'శాస్త్రదాస్యం' పుస్తకావిష్కరణ

 

ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా హేతువాద సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఏప్రిల్‌ 28న కళ్యాణి కాన్ఫరెన్స్‌ హాలులో కొప్పరపు సుబ్బారావు రచించిన 'శాస్త్రదాస్యం' పుస్తకం పునర్ముద్రణ ఆవిష్కరణ జరిగింది. పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖ రచయిత విశ్రాంత అధ్యాపకురాలు డా|| విజయబక్ష్‌ మాట్లాడుతూ రచయిత ఆనాటి సామాజిక సమస్యను తీసికొని అత్యంత సున్నితంగా ఆలోచింప చేసే ధోరణిలో ధైర్యంగ ఈ పుస్తకాన్ని రచించారని, స్వార్థ ప్రయోజనాల నిమిత్తం శాస్త్రాన్ని తమకనుకూలంగ అన్వయించుకోరాదని, ఏదైనా మార్పు కావాలని అనుకొన్నప్పటికి కొంత సంఘర్షణ తప్పదని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన భారత హేతువాద సంఘ సహాయ కార్యదర్శి నార్నె వెంకట సుబ్బయ్య ఏ విషయాన్నైనా మూర్ఖత్వంతో ఆమోదించి, ఆచరించరాదని, హేతు దృక్పథం అలవరచుకోవాలని అన్నారు. అధ్యాపకుడు డా. బీరం సుందరరావు గ్రంథ సమీక్ష చేస్తూ సమాజంలో అభ్యుదయాన్ని ఆశించేవారు శాస్త్రదాస్యం లాంటి పుస్తకాన్ని చదవాలని, సమాజాన్ని చైతన్యవంతం చేయటంలో యిలాటి పుస్తకాల పాత్ర ఎంతో ఉందని అన్నాడు. ఇంకా ఈ కార్యక్రమంలో హేతువాదులు, పట్టణ ప్రముఖులు చుంచుశేషయ్య, ఎ. కొండలరాయుడు, టి. అరుణ, రాజ్యలక్ష్మి, సిద్ధార్థ  బక్ష్‌, కుర్రా హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.