కవుల కర్మాగారం సాహితీస్రవంతి

   కాకినాడలో 15 నెలలుగా 'ప్రతినెలా - సాహిత్యహేల' పేరిట సాహితీస్రవంతి నిర్వహిస్తున్న సాహిత్య కార్యక్రమాల వార్షికోత్సవ సభ మే 18న స్థానిక రోటరీ క్లబ్‌హాల్‌లో ఉత్సాహంగా జరిగింది. ఐదు విభాగాలుగా జరిగిన ఈ కార్యక్రమం ప్రథమ సమావేశానికి ప్రముఖ కవి, విమర్శకులు డా|| అద్దేపల్లి రామమోహనరావు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ కవులు, రచయితలు, వ్యాసకర్తలు, వక్తలను తయారుచేసే 'సాహిత్య కర్మాగారం'గా ఈ కార్యక్రమాన్ని వర్ణించారు. అవధానుల మణిబాబు ప్రయోక్తగా వ్యవహరించారు.
    సాహితీస్రవంతి కాకినాడ కన్వీనర్‌ గనారా సాహితీస్రవంతి నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. మేడిశెట్టి శ్రీరాములు ప్రార్థనాగీతం ఆలపించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆకాశవాణి విశాఖపట్నం డైరెక్టర్‌ మాట్లాడుతూ ఈ సాహిత్య కర్మాగారం ప్రాణవాయువు లాంటి సాహిత్యాన్నందించి కొత్త ఊపిరులూదుతోందన్నారు. ప్రతి సంస్థ గదులను కట్టుకుని వారి వారి పరిధిలో ఉండిపోతున్న తరుణంలో భావప్రసార వినిమయానికి చక్కని వేదికగా నిలవడం అభినందనీయమన్నారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న డా|| పి. చిరంజీవినీ కుమారి మాట్లాడుతూ కార్యక్రమాల నిర్వహణతో పాటు వాటిని డాక్యుమెంట్‌ చేసినపుడు భవిష్యత్‌ తరాలకు ఆదర్శవంతంగా నిలుస్తుందన్నారు. రోటరీ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ డా|| పూషా మాట్లాడుతూ సాహిత్యం 'రోగ నిదాన సాధనం' అన్నారు. భాష, శబ్దం, అర్థం, వ్యారణం వంటి విషయాల్ని ప్రాథమిక అవగాహన పెంచుకోవాలని యువతకు సూచించారు.
    రెండవ సమావేశానికి ప్రముఖ రచయిత డా|| వుయ్యపు హనుమంతరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో సామర్లకోటకు చెందిన 'వద్దిపర్తి రామకృష్ణ శ్రీవత్స' దీర్ఘకవిత 'నడక కడలి వరకే' ను డా|| చిరంజీవినీ కుమారి ఆవిష్కరించారు. డా|| అద్దేపల్లికి అంకితమీయబడిన ఈ గ్రంథంపై విశ్రాంత తెలుగు అధ్యాపకులు జోస్యుల కృష్ణబాబు సమీక్షించారు. ఉత్తమస్థాయి కవిగానే కాక ఉన్నత వ్యక్తిత్వం గల వానిగా కవిని ప్రశంసించారు. కడలి గురించి ఊహ తెలిసనప్పటి నుండి నేటివరకూ కవికి గల భావనలన్నీ ఈ దీర్ఘకవితలో అభివ్యక్తమయ్యాయన్నారు. ఈ గ్రంథంలో అద్దేపల్లిని నేలపైగల జాబిల్లిగా అభివర్ణించారన్నారు. ఈ గ్రంథంలో 4వరుసల పంక్తులలో ప్రతి ముక్తకం ఒక కెరటంలా పాఠక హృదయాన్ని తడుపుతుందన్నారు. వీరు ప్రయోగించిన అలంకారాలు ప్రబంధస్థాయిలో ఉన్నాయన్నారు. సముద్రాన్ని త్యాగమయిగా, శ్రామికునిగా, మానవాళికి మార్గదర్శిగా వర్ణించారు.
