ఉద్యమాల సాపేక్షతతో స్త్రీ వాద అవగాహనను సరిచేసుకుంటూ ఉండాలి

ప్రముఖ సాహితీ విశ్లేషకులు ఆచార్య కాత్యాయని విద్మహే
'ధనిక, పేద, కులమత, స్త్రీపురుష వ్యత్యాసాలతో సంక్లిష్టంగా ఉండే భారతీయ సమాజాన్ని అర్ధం చేసుకొనటానికి సోషలిస్టు స్త్రీవాదం కొంచం ఎక్కువ ప్రయోజనకారి అనుకొంటున్నా'నన్నారు ఆచార్య కాత్యాయని విద్మహే. కవి, రచయిత డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య 'సాహిత్య ప్రస్థానం' తరఫున ఆచార్య కాత్యాయని విద్మహే గారితో ముచ్చటించారు. ఆ ముఖాముఖి ఇదీ..
మీ బాల్యం విద్యాభ్యాసం గురించి క్లుప్తంగా చెప్పండి ?
నేను 1955 నవంబర్‌ 3న, మా అమ్మమ్మగారి వూరు మైలవరంలో పుట్టాను. మా అమ్మ ఇందిరాదేవి. నాన్న కేతవరపు రామకోటి శాస్త్రి. నాన్న ఉద్యోగరీత్యా గుడివాడలోనూ, ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన కోసం హైదరాబాద్‌ వెళ్లటంతో, మైలవరంలోనూ నా బాల్యం గడిచింది. పిహెచ్‌.డి పూర్తయి నాన్న ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల అధ్యాపకుడిగా వరంగల్‌ రావటంతో నా చదువు అక్కడ మొదలైంది. నాన్న బదిలీల వల్ల హైదరాబాద్‌లో కొంతకాలం చుదువుకొన్నాను. 9వ తరగతికి మళ్ళీ వరంగల్‌కే వచ్చాం. అప్పటినుండి చదువు, ఉద్యోగం, నివాసం అన్నీ వరంగల్లే. తెలుగు ఎంఏ చేసి 'చివరకు మిగిలేది' నవలపై పరిశోధన చేసాను. 1977 నుంచి కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగువిభాగంలో అధ్యాకురాలిగా పనిచేసి 2015లో పదవీ విరమణ చేసాను.
మీ పేరులోని 'విద్మహే' అనే పదం వినూత్నంగా ఉంది. కలంపేరా? అసలు పేరా?
అమ్మ నాన్నలు పెట్టిన పేరు కాత్యాయని. విద్మహే కలంపేరు. ఎంఏ పూర్తయ్యేనాటికి సాహిత్య వ్యాసాలు రాయటం మొదలు పెట్టాను. కలం పేరుగా అసలు పేరుకు విద్మహే అని చేరిస్తే అర్ధవంతంగా ఉంటుందని సూచించింది నాన్నే. విద్‌ అనే మూలం నుండి ఏర్పడిన విద్మహే అనే మాటకు తెలుసుకొనటం అని స్థూలార్థం. జ్ఞాన మూలం తెలుసుకోవాలన్న జిజ్ఞాస కనుక ఆ మార్గంలో సాహిత్య ప్రస్థానం సాగించాలన్న ఆకాంక్షకు వ్యక్తీకరణ విద్మహే అనే ఆ పేరు.
మీ సాహిత్యాభిలాష వారసత్వంగా వచ్చిందా? పెద్దయ్యాక తెలుగు చదవాలనే అనుకున్నారా?
