సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జూన్ 2న కర్నూలు నగరంలోని పింగళిసూరన తెలుగుతోటలో సాహితీ స్రవంతి జిల్లా నాయకులు గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి ఎడారి పాట కవిత్వం ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సభకు సంఘం రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. పుస్తకాన్ని ప్రముఖకవి జి.వెంకటకృష్ణ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కవి తన పాత్రను వ్యక్తీకరిస్తూ తనకు తెలిసిన విషయాలను అక్షరీకరిస్తాడన్నారు. గౌరెడ్డి రాయలసీమ రైతుకుటుంబం నుంచి వచ్చిన కవిగా ఆర్ధ్రతతో కవిత్వం రాశాడని ఇందులో రైతు పడే కష్టాలని, బాధల్ని వర్ణించాడన్నారు. భారతదేశంలోని రైతు సమస్యలు, స్త్రీ బాధలు వివరించడం, రాజకీయ వ్యస్థలోని లోపాలు చెప్పడం ఈ కవిత్వంలో గొప్ప విషయమన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్షులు చంద్రశేఖర కల్కూర, కర్నూలు రేడియో స్టేషన్ సంచాలకులు రొక్కం కామేశ్వరరావు రచయిత ఇనాయతుల్లా , తెలుగు భాషా వికాస ఉద్యమం రాష్ట్ర కార్యదర్శి జెయస్సార్కె శర్మ, సిల్వర్ జూబిలీ కళాశాల తెలుగు శాఖాధిపతి ఆచార్య దండెబోయిన పార్వతి దేవి, డా.వి.పోతన్న, ముద్రిక కళాస్రవంతి అధ్యక్షులు భాస్కర్, పెన్షనర్స్ అసోషియేషన్ నాయకులు రంగారెడ్డి, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మెన్ పాండురంగారెడి, కవులు సయ్యద్ జహీర్ అహ్మద్, నల్లబోతుల నాగమణి, కళ్యాణ దుర్గం స్వర్ణలత, జి.ఉమామహేశ్వర్, మహేశ్వరయ్య, యస్.సుధాకర్, సుబ్బన్న, ప్రగతి విజ్ఞానకేంద్రం కన్వీనర్ జెయన్ శేషయ్య తదితరుల పాల్గొన్నారు. ప్రారంభానికి ముందు పింగళిసూరన విగ్రహానికి పూలమాల వేశారు. సభలో ప్రజానాట్యమండలి సీనియర్ నాయకులు యంపి బసవరాజు పాట పాడి వినిపించారు.