మహాకవి గురజాడ వారసుడు... తెలుగు కథకు తూర్పు దిక్కుగా వెలుగొందిన చాగంటి సోమయాజులు(చాసో) శతజయంతి ఉత్సవాలు జనవరి 17, 18 తేదీలలో విజయనగరంలో ఘనంగా జరిగాయి. రెండురోజుల పాటు అర్ధ శతకం కథలు రాసి, శతాబ్దాల కీర్తి సాధించిన శత వత్సర చాసో అంతరంగాన్ని ఆవిష్కరించేలా సాహితీవేత్తల విశ్లేషణలు సాగాయి. చాసో 46 కథల్లోని ప్రతి అక్షరాన్ని కూడా సాహితీవేత్తలు, సాహిత్య ప్రియులు, కళాకారులు అనుభవిస్తూ ఆస్వాదించారు. ఈ ఉత్సవాలు స్వయంగా చాసోను దర్శించుకున్న భావోద్వేగం, అనుభూతి కలిగించాయి. నేరుగా చాసో దగ్గర కూర్చొని కథలు విన్నంతగా అందరూ రసాస్వాదన పొందారు.
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి చెందిన సాహితీవేత్తలు, కవులు, రచయితలు, సాహిత్య విశ్లేషకుల రాకతో సాంస్కృతిక నగరి విజయనగరంలో సాహితీ పరిమళాలు గుబాళించాయి. శత వసంతాల చాసోకు ఘననివాళి అర్పించారు. ఒక్కమాటలో చెప్పాలంటే దీంట్లో పాల్గొన్న కవులు, సాహితీవేత్తలు సమర్పించిన పత్రాలు, వివిధ అంశాలపై ఉపన్యాసాలతో చాసోను గుర్తుచేసుకున్నారు. చాసో కథల్లోని జీవన చిత్రణలు నిత్య నూతనం అంటూ కొనియాడారు.
సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సంచాలకులు ఎన్.గోపి అధ్యక్షతన ప్రారంభోత్సవ కార్యక్రమం జనవరి 17న ఉదయం స్థానిక మయూర హోటల్లో జరిగింది. సాహితీప్రముఖులకు సాహిత్య అకాడమీ ఇన్ఛార్జ్ మహాలింగేశ్వర్ స్వాగతం పలికారు. సాహితీవేత్త, చాసో కుమార్తె చాగంటి తులసి నాందీ ప్రస్తావన చేసారు. తొలుత మహాలింగేశ్వర్ మాట్లాడుతూ 1961 నుంచి అకాడమీ చేస్తున్న సాహిత్య కృషిని వివరించారు. అకాడమీ సంచాలకులు చాసో కథల ఇంగ్లీషు పుస్తకం అనువాదాన్ని కాళీపట్నం రామారావు, చాసో మోనోగ్రాఫ్ను కేతు విశ్వనాథరెడ్డి ఆవిష్కరించారు. చాసో రచనల అనువాదాన్ని కెకె మహాపాత్ర, కె. చంద్రహాసన్ చేశారు. ఈ రెండు గ్రంథాలను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది. మహాపాత్ర మాట్లాడుతూ అతి తక్కువ రచనలు చేసి గొప్ప పేరు తెచ్చుకున్న రచయితగా చాసోకు గుర్తింపు లభించిందన్నారు. తన మిత్రుడు చంద్రహాస్తో కలిసి అనువాదం చేసిన అనుభవాలను వివరించారు.
సదస్సుకు అధ్యక్షత వహించిన ఎన్. గోపి మాట్లాడుతూ, చాసో కథ ప్రతి ఒక్కటీ ఓ ఆణిముత్యమేనని అన్నారు. మానవ సంవేదనల్లో సాంస్కృతిక అంశాల్లో కొన్ని తేడాలున్నప్పటికీ 'కథానిక'లో స్థానికత ఉండాలని గోపి అభిప్రాయపడ్డారు. చాసో కథల్లో వీటన్నిటితో పాటుగా ప్రగతిశీల దృక్పథం ఉంటుందని అన్నారు.
