సినీరంగంలో విశిష్ట గాయకుడిగా పేరొందిన పి. బి. శ్రీనివాస్ ఏప్రిల్ 14న తుది శ్వాస విడిచారు. పి.బి. శ్రీనివాస్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన అనేక భాషల్లో పాటలు పాడారు. సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం గడించారు. పి.బి. శ్రీనివాస్ సెప్టెంబర్ 22, 1930న తూర్పుగోదావరి జిల్లా, కాకినాడలో జన్మించారు. కాకినాడలో డిగ్రీ వరకు చదువుకున్న పి.బి. శ్రీనివాస్కు చిన్నప్పటి నుండి సినీ రంగం పట్ల మక్కువ ఉండేది. అన్ని భాషల సినిమాలు చూడడం, పాటలు విని స్వరాలు రాసుకుని సాధన చేయడం అలవాటు చేసుకున్నారు. అనేక భాషల్లో పాటలు పాడటమే కాకుండా ఉర్దూలో గజల్స్, ఇంగ్లీషులో కవితలు కూడా రాసి మెప్పించారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై కాలిడిన సందర్భంలో ఇంగ్లీషులో 'మేన్ హాజ్ సెట్ హిజ్ పూట్ ఆన్ ది మూన్' అనే పాట రాసి కంపోజ్ చేశారు. రవీంద్రనాథ్ శతజయంతి సందర్భంగా శాంతినికేతన్ వారు రవీంద్రనాథ్ టాగూర్పై పి.బి. శ్రీనివాస్చే కొన్ని పాటలు రికార్డు చేయించుకున్నారు. కొన్నాళ్ళు జర్నలిస్టుగా కూడా పనిచేశారు. 'ఓహో గులాబీ బాలా..', 'నీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడదా' వంటి ఆయన పాడిన మధుర గేయాలు తెలుగునాట సుపరిచితమే. సినీ చరిత్రలో పి.బి. శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్నారు.