెలుసుకున్నాడు. అలాంటి స్పెషలైజేషన్లు చేసిన వాళ్ళనే కోడలు, అల్లుడుగా ఎంచి, ఒకే ముహూర్తంలో పెళ్లి చేశాడు. కోడలు, అల్లుడు కూడా మేనేజ్మెంటు కోటాలో చదివిన బాపతే.
భవన నిర్మాణంలో దోణప్ప పొందిన నైపుణ్యాన్ని ఆసుపత్రి కట్టడంలో ఉపయోగించాడు. ఆరునెలల్లో ఆసుపత్రి కట్టడం పూర్తయింది. రోగుల పరీక్షలకు సంబంధించిన మెషీన్లు ఆసుపత్రి లో సమకూరాయి. 'దోణప్ప హాస్పిటల్స్' అనే బోర్డు చూసి మురిసి పోయాడు. ఆసుపత్రి కోసం వీళ్ళు నలుగురు కాక పదిమంది డ్యూటీ డాక్టర్లను నియమించుకున్నారు. వాళ్ళు పి జి సీట్ల కోసం ప్రయత్నిస్తూ ఉద్యోగాలు చేసేవాళ్ళు. కావలిసిన సంఖ్యలో నర్సులు, ఆయాలు, సాంఖేతిక సిబ్బందిని నియమించుకున్నారు. మేనేజ్మెంటు కోర్సు చదువుకున్న ఐదుమంది యువకులను హెల్త్ కన్సుల్తెంట్లుగా నియమించుకున్నారు. పత్రికల్లోనూ, టి వి చానెళ్ళలోనూ ఆసుపత్రి గురించిన అడ్వర్టైజ్మెంట్లు ఇబ్బడి ముబ్బడిగా ఇప్పించారు.
పేషంటు ఆసుపత్రిలోకి అడుగుపెట్టగానే హెల్త్ కన్సల్టంట్లలో ఒకరిద్దరు చుట్టుముడతారు. వైద్య పాకేజీల రేట్ల గురించి, ఏయే పాకేజీలో ఏయే టెస్టులు చేయబోయేది, ఏయే టెస్టులు చేయించు కుంటే, ఏయే టెస్టులు ఉచితమో వివరిస్తారు. ఇతర హాస్పిటళ్లతో పోలిస్తే ఇక్కడ ఉచితంగా చేసే టెస్టుల గురించి వివరిస్తారు. రోగులకు ఏసి రూము, నాన్ ఏసి రూములకు, కామన్ బెడ్స్ కలిగిన హాల్లకు ఉన్న తేడాలు వివరిస్తారు. ఆరునెలల్లో ఆసుపత్రి లో బెడ్లు దొరకడం గగనమైంది. అంత తొందరగా బెడ్లు దొరకని స్థాయికి ఆసుపత్రి ఎదుగుతుందని దోణప్పతో పాటు ఎవరూ ఊహించలేదు. ఆసుపత్రి భవనం కార్పొరేట్ స్థాయిలో ఉన్నట్లుగానే, బిల్లులు కూడా కార్పొరేట్ స్థాయిలో వేస్తున్నారు.
ఙఙఙ
కథలో ఒక పేరా తేడాతో పేదవాడు రాజు అయినట్లుగానే, రాజు పేదవాడయ్యే ప్రమాదమూ లేకపోలేదు. 'దోణప్ప హాస్పి టల్స్' మొదలెట్టిన ఏడాదిలోపే యాభై పైగా మరణాలు సంభవిం చాయి. ఈ ఆసుపత్రి వ్యాపారం గమనించి కన్ను కుట్టిన ఇతర హాస్పిటల్సుకు చెందిన సీనియర్ డాక్టర్లు హైకోర్టుకు ఉమ్మడి లేఖ రాసారు. కోర్టు ప్రభుత్వాన్ని సంజాయిషీ అడిగింది. ప్రభుత్వం ఎంక్వయిరీ కమిటీ వేసింది. ఎంక్వయిరీ కమిటీ వస్తుందనే ఒత్తిడిలో దోణప్పకు ఎదలో నొప్పి మొదలైంది. కుటుంబంలోని నలుగురు డాక్టర్లు కలసి దోణప్పకు గుండె జబ్బని తేల్చారు.