సాహిత్యాభిలాష వారసత్వంగా వచ్చిందా అంటే అవునని ఖచ్చితంగా చెప్పలేను కానీ, సాహిత్యభిలాష ఏర్పడటానికి అనువైన వాతావరణంలో పెరిగానని చెప్పగలను. నాలుగైదు తరగతులు చదువుతుండగా మా బామ్మ సావిత్రమ్మ పర్వాల వారీగా వివరంగా చెప్పిన మహాభారత కథ వల్ల సంప్రదాయ సాహిత్యం పట్ల కుతూహలం కుదురుకొన్నది. ఇంట్లో మా అమ్మ చదివే వార, మాస పత్రికలు, నవలలు ఆరేడు తరగతులనుండే చదువు కొంటూ, ఆధునిక వచన సాహిత్యం పట్ల అభిమానం పెంచు కున్నాను. అదే బి.ఎ.లో పొలిటికల్‌ సైన్స్‌, చరిత్రతో కలిపి తెలుగు సాహిత్యం చదవటానికి ప్రధాన ప్రేరణ అయింది. బి.ఎ. లో తెలుగుసాహిత్యం పేపర్లో వచ్చిన మార్కులకు ఉస్మానియా యూనివర్సిటీ వారిచ్చే హెచ్‌ఇహెచ్‌ నిజామ్స్‌ గోల్డ్‌ మెడల్‌ వచ్చింది. తెలుగు ఎంఏలో చేరటానికి దానితోపాటు మానాన్న ఆలోచన కూడా కారణమైంది. ఆయనతో పాటు ఎంఏలో కోవెల సుప్రసన్నాచార్యులు గారు, మాదిరాజు రంగారావు గారు, జి.వి.సుబ్రహ్మణ్యం గారు పాఠాలు చెప్పిన తీరు సాహిత్యపు లోతులు తెలుసుకొనటం పట్ల ఉత్సాహాన్నీ, పరిశోధన, విమర్శ రంగాల పట్ల ఆసక్తిని కలిగించాయి.
మీ తొలి రచన వివరాలు చెప్పండి ?
తొలి రచన అంటే... 1969లో తెలంగాణ ఉద్యమ కాలంలో బడులు బంద్‌ అయి, ఇంటిదగ్గరే ఉన్న సమయంలో మా వీధి పిల్లలం అందరం కలిసి బాలానందసంఘం పెట్టుకొని, దాని పక్షాన తీసిన లిఖిత పత్రిక మనోవాణి కోసం రాసిన కవిత్వం. అచ్చయిన తొలి రచన కథ. 1972లో తెలుగు విద్యార్థి పత్రికలో వచ్చిన దేశం కోసం.
తొలినుంచీ స్త్రీవాద సాహిత్యం తాలూకు భావాలు మీలో బలంగా ఉండేవా?
స్త్రీవాద భావాలు మా తరానికి అందివచ్చింది 1975 తరువాత. 1982లో వరంగల్లులో మేము స్త్రీజనాభ్యుదయ అధ్యయనసంస్థ ఏర్పాటు చేసుకున్నాక, అధ్యయనం పెరిగింది. అవగాహన బలపడింది. అయితే, అమ్మగన్న సంతానం ముగ్గురం ఆడపిల్లలమే కావటంవల్ల కావచ్చు. ఇంట్లోలేదు కానీ మా స్నేహితులు, బంధువుల ఇళ్లల్లోని ఆడామగా వివక్ష అర్ధం అవుతూనే ఉండేది. అభ్యాసకాలపు కవిత్వంలో ఆ అవగాహన మొగ్గదశలో ఉంది. అప్పుడు 'ఈనాటి వ్యవస్థలో పిల్లలు/ సంసారం వ్యాపారపు లాభనష్టాలు/ మగ - మంచి పెట్టుబడి / ఆడ - గుండెలమీద కుంపటి'(పిల్లలు - పువ్వులు ) అని రాసాను.
కొండేపూడి నిర్మల 'లేబర్రూం' కవిత గానీ, విరసం విమల 'వంటిల్లు' కవితగానీ, స్త్రీకి సహజంగాను, ప్రకతి, సష్టిపరంగాను, జరిగే శారీరక ప్రక్రియలను కొండంతలు చేసి వర్ణించారని కొన్ని వ్యాసాల్లో చదివాను. మీ అభిప్రాయం?
