మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా కవులూ, రచయితలూ గొంతెత్తాలి!

అరసం రాష్ట్ర మహాసభల పిలుపు

- కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ
ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర 19వ మహాసభలు, 80వ వార్షికోత్సవాలు ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఉత్తేజపూరితంగా జరిగాయి. మహాసభలకు ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల నుంచి 200 మంది ప్రతినిధులుగా హాజరయ్యారు. సరిగ్గా 80 ఏళ్ళ క్రితం ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం ప్రథమ మహాసభల ఆతిథ్యం ఇచ్చిన తెనాలి ఇప్పుడు మరోసారి మహాసభల వేదిక అయింది. అభ్యుదయ సాహిత్యోద్యమ నాయకులు ప్రముఖ రచయిత అమరజీవి బొల్లిముంత శివరామకష్ణ సాహిత్య ప్రాంగణం (శ్రీ తెనాలి రామకష్ణకవి కళాక్షేత్రం)లో 11వ తేదీ ఉదయం అరసం గౌరవ అధ్యక్షులు డా|| పి.సంజీవమ్మ అరసం పతాకను ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించారు. మహాసభల ఆవరణలో ప్రముఖ చిత్రకారులు ఎన్‌.వి. రామశాస్త్రి చిత్రించిన కవులు, రచయితల రేఖాచిత్రాల ప్రదర్శనను, పుస్తక ప్రదర్శనను ప్రొఫెసర్‌ గుజ్జర్లమూడి కపాచారి ప్రారంభించారు.
ప్రారంభ సభకు అరసం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షత వహించగా, ఆహ్వాన సంఘం అధ్యక్షులు ప్రముఖ రచయిత సాయిమాధవ్‌ బుర్రా స్వాగతోపన్యాసం చేశారు. అరసం ఉద్యమ చరిత్రలో తెనాలి ప్రాధాన్యతను, తెలుగు సాహిత్య రంగంలోని తెనాలికి చెందిన ప్రముఖ రచయితలను ప్రస్తావించారు. యువ రచయితలను ప్రోత్సహించాలని, వారికి శిక్షణా కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని అన్నారు.
అరసం ప్రయాణం అలవోకగా సాగలేదని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని అధ్యక్షోపన్యాసంలో రాచపాళెం గుర్తు చేశారు. సమాజం విముక్తిని సాధించేదాకా అవిశ్రాంత భావప్రచారం చేసే శక్తి సామర్థ్యాలు, రచయితల విమర్శకుల బలం గల సంస్థ అరసం అన్నారు. 'మన ముందు ఒక మహాస్వప్నం ఉంది. అది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వంతో కూడిన వ్యవస్థ నిర్మాణం. అందులో సామాజిక న్యాయం, సామ్యవాదం ఉంటాయి. ఈ సందర్భంలో మార్క్సీయులు, అంబేద్కరీయులు ఐక్యంగా ముందుకు సాగాలి.' అని అన్నారు.
రచయితలు ఉద్యమించాలి : రచయితలు రాయటమే కాదు; పోరాడాల్సిన సమయమిదని అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి సుఖదేవ్‌ సింగ్‌ సిర్సా అన్నారు. రచయితలను పాలకవర్గాలు కార్పొరేట్‌ శక్తులు ప్రలోభ పెడుతున్నాయన్నారు. లొంగని వారిపై దాడులు చేస్తున్నారన్నారు. దేశంలో ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు హిందుత్వ శక్తులు పనిచేస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో రచయితలు మరింత చైతన్యవంతమైన పాత్రను నిర్వహించాలని అన్నారు. ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమ ప్రభావంతో పంజాబ్‌లో నవతరంలో ఒక కొత్త ఒరవడి బయలుదేరింది. వారి గుండెల్లో ఉన్న ఆవేశం ఆవేదన గేయాలుగా ఇతర రచనా ప్రక్రియలుగా బయటకొచ్చాయని, ఇది దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాలని అన్నారు. 'హిందూ మతోన్మాద శక్తులు, కార్పొరేట్‌ శక్తులు కలిసి లౌకిక ప్రజాస్వామ్య సామాజిక భావనలను అణచివేస్తున్నాయి. ఈ దశలో సామాజిక ఆర్థిక విప్లవానికి రచయితల కలాలు, గళాలు పదునెక్కాల'ని అభ్యుదయ సాహితీవేత్త, దళిత ఉద్యమ నాయకులు డా|| కత్తి పద్మారావు అన్నారు. అందుకు మార్క్స్‌, అంబేద్కర్‌, ఫూలే భావాలే మార్గదర్శకాలు. ఇప్పుడు లాల్‌ - నీల్‌ శక్తులు సంఘటితం కావాలని అన్నారు.
