ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అర్హులందరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎం.సోమిరెడ్డి అన్నారు. నవంబర్ 3న సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ, పాలమూరు సాహితి సంయుక్త ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గల లిటిల్ స్కాలర్స్ పాఠశాలలో ఓటరు చైతన్యంపై నిర్వహించిన కవిసమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొంభై శాతం ఓటింగ్ జరగడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందించిందన్నారు. అలాగే జిల్లాలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సభాధ్యక్షులు సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ అధ్యక్షులు, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.విజయకుమార్ మాట్లాడుతూ నవసమాజ నిర్మాణానికి ఓటే వజ్రాయుధమని, దీనిని సక్రమంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. విశిష్ట అతిథి, ప్రముఖ కవి జలజం సత్యనారాయణ మాట్లాడుతూ ఓటర్లు మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. అనంతరం డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో కవిసమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నిఘా ఇంఛార్జి ఎం.నాగేంద్ర స్వామి,పి.వి.ఎల్.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.