మరుసటిరోజు ఎంక్వయిరీ కమిటీ ఆసుపత్రికి వచ్చింది. రికార్డులు స్వాధీనం చేసుకుంది. ఆసుపత్రికి సీలు వేయించింది. అప్పటికే చికిత్స పొందుతున్న రోగులను ఇతర ఆసుపత్రులకు పంపారు. వేరే ఆసుపత్రిలో చేరిన దోణప్పకు 'గుండెజబ్బు కాదు గ్యాస్ సమస్య' అన్నారు. గ్యాస్ తగ్గించే టాబ్లెట్లు వేసుకోవడంతో ఆ సమస్య తీరింది. అసలు సమస్య మొదలయింది.
ఎంక్వయిరీలో రెండు రకాల వివరాలు బయటకొచ్చాయి. అందులో మొదటి రకం.. ఆసుపత్రి భవనాలు, రూములు, ఎ సి, టాయిలెట్లు, మెషినరీ లాంటివి కార్పొరేట్ స్థాయిలో ఉన్నాయి. మందులు ఉత్తమమైన కంపెనీల నుంచే తెప్పించి వాడుతున్నారు. రోగుల అవసరాల దృష్ట్యా కాక, మెషిన్ల లబ్ధి ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మెషిన్ల ద్వారా చేసిన రోగనిర్ధారణ మినహా డాక్టర్లు చేస్తున్న రోగ నిర్ధారణ లోప భూయిష్టంగా ఉంది. పని చేస్తున్న స్పెషలిస్ట్ డాక్టర్లలో రోగనిర్ధారణ జ్ఞానం బహు తక్కువగా ఉంది. చనిపోయిన రోగుల్లో తొంబై శాతం పైగా రోగ నిర్ధారణ లోపం వల్లనే మరణించారు. ఇక రెండవ రకం.. చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ఆసుపత్రి చెల్లించాలి. రోగ నిర్ధారణ లోపంతో చనిపోయిన వారి వయసును బట్టి ఇరవై లక్షల నుంచి, రెండు కోట్ల వరకు పరిహారం చెల్లించాలి. అందుకు అవసరమైన డబ్బు ఆసుపత్రి యాజమాన్యం భరించాలి. యాజమాన్యం సమకూర్చలేని పక్షంలో ఆసుపత్రి ఆస్తులు అమ్మి చెల్లించాలి. ఆసుపత్రి నడుపుతున్న దోణప్పపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి.
ఙఙఙ
డాక్టర్ల రోగనిర్ధారణ శక్తిలో లోపాల పరిశీలనకు ప్రభుత్వం మరో కమిటీని వేసింది. రోగనిర్ధారణ లోపాల కారణాలను వెతికే పనిలో భాగంగా నలుగురు డాక్టర్లు ఒకే కాలేజీలో, మేనేజ్మెంటు కోటాలో చదవడం గుర్తించారు. 'ఈ డాక్టర్లు మీ వద్ద చదివింది నిజమా? అని కాలేజీకి, మీ యూనివర్సిటీ డిగ్రీ పొందిన వారేనా?' అని యూనివర్సిటీకి ఉత్తరాలు రాశారు. చదివింది, యూనివర్సిటీ డిగ్రీలు ఇచ్చింది నిజమేనని జవాబులు వచ్చాయి. డాక్టర్లు మంచి మార్కులతో పాస్ అయినట్లుగా సర్టిఫికెట్లు కూడా చూపిస్తున్నాయి. అయితే డాక్టర్లతో మాట్లాడినపుడు వాళ్ళ మేధోసంపత్తి స్పెషలైజేషన్ స్థాయిలో లేదని, రోగనిర్ధారణ శక్తి లోపభూయిష్టంగా ఉందని విచారణ కమిటీ సభ్యులు సులభంగానే గ్రహించారు. కానీ ఈ పరిస్థితి ఎలా దాపురించిందో కనుక్కోవాలని, ఆ కమిటీ నలుగురు డాక్టర్లు చదివిన కాలేజీకి వెళ్ళింది.
