తొలితరం నవీన కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

సెప్టెంబరు 1న కాకినాడ, గాంధీ భవన్‌లో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో సాహితీ సభ జరిగింది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 'అనుభవాలు - జ్ఞాపకాలు', వడ్లగింజలు, గులాబీ అత్తరు మొదలైన కథల నేపథ్యంలో ఆయన జీవితానుభవాల్ని గురించి డా|| సీతారామస్వామి వివరించారు. సభకు అధ్యక్షత వహించిన డా|| అద్దేపల్లి రామమోహనరావు మాట్లాడుతూ, ఆధునిక సమాజ నిర్మాణానికి అవసరమైన ప్రగతిశీల భావాల్ని అందించిన తొలి తరం కథకుల్లో శ్రీపాద ప్రత్యేకంగా చెప్పుకోవలసినవారన్నారు. 'పుల్లంరాజు' కథలో, బలవంతాన తెచ్చే సంస్కరణలు ఎంత ప్రజా విధ్వంసకరమో ఆనాడే చెప్పారనీ ఈనాటి సెజ్‌లు, కారిడార్లు, బలవంతంగా తేవడంవల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారో వివరించి, 'పుల్లంరాజు' కథని అర్ధం చేసుకుంటే, ఈనాటి ప్రజావ్యతిరేక సంస్కరణల్లోని అవివేకం అవగాహన ఔతుందని చెప్పారు. సభా ప్రారంభంలో, శ్రీకృష్ణ దేవరాయ వెంకట్రావు వేణుగానం సభ్యుల్ని ముగ్థులుగా చేసింది. ఆయనకి చక్రవర్తి తబలా సహకారం చేశారు. అనంతరం 'గోదావరి' శీర్షికపై 20 మంది కవులు చదివిన కవితలు ప్రజల్ని అలరించాయి. నెలనెలా గోష్ఠులకు కూడా 80 మంది పైగా రావడం అందర్నీ అనందపరచింది. గ.నా.రా స్వాగతం పలికారు. ఇబ్రహీం వందన సమర్పణ చేశారు.