అరసం జాతీయ నాయకులు, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ కులపతి ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ ... అరసం 80 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం గురించి వివరించారు. మతోన్మాద ఫాసిజానికి, కాషాయీ కరణలకు వ్యతిరేకంగా కలసివచ్చే ప్రగతిశీల సాహిత్య సంస్థలతో కలిసి పనిచేయాలని అన్నారు. డా.పి. సంజీవమ్మ, వినీత్‌ తివారి, వేల్పుల నారాయణ, తెలంగాణ రాష్ట్ర అరసం ప్రధాన కార్యదర్శి డా|| రాపోలు సుదర్శన్‌, ప్రజానాట్యమండలి జాతీయ కార్యదర్శి గని, సందేశాలు ఇచ్చారు. అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.
అభ్యుదయ రచయితలు సామాజికంగా వస్తున్న మార్పులను అవగాహన చేసుకుని ప్రజలను చైతన్యపరిచే విధంగా రచనలు చేయాలని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ మేడిపల్లి రవికుమార్‌ అన్నారు. తెలుగు సాహిత్యం - దశ దిశ అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి జి.ఎస్‌.చలం అధ్యక్షత వహించారు. సాహితీవేత్త ముత్తేవి రవీంద్రనాథ్‌్‌్‌, ద్రవిడ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కె.శ్రీదేవి ప్రసంగించారు. అరసం కార్యదర్శి కలం ప్రహ్లాద సమన్వయకర్తగా ఉన్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల్ని భ్రమల్లో ఉంచుతోందని యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగు విభాగ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎన్‌.ఈశ్వరరెడ్డి అన్నారు. తెలుగునాట తెలుగు భాష గమనం - గమ్యం అంశంపై జరిగిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేయడం సరికాదన్నారు. ఆంగ్లమాధ్యమంలో విద్యాభ్యాసంతోనే అన్నీ అయిపోతాయనే భ్రమను ప్రభుత్వం ప్రజలకు కల్పించడం సరికాదన్నారు. సదస్సులో ప్రజాసాహితి నాయకులు దివికుమార్‌, సాహితీ స్రవంతి ఉపాధ్యక్షులు సత్యాజీ, అరసం అధ్యక్ష వర్గ సభ్యులు సాకం నాగరాజ ప్రసంగించారు. తిరుపతి జిల్లా అరసం అధ్యక్షులు యువశ్రీ మురళి సమన్వయకర్తగా ఉన్నారు.
ఈ మహాసభల సందర్భంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతీ ప్రదానం జరిగింది. చెరుకుమల్లి సింగ సంపాదకులుగా వస్తున్న అమరావతి మిర్రర్‌ మాసపత్రిక అరసం రాష్ట్ర మహాసభల ప్రత్యేక సంచికను అరసం కార్యవర్గ సభ్యులు జి. ఓబులేసు ఆవిష్కరించారు. డా.పి. సంజీవమ్మ రచించిన జీవని సాహిత్య వ్యాససంపుటి, మందలపర్తి కిషోర్‌ వ్యాససంపుటి ఇరవైలో అరవై, కోసూరి రవికుమార్‌ కవితాసంపుటి దాపల బంగారు వివి ఆచార్య కవితా సంపుటి నాగేటి సాళ్ళలోను అరసం నేతలు ఆవిష్కరించారు. శిఖా ఆకాష్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఈ మహాసభల ప్రతినిధులు, అతిథులు, రచయితలు, కవులు, కళాకారులు 11వ తేదీ సాయంత్రం సభాప్రాంగణం నుంచి రణరంగ చౌక్‌ వద్దకు పాదయాత్రగా వెళ్ళి స్వాతంత్య్ర సమరంలో బ్రిటీష్‌ పాలకుల తూటాలకు బలైన మతవీరులకు వారి స్మారకస్థూపాల వద్ద నివాళులర్పించారు. రాత్రి 7గంటలకు మహాసభల వేదికపై డప్పు శ్రీను కళాకారుల బందం అభ్యుదయ గేయాలను ఆలపించింది. బద్రి కూర్మారావు తమ బందగానంతో, డప్పు వాద్యాలతో ప్రతినిధులను అలరించారు.
అప్రకటిత ఎమర్జెన్సీని ప్రతిఘటిద్దాం : నేటి పాలకులు ఏ రకమైన ప్రకటనలు లేకుండానే దేశంలో ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని అరసం జాతీయ కార్యదర్శి వినీత్‌ తివారి అన్నారు. మహాసభల రెండవ రోజు ఉదయం ప్రగతిశీల సాహిత్యం, సాంస్కతిక శక్తులపై దాడులు - కర్తవ్యాలు అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. సదస్సుకు అరసం రాష్ట్ర కార్యదర్శి కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ అధ్యక్షత వహించారు. బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను హరిస్తోందని, భావప్రకటనా స్వేచ్ఛపై దాడులకు తెగబడుతోందని తివారి అన్నారు. ఈ దాడులను ప్రతిఘటించేందుకు రచయితలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇంకా విరసం నాయకులు సి.ఎస్‌.ఆర్‌. ప్రసాద్‌, ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ సాహిత్య సాంస్కతిక రంగాలపై జరిగే దాడులను తిప్పికొట్టేందుకు కవులు కళాకారులు ఒక్కటిగా నిలవాలని అన్నారు.
