మే12న జూబ్లీహిల్స్ క్లబ్హాల్లో జరిగిన అమృతలత & అపురూప అవార్డ్స్-2013 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మ విభూషణ్ డా|| అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ జన్మనిచ్చినందుకు, జన్మను సుఖవంతం చేసినందుకు స్త్రీకి కృతజ్ఞతగా వుండాలంటాడో కవి. సృష్టిలో స్త్రీ, పురుషులు సమానమేనని, పురుషులు లేకుండా స్త్రీలు లేరని, స్త్రీలు లేకుండా పురుషులు లేరని, అమృత లత మున్ముందు సమర్థులైన పురుషులను కూడా సత్కరించాలని, యువత చెడు మార్గం పట్టకుండా మనం బాధ్యత వహించాలి, పాత్రల ద్వారా ప్రజలకు నీతి బోధించాలి. మంచిని ఆదరించడం, చెడును విస్మరించడం వ్యక్తుల కర్తవ్యం కావాలని చెప్పారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన తొలి సినీ నేపధ్య గాయని రావు బాల సరస్వతీదేవి మాట్లాడుతూ వివిధ కళా రంగాల్లోని మహిళలను సముచితరీతిన సత్కరించడం సంతోషించదగ్గ విషయమని, ఈ కార్యక్రమానికి పూనుకొన్న అమృతలత వ్యక్తిత్వం గొప్పదన్నారు. అమృతలత అవార్డ్సు-2013 ప్రధానోత్సవం సందర్భంగా - ఒక్కొక్కరికి రూ|| 25,116/- నగదు పురస్కారాన్ని అందజేశారు. కూచిపూడి నృత్యకారిణి పద్మశ్రీ డా|| శోభానాయుడుకి, నవలా రచయిత్రుల డా|| సి. ఆనందారామంకి, పోల్కంపల్లి శాంతాదేవికి అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. అపురూప అవార్డ్స్-2013 ప్రధానోత్సవం పురస్కరించుకుని - ప్రముఖ చిత్రకారిణి యస్. వాణీదేవి, గాయని నిత్యసంతోషిణి, దూరదర్శన్ అనౌన్సర్ విజయదుర్గ భూమిక ఎడిటర్ కొండవీటి సత్యవతి, ఆంధ్రభూమి అసిస్టెంట్ ఎడిటర్ ఏ.ఎస్. లక్ష్మి, ప్రముఖ స్త్రీవాద కవయిత్రి కొండేపూడి నిర్మల, కథారచయిత్రి జాజుల గౌరి ఒక్కొక్కరు రూ|| 10,116/- నగదు పురస్కారం అందుకున్నారు. విజయ్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ట్సిట్యూషన్స్ అధినేత్రి, రచయిత్రి అమృతలత మాట్లాడుతూ లలిత కళలనూ ముఖ్యంగా సాహిత్యాన్ని ప్రోత్సహించే దిశలో ఈ అవార్డ్స్ని నెలకొల్పడం జరిగిందనీ, అవార్డ్స్ కోసం ఎవరూ ఎలాంటి అప్లికేషన్స్ పెట్టుకునే అవసరం లేకుండా - అర్హులైన వారి వద్దకే అవార్డులు చేరేలా న్యాయనిర్ణేతలను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త యన్ కిషన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్చేసారు. ఈ అవార్డు ఉత్సవంలో ప్రముఖ రచయిత్రులు, ముదిగంటి సుజాతరెడ్డి, అరుణావ్యాస్, డి. కామేశ్వరి, శైలాజామిత్రతో బాటు అయినంపూడి శ్రీ లక్ష్మి, కిరణ్ బాల, రామస్వామి, ఎనిశెట్టి శంకర్, ఎన్. శ్రీనివాస్, కళాభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత్రి, నెల్లుట్ల రమాదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. లంచ్ అనంతరం ఆహ్వానితులకు వినోదభరిత ఆటల పోటీలను నిర్వహించారు. ఆటల మధ్య చిన్నారులు తమ డ్యాన్సులతో ఆహూతులను అలరించారు. ఆద్యంతం ఆహ్లాదంగా, ఉత్సాహంగా సాగిన కార్యక్రమం తుర్లపాటి లక్ష్మి వందన సమర్పణంతో ముగిసింది.