చాగంటి తులసి మాట్లాడుతూ చాసోకి తన పుట్టిన రోజు సంబరాలు చేసుకోవడం ఎప్పుడూ ఇష్టం లేదని అన్నారు. నేను ఆయన కూతురుగా కంటే ఆయన భావ సంపదకు వారసురాలిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు. కాళీపట్నం రామారావు మాస్టారు విజయనగరంతోనూ, చాసోతోనూ తనకున్న సాన్నిహిత్యం గురించి వివరించారు. చాసో గొప్ప అధ్యయనశీలి అని అన్నారు. చాసో కథలకు గొప్ప పేరొచ్చినా కేంద్ర సాహిత్య అకాడమీ గుర్తింపు లభించలేదని అన్నారు. ఇలాంటి సభలే ఆయనకు గొప్ప గుర్తింపు ఇస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రముఖ సాహితీ విమర్శకులు డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి చాసో విజయనగరానికి సాంస్కృతిక ప్రతినిధి అని అన్నారు. నేటి యువ కవులు, రచయితలూ ఆ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించటం హర్షదాయకమని అన్నారు. చాసో సమాజ మార్పును కోరే రచనలను ప్రోత్సహించి వామపక్ష భావాలకు బీజాలు వేశారన్నారు. కథానిర్మాణంలో భౌతిక, అంతరంగిక ఘర్షణ వెల్లడవుతుందన్నారు.
చాసో కథల్లో కవితా సౌందర్యం- కావ్యగౌరవంపై ప్రముఖ కవి కె. శివారెడ్డి మాట్లాడారు. చాసో కథలు కావ్యరూపాన్ని సంతరించుకున్నాయన్నారు. కథల్లోనే కవిత్వం ఉన్నందున సౌందర్యం ఉట్టిపడుతుందన్నారు. 'కుంకుడాకు', 'ఎందుకు పారేస్తాను నాన్నా' వంటి కథల్లో సజీవ దృశ్యాలు సాక్షాత్కరిస్తాయని అన్నారు. తనలో ఉన్న భావావేశాన్ని తాత్వికతను దృశ్యమానం చేసిన రచయిత చాసో అని అన్నారు. పరబ్రహ్మం, కుక్కుటేశ్వరం, ఎందుకు పారేస్తాను నాన్నా, రథయాత్ర తదితర కథల్లో కవిత్వం ఎలా పెనవేసుకుందో సోదాహరణంగా వివరించారు.
చాసో కథల్లో సంగీతం-చిత్రలేఖనంపై చాసో కుమార్తె కృష్ణకుమారి మాట్లాడారు. శాస్త్రీయ పితామహులు త్యాగరాజు కృతుల్లో చిన్న పదాల కూర్పు కీర్తనల్లో ఎలా ఉట్టిపడుతుందో చాసో కథల్లోనూ చిన్న పదాలే దర్శనమిస్తాయని ఆమె అన్నారు.
రెండో సెషన్కు నవ్య వీక్లీ సంపాదకులు ఎ.ఎన్. జగన్నాథశర్మ అధ్యక్షత వహించారు. చాసో రచనల్లో సామాజిక నేపథ్యాన్ని వకుళాభరణం వివరించారు. 1945-68 మొదటి దశ, 1968-79 రెండో దశగా చాసో రచనలను చూస్తే గ్రామాలు, పట్టణాల్లో దారిద్య్రం, సామాజిక అన్యాయాలపై ఆయన స్పందించని తీరు కళ్లకు కడుతుందని అన్నారు. న్యాయ వ్యవస్థపైనా, రాజ్యం (ప్రభుత్వం)పైన తన కథల్లో విమర్శలు గుప్పిస్తూ... నిశ్శబ్దంగా తిరగబడ్డారన్నారు.
చా.సో, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు రచనల సైద్ధాంతిక నేపథ్యం, సృజనాత్మకత, తారతమ్యం అన్న అంశంపై సుమన్పతి రెడ్డి మాట్లాడారు. సామాజిక మార్పునకు సాహిత్య స్పృహ, మార్కి ్సస్టు దృక్పథం అవసరమన్నది చాసో నమ్మకం అని అన్నారు. సాహిత్యంలో చాసో స్థానంపై ప్రముఖ కవి రామతీర్థ మాట్లాడుతూ చాసో రచనల్లో వేదనామయ వర్ణశకలాలున్నాయని అన్నారు. చాసో రచనలు స్థానికత-విశ్వజనీనత అంశంపై కె. మల్లీశ్వరి మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకూ స్థానికీయత ముద్ర రచనల్లో కనిపిస్తుందన్నారు. ఉత్తరాంధ్ర కవుల్లో గురజాడ స్థానిక వ్యక్తీకరణను బలంగా ఉపయోగించారు. దీనికి పునాదులు 'కన్యాశుల్కంలో' ఉన్నాయన్నారు.