    కవి రామకృష్ణ శ్రీవత్స తన స్పందనలో ఈ దీర్ఘకవితకు ప్రేరణనందజేసిన సాహితీస్రవంతికి కృతజ్ఞతలు తెలియజేసారు. తంత్రవహి శ్రీరామమూర్తి తూర్పుగోదావరి జిల్లా ప్రాశస్త్యాన్ని వివరించే గీతాన్ని ఆలపించారు. అధ్యకక్షులు వుయ్యపు హనుమంతరావు మాట్లాడుతూ ప్రపంచీకరణ దుష్ప్రభావాలు భారతదేశంలో అధికమయ్యాయని అన్నారు. ప్రధాన వక్తగా విచ్చేసిన వేంకటేశ్వరా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ డా|| మేడిపల్లి రవికుమార్‌ మాట్లాడుతూ ప్రపంచమంతటా ఇంజనీర్లు, డాక్టర్లు ఇతర మానవ వనరులను తయారుచేస్తున్నాం గానీ అచ్చమైన మనుషుల తయారీ జరగటం లేదని ఆ లోటును సాహితీస్రవంతి తీరుస్తుందన్నారు. ప్రపంచీకరణ అవగాహన చేసుకునేందుకు సాహిత్యమొక్కటే ప్రధాన సాధనమన్నారు. ప్రస్తుతం ఉన్న సామాజిక అవలక్షణాలన్నింటినీ ప్రపంచీకరణ పోషిస్తుందన్నారు. ఇల్లు అంటే అనుబంధాల నిలయంగా కాక వస్తు వ్యామోహసంస్కృతి పెచ్చుపెరిగి ఖరీదైన వస్తువుల ప్రదర్శనశాలగా మారిందన్నారు.
    అనంతరం జరిగిన సాహిత్య సదస్సుకు డా|| జి. సీతారామస్వామి అధ్యక్షత వహించారు. వీరబాబు గీతాలాపన చేశారు. తన అధ్యక్షోపన్యాసంలో వచన కవిత్వ ఆరంభం పాశ్చాత్య దేశాలలో జరిగిందని అన్నారు. తెలుగులో కుందుర్తి, శ్రీశ్రీ, సోమసుందర్‌ ఇత్యాదుల కవిత్వాన్ని ఉదహరించి మాట్లాడారు. సి.నా.రె. పేర్కొన్న వచన కవిత్వ లక్షణాలు ఈనాటి కవుల వరకూ అందులో మారుతున్న అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రాచీన ప్రబంధ సాహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. సమకాలీన అంశాలపట్ల అవగాహన, ఆవేదన, అభివ్యక్తి సాహిత్యకారులకే సాధ్యమవుతుందన్నారు.
    ప్రముఖ సాహిత్యవేత్త నియోగి కీలకోపన్యాసం చేశారు. మనిషిని కౌగిలించుకోండి మట్టి భాష మాట్లాడండి అంటూ సాహిత్యవేత్తలకు సూచించారు. ఆయన 'శ్రీశ్రీ కవితా ప్రస్థాన-విశ్లేషణలు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ పుస్తకాన్ని కె.వి. రమణారెడ్డి సమీక్షించారు. తరువాత జరిగిన సాహిత్యసదస్సును ప్రొఫెసర్‌ టి. విశ్వనాథరావు అధ్యక్షతన ప్రారంభించారు. ప్రముఖ సాహిత్యవేత్త డా|| ద్వానా శాస్త్రి 'కవిత్వ రచనా రీతులు' అంశంపై ప్రసంగించారు. అనంతరం ఆయన గడల శివప్రసాద్‌ నానీల సంపుటి 'చెరుకుగడల నానీలు' ఆవిష్కరించారు. కవి రామచంద్రారెడ్డి ఆ పుస్తకాన్ని సమీక్షించారు. ప్రొఫెసర్‌ విశ్వనాథరావు మాట్లాడుతూ అల్పాక్షరాలతో అనంతార్థాన్నిచ్చేదే కవిత్వం అన్నారు. ద్వానా శాస్త్రి మాట్లాడుతూ తెలుగులో 35కు పైగా ప్రక్రియలున్నా అన్నిటిలో ఉదాత్తమైనది కవిత్వం అన్నారు. ఏ పదం తీసినా మొత్తం భావం పడిపోతుంది అనేట్లుగా ప్రతీపదం ప్రయోజనకరంగా ఉండాలన్నారు. అనంతరం రెక్కలు ప్రక్రియపై డా|| అద్దేపల్లి ప్రసంగించారు. శిరీష  రెక్కల సంపుటి 'సిరిగమల - గలగలలు' ని మల్లేశ్వరరావు ఆవిష్కరించారు. కారుప్రోలు గౌరునాయుడు పుస్తక సమీక్ష చేశారు. అభివ్యక్తిలో నవ్యతను, పరిణతిని కొనియాడారు. అనంతరం ప్రసిద్ధ కవులు మాకినీడి సూర్యభాస్కర్‌, జి. సుబ్బారావు, కుమారి పసుమర్తి పద్మజవాణి, విఎస్‌ఆర్‌ఎస్‌ సామయాజులు కవిసమ్మేళనాన్ని నిర్వహించారు. సభ చివరిలో గత 15 నెలలుగా కవి సమ్మేళనాల్లో చదివిన కవితలతో ప్రచురించిన కవితా సంపుటి 'కడలి చిరునామా'ను ఆవిష్కరించారు. తంగిరాల చక్రవర్తి పుస్తక సమీక్ష చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- గనారా