పలు తీర్మానాలు : మతోన్మాద భావజాలాన్ని తిప్పికొట్టటానికి ప్రగతిశీల సాహిత్య సంస్థలన్నీ సంఘటితం కావాలని, ఐక్యవేదిక నిర్మించాలని ఈ మహాసభల్లో తీర్మానించారు. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో అనువాద అకాడమినీ ఏర్పాటు చేయాలని, ఉన్న అన్ని అకాడమీలకు తగిన నిధులను మంజూరు చేయాలని మహాసభ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రతి ఏడాదీ రచయితల కొత్త పుస్తకాలను అన్ని గ్రంథాలయాలకూ కొని సరఫరా చేయాలని; అన్ని పాఠశాలల్లో తెలుగు మాధ్యమం తప్పనిసరి చేయాలని కోరింది. మూఢనమ్మకాల నిర్మూలనా చట్టాన్ని తీసుకురావాలని; జానపద సాహిత్యాన్ని, తెలుగు భాషని, లిపి లేని గోండు, సవర, కోయ, గబద భాషలను పరిరక్షించాలని తీర్మానాలు చేసింది.
కథాస్రవంతి ఆవిష్కరణ : ఈతరం కోసం కథాస్రవంతిలో భాగంగా మహాసభల సందర్భంగా 8 కథాసంపుటాలను ప్రచురించారు. వాటి ఆవిష్కరణ ప్రధాన సంపాదకులు వల్లూరు శివప్రసాద్‌ అధ్యక్షతన జరిగింది. కె.పి. అశోక్‌ కుమార్‌, డా|| నక్కా విజయ రామరాజు, డా|| హరికిషన్‌ ప్రసంగించారు.
ప్రతినిధుల సభ, నూతన కార్యవర్గం : అరసం రాష్ట్ర అధ్యక్షులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన ప్రతినిధుల సభ జరిగింది. ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్‌ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. తరువాత నూతన కమిటీని పెనుగొండ లకీëనారాయణ ప్రతిపాదించగా ప్రతినిధుల సభ ఆమోదించింది. గౌరవాధ్యక్షులుగా డా|| పి.సంజీవమ్మ , అధ్యక్షులు డా|| రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, అధ్యక్షవర్గం డా|| కేతు విశ్వనాథరెడ్డి, ప్రొఫెసర్‌ ఎన్‌.ఈశ్వర రెడ్డి, సాయి మాధవ్‌ బుర్రా, ప్రొఫెసర్‌ కిన్నెర శ్రీదేవి, నల్లి ధర్మారావు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా వల్లూరు శివప్రసాద్‌, కార్యనిర్వాహక కార్యదర్శిగా జి.ఎస్‌.చలం ఎన్నికయ్యారు. కార్యదర్శి వర్గంగా కె.శరచ్చంద్ర జ్యోతిశ్రీ, బి.ఎన్‌.సాగర్‌, కలం ప్రహ్లాద, ఉప్పల అప్పలరాజు, గంటా మోహన్‌, యువశ్రీ మురళి, సామాజిక మాధ్యమాల కార్యదర్శిగా ఏ.ఎం.ఆర్‌. ఆనంద్‌ ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా డా|| తక్కోలు మాచిరెడ్డి, చెరుకుమల్లి సింగ, డా|| పెరుగు రామకష్ణ, డా|| ఏ.ఏ. నాగేంద్ర, డా|| తుమ్ములూరి సురేష్‌బాబు, గంగా సురేష్‌బాబు, డా|| నెమిలేటి కిట్టన్న, పల్లిపట్టు నాగరాజు, కొత్తపల్లి సత్యనారాయణ, చింతా కష్ణారావు, ఆర్‌.బాలకష్ణ, మల్లిపురం జగదీష్‌, మల్లుల సీతారాం ప్రసాద్‌, చలసాని వెంకట రామారావు, శిఖా ఆకాశ్‌, కొండపల్లి మాధవరావు, పరుచూరి అజరు, పడాల వీరభద్రరావు, కోసూరి రవికుమార్‌, గోలి సీతారామయ్య, కొప్పర్తి రాంబాబు, మోతుకూరి అరుణ్‌కుమార్‌, మంచికంటి వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌.వెంకట సుబ్బయ్య, ముర్తుజా, ఎస్‌.జి. ఓబులేసు, చిన్నం పెంచలయ్య, కూన అజరుబాబు, పెనుగొండ లకీëనారాయణ ఎన్నికయ్యారు.