సాహితీస్రవంతి అనంతపురం నగర కమిటీ ఆధ్వర్యంలో జూలై 24న అనంతపురంలో జాషువా వర్థంతి కార్యక్రమం జరిగింది. నగరంలోని టవర్క్లాక్ వద్దగల జాషువా విగ్రహానికి కవులు, రచయితలు పూలమాల వేసి నివాళి అర్పించారు. జాషువా ఆశయాలు సాధిస్తామని నినాదాలతో ప్రతిజ్ఞ చేశారు. సాహిత్యం సామాజిక ప్రయోజనం ఆశించాలని, ఈ మార్గంలోనే జాషువా తన సాహితీ ప్రపంచాన్ని ఆవిష్కరించాడని, ఆనేక ప్రతికూలతలను ఎదుర్కొని కవిత్వమనే ఆయుధంతో విజయం సాధించాడని సాహితీస్రవంతి నగర కమిటీ ప్రధాన కార్యదర్శి సురేష్ అన్నారు. జాషువా తన సాహితీజీవితంలో 36 గ్రంథాలు రాశారని, ఎన్నో కవితా ఖండికలు రాశారని అన్నారు. 1932 వ సంవత్సరంలో ఫిరదౌసి, 1941లో గబ్బిలం రాశారని, గబ్బిలం కావ్యం ఎంతో ప్రసిద్ధి చెందిందని అన్నారు. 1958 వ సంవత్సరంలో రాసిన క్రీస్తు చరిత్ర కావ్యానికి గాను 1964వ సంవత్సరంలో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు జాషువా అందుకున్నారని అన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో జాషువా నవయుగ కవిచక్రవర్తిగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీస్రవంతి రాష్ట్ర కమిటీ సభ్యులు పి. కుమారస్వామి, అంకె రామలింగయ్య, కిరణ్,ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.