స్త్రీకి సహజంగా, సష్టిపరంగా జరిగే శారీరక ప్రక్రియలను గోరంతలు కొండంతలు చేశారన్నది కదా ఆక్షేపణ! నిజానికి అప్పట్లో అలాంటి ఆక్షేపణకు గురయింది లేబర్‌ రూమ్‌ కవిత ఒకటే. ఆడవాళ్లను వంటింటికి పర్యాయపదంగా చేసిన సంస్కృతిలో బండారాన్ని బయటపెట్టి వంటింటిని రాకాసి గద్దగా రూపకం చేసి ఒంటరి వంటిళ్లను కూల్చేయాలన్న విమల పిలుపును అందరూ ఆమోదించి హర్షించారని చెప్పలేను కానీ, అంతగా దానిమీద ఎవరూ విరుచుకుపడలేదు. ప్రసవం స్త్రీకి సృష్టి సహజం సరే. అందులో ఎంత బాధవుందో, అదెలా పునర్జన్మో తెలిసి ఆమె పట్ల గౌరవాదరాలు చూపే సంస్కారం ఈ సమాజంలో ఎంతవుంది? నేను నాలుగో తరగతో అయిదో తరగతో చదువుతున్నప్పుడు మా ఇంటిదగ్గరే వున్న స్నేహితురాలి ఇంట్లో తండ్రి అధికారానికి, అరుపులకు జడుస్తూ ఆమె తల్లి పదకొండవరోజు పురిటిస్నానం చేస్తూనే వంటకు దిగిన దృశ్యం నాకిప్పటికీ గుర్తే! అది నా మనసును ఇప్పటికీ మెలిపెడుతూనే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఏ ఆడదైనా మాతగర్వంతో పొంగిపోతుందా? లేక ఏమి కడుపులు, ఏమి పురుళ్ళు అని రోతపడుతుందా చెప్పండి? అలాంటి స్త్రీల ఆక్రోశం లేబర్‌ రూమ్‌ కవిత. మన కావ్యాలన్నీ పుత్రోదయ వర్ణనతో ముగుస్తాయి. పుత్రోదయ సమయంలో స్త్రీల శరీరం ఎంత హింసకు, యాతనకు గురవుతుందో వాళ్లకు పట్టలేదు. నిర్మల ఆవైపు చూడమంది. అంత యాతనపడి మానవవనరులను ఉత్పత్తి చేసే స్త్రీల పట్ల ఈ సమాజం ఎంత సున్నితంగా, బాధ్యతగా ఉండాలో చూడమంటుంది. స్త్రీలు పిల్లలను కనటం సష్టి సహజం అనుకుందాం కాసేపు. వంట చేయటం కూడా సష్టి సహజమా? మగవాళ్ళు కూడా చేయగల పనే కదా! అయినా వంటిళ్ళు కేరాఫ్‌ ఆడవాళ్లు గానే ఎందుకు ఉన్నాయి? అని ఎప్పుడైనా ప్రశ్నించు కున్నామా?
స్త్రీవాదంమీద 'కవిత్వం' ఎక్కువ ప్రభావాన్ని కలిగించిందా? లేక 'కథాసాహిత్యం' ఎక్కువ ప్రభావాన్ని కలిగించిందా?
స్త్రీవాద భావజాల ప్రసారానికి ప్రారంభంలో కవిత్వమే వాహిక అయింది. భావోద్వేగాలను పదునుగా వ్యక్తీకరించగలిగేది కవిత్వం. ఆవేశం దాని జీవశక్తి. అందువల్ల అది సాధ్యమైంది. స్త్రీవాద భావజాల విస్తృతి తెలిసే కొద్దీ ఆలోచన పెరిగే కొద్దీ కథ ఆస్థానాన్ని ఆక్రమించింది. నిజానికి ఇప్పుడు స్త్రీవాద సిద్ధాంత అవగాహన తెలుగు కథ వస్తు పరిధిని విశాలం చేసింది.
స్త్రీవాద కవిత్వంలో అశ్లీల పదాలు ఉపయోగించడం సమర్ధనీయమా?
అశ్లీలం అనేది పదంలో ఉండదు. ఉద్దేశాన్ని, ఉచ్ఛారణను, సందర్భాన్నిబట్టి అది నిర్ణయం అవుతుంది. ఈ విషయం మీద అప్పట్లో చాలా వివరణలు వచ్చాయి. స్త్రీలు తమ అనుభవకోణం నుండి శరీరాన్ని నిర్వచిస్తే, స్త్రీలుగా తమ శరీరానికి సంబంధించిన ప్రత్యేక ధర్మాలను, బహిష్టు గురించి కావొచ్చు, గర్భభారం గురించి కావొచ్చు, ప్రసవ సమయపు దశల గురించి కావొచ్చు- కవిత్వం చేస్తే అది అశ్లీలం ఎలా అవుతుంది? అసహజ రీతిలో శరీరాలను ఉద్రేకపరిచి సంభోగ వాంఛను రెచ్చగొట్టే పదాలు వాళ్ళేమీ రాయలేదే !
స్త్రీవాదం ఉవ్వెత్తుగా ఎగసి తర్వాత చల్లారింది. ఈ వాదం ద్వారా మహిళలు సాధించిందేమిటి?
