జూన్ 15న ప్రపంచీకరణకు వ్యతిరేకంగా కవులు కలాలు కదిలించేందుకు మహా కవి శ్రీశ్రీని ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ సాహితీవేత్త, ఆంధ్ర సారస్వత ప్రాచ్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ మోతుకూరి నరహరి అన్నారు. సాహితీ స్రవంతి నగర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శ్రీశ్రీ 30వ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మోతుకూరి నరహరి మాట్లాడుతూ మహాకవి శ్రీశ్రీ అట్టడుగు వర్గాల గురించి తన కవిత్వంలో వివరించారన్నారు. ఆ మహాకవి పోయిన తర్వాత 30 ఏళ్ల నాటికి మనం పురోగమిస్తున్నామా లేక తిరోగమిస్తున్నామా అనే అంశాన్ని నేడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడున్న సమాజం ఎటు పోతుందో ఆలోచించాలని, నేటి కవులు భావకవిత్వం, ప్రేమ కవిత్వం లాంటివి రాస్తున్నారని వారు శ్రామికులపక్షం వహించే కవిత్వం రాసేందుకు ప్రయత్నించాలని సూచించారు. అధ్యక్షత వహించిన కవి తంగిరాల చక్రవర్తి మాట్లాడుతూ శ్రామికవర్గాల అభ్యున్నతి కోసం శ్రీశ్రీ సాహిత్యాన్ని రాశారని శ్రామికవర్గాన్నే తన కథానాయకులుగా చేసుకుని ఆయన రచనా వ్యాసంగం కొనసాగించారన్నారు. శ్రీశ్రీ వచన కవిత్వంతో పాటు పద్యకవిత్వం కూడా కృష్ణశాస్త్రికి ధీటుగా రాశారన్నారు. అనంతరం సాహితీస్రవంతి నగరకమిటీ సభ్యురాలు శాంతిశ్రీ అధ్వర్యంలో నిర్వహించిన జనకవనంలో కొండపల్లి నీహారిణి, తంగిరాల చక్రవర్తి, శిష్ట్లామాధవి, నరేశ్, రత్నామహీధర్; వొరప్రసాద్, రఘుశ్రీ, ఎం. రాధాకృష్ణ, అల్వాల్ సురేశ్ ఒబ్బిని, ఎ. మోహన్కృష్ణ, గేరా, కె.ఎల్. కామేశ్వరరావు, పొత్తూరి సుబ్బారావు, జి. నరసింహమూర్తి, మౌనశ్రీమల్లిక్, కందేపి రాజ్యలక్ష్మీ, రజనీగంగాధర్ తదితరులు శ్రీశ్రీపై కవితలు చదివారు. నగర కమిటీ సభ్యుడు టి. వెంకటి, జి. యాదగిరిరావు కె. లక్ష్మయ్య, కొంపల్లి కామేశ్వరరావు, ఆచార్య నరేంద్రతదితరులు పాల్గొన్నారు.