సృజనాత్మక ప్రతీక శ్రీశ్రీ రచనలు

మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) రచనలు సృజనాత్మకతకు ప్రతీకగా, అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని పలువురు సాహితీవేత్తలు కొనియాడారు. మహాకవి శ్రీశ్రీ 30వ వర్ధంతి సందర్భంగా శ్రీశ్రీ సాహిత్య నిధి 50వ ప్రచురణ శ్రీశ్రీ క్విజ్‌ సంపుటి-1ని విజయవాడ, గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జూన్‌ 16న ఆవిష్కరించారు. ప్రజాసాహితీ సంపాదకులు కొత్తపల్లి రవిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 'చినుకు' మాసపత్రిక సంపాదకులు నండూరి రాజగోపాల్‌ ఈ సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యకక్షులు తెలకపల్లి రవి మాట్లాడుతూ శ్రీశ్రీ లేని తెలుగు భాషను మనం ఊహించలేమన్నారు. మార్క్సిస్టు భావజాలాన్ని కవిత్వంలో పొదగటం శ్రీశ్రీకి కుదిరినంతగా మరెవరికీ సాధ్యం కాలేదని మార్క్సిస్టు సిద్ధాంతకర్త మాకినేని బసవపున్నయ్య పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే సింగంపల్లి అశోక్‌కుమార్‌ ప్రచురించిన శ్రీశ్రీ క్విజ్‌ -1 గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుత కాలాన్ని అనుసరించి అబ్జెక్టివ్‌ విధానంలో పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని, ఈ ప్రయత్నం అభినందించదగినదని తెలిపారు. విరసం నాయకులు చలసాని ప్రసాద్‌ మాట్లాడుతూ ఈ క్విజ్‌ కధ శ్రీశ్రీ ఆత్మకధలా అనంతంగా సాగేదే కాని ఆగేది కాదన్నారు. జనసాహితీ నాయకులు దివికుమార్‌ మాట్లాడుతూ శ్రీశ్రీ గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సే ఉంటుందన్నారు. అంతులేని నిధిలా నిరంతరంగా పోగుపడుతోందన్నారు. అరసం నాయకులు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పద ప్రహేళికలకు తెలుగులో అధ్యుడు శ్రీశ్రీ అని, ఆయన తెలుగు భాషకు చేసిన సేవ కూడా గొప్పదని అన్నారు. ఈ పుస్తకాన్ని వామపక్ష సాహిత్య సంస్థలకు అంకితం ఇస్తుండడం సింగపల్లి చైతన్య సాహిత్య హృదయాన్ని సూచిస్తోందన్నారు. కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుస్తకాలను బహుమతులుగా పలువురితో పంచుకునే సంస్కృతిని అలవర్చుకోవాలని కోరారు.