గురజాడ పుట్టి సాహితీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందాడని యోగి వేమన విశ్రాంత తెలుగు ఆచార్యులు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నవంబర్ 30 గురజాడ వర్ధంతి సందర్భంగా గురజాడ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని, కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో సాహితీ స్రవంతి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. 6వ తరగతి నుండి పీజీ, బి ఎడ్ స్థాయి వరకు గురజాడ అప్పారావు జీవితంలోని అన్ని కోణాలను స్పృశిస్తూ విద్యార్థులకు వ్యాస రచన పోటీలను నిర్వహించగా విజేతల ఫలితాలను ఈ సందర్భంగా విడుదల చేశారు. డివిజన్ గౌరవాధ్యక్షుడు డా. సంజన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గురజాడ 150 సంవత్సరాల క్రితం జన్మించి 90 సంవత్సరాల క్రితం మరణించినా ఈ రోజు మనం ఆయన గూర్చి మాట్లాడుతున్నామంటే ఆయన రచనల ప్రభావం సమాజంపై అంత తీవ్రంగా ఉండటమేనన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతీ నాయకులు కెంగారమోహన్, ఆవుల బసప్ప, సక్కిరి భాస్కర్లు, మెప్మా అధికారి రామాంజనేయులు, మిల్టన్ విద్యా సంస్థల అధినేత సగరి శ్రీనివాసరావు, షెల్లి పాఠశాల అధినేత ముక్తుంవలీ, శ్రీకృష్ణదేవరాయ పాఠశాల అధినేత హుసేనప్పలు పాల్గొని గురజాడపై సందేశాలిచ్చారు. అంతకు ముందు దేశమును ప్రేమించుమన్నా గీతాలాపన విద్యార్థులు చేయగా చిత్రపటానికి రాచపాళెం పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వ్యాస రచన పోటీలలో పాల్గొన్న విజేతలకు దృవీకరణ పత్రాలు, బహుమతులు అందించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పెద్దకడబూరు మండల కేంద్రంలో సాహితీస్రవంతి జిల్లా కార్యదర్శి కెంగార మోహన్ శ్రీకృష్ణ దేవరాయల పాత్రలో , అల్లూరి సీతారామరాజు పాత్రలో డివిజన్ కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ, గురజాడ అప్పారావు పాత్రలో మటం మల్లికార్జునయ్యలు వేషాలతో మండల పుర వీధుల గుండా నిర్వహించిన ప్రదర్శనలో ఆకట్టుకున్నారు. ఈ వేడుకల సందర్భంగా అధికారులు సాహితీ స్రవంతి నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు.