2014 సంవత్సరానికి గాను బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డుల ప్రధానోత్సవం బెంగుళూరులోని కువెంపు కళాక్షేత్రంలో నవంబరు 14న జరిగింది. ఈ కార్యక్రమానికి సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు స్వాగతం పలికారు. ప్రముఖ కన్నడ రచయిత, శతాధిక వృద్ధుడు గంజాం వెంకట సుబ్బయ్య ముఖ్య అతిధిగా విచ్చేశారు. సాహిత్య అకాడమి వైస్ ప్రెసిడెంట్, ప్రముఖ కన్నడకవి, నాటక కర్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార చేతుల మీదుగా అవార్డుల ప్రధానం జరిగింది. ఈ అవార్డును తెలుగులో దాసరి వెంకటరమణ తాను రాసిన ఆనందం అనే కథల పుస్తకానికి అందుకున్నారు. తెలంగాణా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ Ê స్టాంపుల శాఖలో సబ్`రిజిస్ట్రార్గా పనిచేస్తున్న దాసరి వెంకటరమణ ఇప్పటి వరకు వివిధ వార, మాస పత్రికలలో దాదాపు 400 వరకు రచనలు చేశారు. గతంలో తన అమ్మమనసు పుస్తకానికి గాను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉత్తమ బాల సాహిత్య పురస్కారం (2006), చక్రపాణి`కొలసాని పురస్కారం (2008), శ్రీమతి నన్నపనేని మంగాదేవి ఉత్తమ బాలసాహిత్య పురస్కారం (2010) అందుకున్నారు. కథ, మాటలు, పాటలు అందించిన మహాకవి భారవి టీవీ సీరియల్ (1998) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నాలుగు నంది అవార్డులు కైవసం చేసుకుంది. కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం వహించిన అద్దంలో చందమామ సినిమా తెలుగు యూనివర్సిటీ లఘు చిత్రాల పోటీలో రెండవ ఉత్తమ చిత్రంగా అవార్డు పొంది, రూ.20,000/`ల నగదు బహుమతి గెలుచుకుంది. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు రావటం పట్ల దాసరి వెంకటరమణ హర్షం ప్రకటించారు. ఈ అవార్డు బాలసాహిత్యంలో మరింత కృషి చేయాలనే బాధ్యతను పెంచింది అని తెలిపారు.