ఈ కాలేజీ ఒక మేజర్ పంచాయతీలో ఏర్పాటయింది. అక్కడ జనాభా 30 వేలకు మించదు. కాలేజీలో రెండొందల ఎంబిబిఎస్ సీట్లు, యాభై పిజి సీట్లు ఉన్నాయి. ఎంసిఐ పర్యవేక్షణ రోజుల్లో మాత్రమే ఆ కాలేజీకి సంబంధించిన ఆసుపత్రిలో రోగులు, డాక్టర్లు, నర్సులు, ఆయాలు అవసరమైన సంఖ్యలో ఉండేవారని, మిగతా సమయాల్లో అందులో నాలుగోవంతు కూడా ఉండరని కమిటీ గ్రహించింది. జీతం చాలలేదనో, ఇతరత్రా కారణాల వల్లనో కాలేజీ వదలిన డాక్టర్లు ఈ వివరాలను ధృవీకరించారు. కాలేజీ చుట్టుపక్కల గ్రామాల్లో విచారణలో 'ఎంసిఐ తనిఖీ సమయంలో రోగులుగా ఆసుపత్రిలో చేరుతామని' వివరించారు. ఈ ఎంక్వయిరీ కమిటీ మెడికల్ కాలేజీకి గుర్తింపునిచ్చే ఎంసిఐకి సంబంధించినది కాదు, నలుగురు పాత విద్యార్థుల గురించే గనక కమిటీ వచ్చిన సందర్భంలో 'కూలి రోగులు' అనవసరమని నమ్మి వాళ్ళను సమకూర్చుకోలేదు. రోగులు లేకుండా మెడికల్ కాలేజీ నడపడంతో రోగనిర్ధారణ మేధస్సు లేని డాక్టర్లు తయారవు తున్నారని కమిటీ సభ్యులు నిర్ధారించారు. రోగులు లేని మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వరాదని ముగింపు వాఖ్యలు చేశారు.
కేసు ఎదుర్కొంటున్న నలుగురు డాక్టర్లు స్పెషలైజేషన్లు అయ్యాక కూడా ఎంబిబిఎస్ స్థాయిని మించి సబ్జెక్టు నాలెడ్జి లేదని కమిటీ నిర్ధారణ చేసింది. నలుగురికి పిజి డిగ్రీలు కాన్సిల్ చేయమని ఎంసిఐకి రెకమెండేషన్ చేసింది. తమ నలుగురిని పార్టీ చేయకుండా 'తమ గురించి కాలేజీలో ఎంక్వయిరీ కమిటీ విచారణ చేసిందని, అలా చేయడం చట్ట విరుద్ధమని' డాక్టర్లు నలుగురు కలిపి హైకోర్టులో కేసు వేశారు. 'కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు ఎంక్వయిరీ కమిటీ రిపోర్టుపై ఎలాంటి చర్యలు తీసుకో రాదని' హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
'డాక్టర్ల విద్యార్హతపై నిర్ణయం రాకముందే పరిహారం చెల్లించ మనడం, ఆసుపత్రి మూయడం చట్ట విరుద్ధమని' దోణప్ప హైకోర్టు లో కేసు వేశాడు. కేసు కొలిక్కి రాలేదు. 'మా ఆసుపత్రి ఎదుగుదల ను ఓర్చుకోలేని ఇతర ఆసుపత్రి వ్యాపారస్తులు కేసులు వేశారని ప్రచారం చేశారు.' హాస్పటల్ తిరిగి వ్యాపారం మొదలెట్టింది. దోణప్ప 'ఆరోగ్య వ్యాపారం' మూడు టెస్టులు, ఆరు ఆపరేషన్లుగా కొనసాగుతూనే ఉంది.
రోగులు లేని ఆసుపత్రి, మెడికల్ కాలేజీల కంటే, రోగులు ఉన్న ఆర్ఎంపి వైద్యుల వద్ద వైద్యం బాగా నేర్చుకోగలరని వైద్య విద్య గురించి తెలిసిన వారి నమ్మకం. పేషంట్లు లేని మెడికల్ కాలేజీల్లో వైద్యం నేర్చుకోవడమంటే 'దున్నకుండా చల్లితే కొయ్యకుండా పండే పంటలాంటిదని' కొందరన్నారు. 'పిల్లి లేని చీకటిగదిలో నల్ల పిల్లిని వెతకడం లాంటిదే' అన్నారు ఇంకొందరు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన డాక్టర్లు సొంతంగా ప్రాక్టీసు చేసే సాహసం చేయలేక గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో సీనియర్ రెసిడెంట్లుగా చేరడం, ప్రైవేట్ ఆసుపత్రులలో డ్యూటీ డాక్టర్లు, ఫెలోస్ అంటూ చేరడం రోగ నిర్దారణలో మెళుకువలను నేర్చుకోవడం కోసమేనన్న సత్యం చాలామంది గుర్తించారు.
కాసులు కాలేజీ మేనేజ్మెంటుకు విసిరితే సర్టిఫికెట్లతో డాక్టర్లు రావొచ్చు కానీ, రోగాలు కుదిర్చే డాక్టర్లు రారని దోణప్ప తెలుసుకోగలిగాడు. ఆరోగ్య శాఖ మంత్రులు, అధికార్లు ఇంకా తెలుసుకోవలిసి ఉంది.