గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం తన జీవిత దృక్పథాన్నే మార్చిందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక, సాహితీ స్రవంతి జిల్లా శాఖల ఆధ్వర్యంలో కడప పట్టణంలో నవంబర్ 23న సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో రాచపాళెం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆచార్య రాచపాళెం మాట్లాడుతూ అనంతపురంలోని సాహితీ వాతావరణం, ప్రజా ఉద్యమాలు తనకు అవార్డు లభించే స్థాయికి, తన ప్రస్థానానికి పునాది వేశాయన్నారు. ఆధునిక భారతదేశ చరిత్ర, ఉద్యమాల చరిత్ర, వాదాల చరిత్ర గురించి ఈ సందర్భంగా ఆయన విశ్లేషించారు. ప్రపంచంలోని ఏ సమాజానికైనా మార్స్కిజమే అంతిమ పరిష్కారమన్నారు. యూనిసెఫ్ పురస్కార గ్రహీత శశిశ్రీ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో విమర్శకుడిగా ఎదిగిన రాజపాళెం రచయితలందరికీ మార్గదర్శకం కావాలన్నారు. డాక్టర్ ఎంఎం వినోదిని మాట్లాడుతూ సమాజంలో రానున్న ప్రమాదాలను గుర్తించగలిగేది సాహితీ విమర్శకులేనన్నారు. జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రఘునాథరెడ్డి మాట్లాడుతూ రాచపాళెంకు ప్రకటించిన అవార్డు తనకు వచ్చినట్లుగా సంతోషిస్తున్నామన్నారు. అభినందన సభలో జేవీవీ నాయకులు ఎస్.ప్రభాకర్, సునీత, రాజశేఖర్ రాహుల్, సరస్వతి, సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ మస్తాన్వలీ, డాక్టర్ మనోహర్, డాక్టర్పుత్తా బాలిరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి నారయణ, రిటైర్డ్ డీఎస్పీ ఫణిరాజుతోపాటు జిల్లాలోని సాహితీవేత్తలు పాల్గొన్నారు.