చాసో కథల్లో సౌందర్య దృక్పథంపై కాకుమాని శ్రీనివాసరావు మాట్లాడుతూ సౌందర్యం అంటే అనుభవించడం... భౌతిక ప్రపంచంలోని అనుభవాన్ని కథల్లోకి తెచ్చిన కవి చాసో అంటూ వాయులీనం, మాతృధర్మం, దుమ్మలగొండి కథల్లో ఇది దర్శనమిస్తుందన్నారు.చాసో రచనల్లో శైశవ చిత్రణపై రామసూరి మాట్లాడుతూ అపురూపమైన బాల్య(శైశవ) దశ మాధుర్యంతో కూడుకున్నదని చాసో అనుభవం ద్వారా తెలుసుకున్నారన్నారు. ఆయన కథల్లో శైశవ చిత్రణ ఒక్కో కథలో ఒక్కో విధంగా ఉందన్నారు. చిన్నాజీ కథ చాసో సాహిత్యానికి అవతారిక వంటిదన్నారు. ఈ కథ పిల్లల ప్రపంచాన్ని ఆవిష్కరించిందన్నారు.
మధ్యాహ్నం జరిగిన సందస్సుకు చింతకింది శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. సాహితీ విశ్వరూపాన్ని చక్కటి పదచిత్రాలుగా ఆవిష్కరించిన చాసో రాబోయే తరాలకు కావాల్సిన, సార్వజనీన కథన శిల్పిగా నిలిచిపోతారన్నారు. చాసో రచనలు సంక్షిప్తత-చాసో విశిష్టత అన్న అంశంపై శశిశ్రీ మాట్లాడుతూ చాసో కథల్లోని ప్రతి అక్షరం ఎంతో గుర్తుంచుకోదగిందన్నారు. కాలదోషం పట్టని సాహిత్యం చాసోదన్నారు. 1910-2014 మధ్య సుమారు 2 లక్షల కథలు వెలువడ్డాయని, వాటిలో గొప్ప కథలు 100 మాత్రమే అంటూ అంతా స్మరించే కథకుల్లో చాసో ముఖ్యులు అన్నారు.
నిశిత పరిశీలకుడు చాసో అన్న అంశంపై బి. అరుణకుమారి మాట్లాడుతూ సంఘం చేత తిరస్కరింపబడిన బతుకులే చాసో కథా వస్తువులయ్యాయని అన్నారు. అనేక తరగతుల జీవన కథలను చాసో ఆవిష్కరించారన్నారు. సమాజంలో మనిషి చేసే అనేక పోరాటాలు, వ్యవహారాలే చాసో కథా వస్తువు అన్నారు. చాసో రచనలు హాస్యం-వ్యంగ్యంపై ఎ.ఎన్. జగన్నాథ శర్మ మాట్లాడుతూ కథ పరమాణువు అని అది పేలితే కొండలైన బద్ధలౌతాయని చాసో చెప్పేవారన్నారు. కథ చెబితే సంగీతం విన్నట్లుండాలని ఆయన అంటుండేవారన్నారు. వ్యంగ్యాన్ని అత్యంత అందంగా కథల్లో చెప్పినవాడు చాసో తప్ప ఇంకెవరూ లేరన్నారు. చాసో రచనలు మాండలిక భాష-శైలిపై అట్టాడ అప్పల్నాయుడు మాట్లాడుతూ వాస్తవికతను ధరించిన కళాత్మక కథలు చాసోవి అన్నారు. చాగంటి సోమయాజులు అన్న పేరునే చాసోగా క్లుప్తీకరణ చేయడం ఆకర్షణీయమన్నారు. ఆయన కథలూ అలాగే ఉంటాయన్నారు.
సాయంత్రం జరిగిన ముగింపు సభలో ఎన్.గోపి మాట్లాడుతూ రెండు రోజులపాటు తాను ఇక్కడ ఉండడం వల్ల చాసో కథలన్నిటినీ చదివినట్లు అనిపిస్తుందన్నారు. సెమినార్ ముగింపు సభలో సాహితీస్రవంతి విజయనగరం జిల్లా కన్వీనర్ చీకటి దివాకర్ మాట్లాడుతూ చాసో సమగ్రమైన ఆలోచనలతో రచనలు చేశారన్నారు. సదస్సు చివర్లో పెనుగొండ లక్ష్మీనారాయణ సింహావలోకనం చేశారు. ప్రముఖ సాహిత్యవేత్త యు.ఏ. నర్సింహమూర్తి, డాక్టర్ ఎ. గోపాలరావు, సంగీత విద్వాంసులు ద్వారం దుర్గాప్రసాదరావు, సిరికి స్వామినాయుడు, పట్టణ ప్రముఖులు, సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. సదస్సుల నిర్వహణలో సాహితీస్రవంతి జిల్లా కన్వీనర్ చీకటి దివాకర్, చీకటి చంద్రిక, చలం, ఎన్కె బాబు, శ్రీనివాస్, ఇతర సాహితీ సంస్థల ప్రతినిధులూ భాగస్వామ్యమయ్యారు. రెండురోజుల సదస్సులో సాహిత్యాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
- టి. మధుసూదనరావు