స్త్రీవాదం అనే విషయం, తెలుగులో స్త్రీవాద సాహిత్యం రావటానికి చాలా ఏళ్లకు ముందునుండే ప్రపంచంలో ఉంది. ఇప్పటికీ ఉంది. తెలుగులో స్త్రీవాద కవిత్వం ఎనభైలలో, తొంభైలలో ఉన్నంత ఉధతంగా లేదు కనుక చల్లారి పోయిందనుకొంటున్నారు. అది నిజం కాదు. అప్పుడు కొత్తది కనుక దిగ్భ్రాంతికరమైన కొత్త ఆలోచనలు, అభివ్యక్తులు ఉన్నందువలన కలిగిన ఉక్కిరిబిక్కిరిలో ఉన్నాం. ఈ ఇరవై ముప్ఫయి ఏళ్లలో ఆ ఆలోచనలకు, అభివ్యక్తులకు అలవాటు పడ్డాం కనుక ఇప్పుడు ఆనాటి ఉక్కిరి బిక్కిరి లేక స్త్రీవాదం లేదనుకొంటున్నాం. నిజానికి ఇప్పుడది ఒక అస్తిత్వ తాత్విక భావనగా సామాజిక సాహిత్య సంస్కారంలో కలిసిపోయింది. అదే స్త్రీవాదం ద్వారా సాధించబడిన ప్రయోజనం.
మీరు సాహిత్య అకాడెమీ పురస్కారం వాపసు చేశారు కదా.. ఆ విషయం క్లుప్తంగా చెప్తారా?
అవును. 'సాహిత్యాకాశంలో సగం' ఆధునిక స్త్రీల సాహిత్య అధ్యయన అవసరాన్ని, పద్ధతులను, ప్రయోజనాలను నిరూపిస్తూ రాసిన వ్యాసాలు, స్త్రీల కవిత్వాన్ని, కథలను విశ్లేషిస్తూ రాసిన వ్యాసాలు కలిపి వేసిన సంపుటి. ఈ పుస్తకానికి 2013లో సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. తెలుగులో స్త్రీలసాహిత్యానికి లభించిన గౌరవంగా స్త్రీల సాహిత్యాన్ని బాధ్యతగా అధ్యయనం చేయవలసిన అవసరానికి జాతీయస్థాయి గుర్తింపుగా దానిని భావించాను. కానీ 2015 ఆగస్టులో కన్నడ వచన సాహిత్య పరిశోధకుడు, కన్నడ విశ్వవిద్యాలయానికి వైస్‌ చాన్సలర్‌గా పనిచేసిన విద్యావేత్త, తన పరిశోధనాత్మక సాహిత్య వ్యాసాలకు గాను కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా పొందిన ఎం.ఎం కల్బుర్గి ఇంటిదగ్గరే హత్యకు గురికావటం కలిగించిన సంచలనం సాహిత్య రంగంలో చర్చకు కారణమైంది. లింగాయత సంప్ర దాయంపై చేసిన పరిశోధనలలో ఆయన బసవేశ్వరుడి గురించి నిర్ధారించిన కొత్త విషయాలు హిందూమత భావాలను దెబ్బ తీశాయి అన్న ఆరోపణ ఆయన హత్యకు కారణం. విశ్వాసాల పునాదిమీద పెరిగిన సంస్కృతిలో భిన్నాభిప్రాయాల పట్ల అసహనం ఫలితం ఇది. ఈ అసహనం, స్వతంత్ర పరిశోధన లను, ఆవిష్కరణలకు, వ్రాసే స్వేఛ్చకు, మాట్లాడే స్వేచ్ఛకు అవకాశం ఇవ్వదు. దానికితోడు భిన్న మతస్థుల ఆహారపుటల వాట్లను సహించలేని దాడులు, హత్యలు. ఈ రకమైన అప్రజాస్వామిక వాతావరణాన్ని సష్టించి పోషించి చూస్తూ కూర్చున్న ప్రభుత్వం పట్ల నిరసన ప్రకటనగా దేశవ్యాప్తంగా సాహిత్య అకాడెమీ తదితర ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన రచయితలు, కళాకారులు, శాస్త్రవేత్తలు తమ అవార్డులను వాపస్‌ చేశారు. నేను వాపస్‌ చేసింది కూడా అందుకే.
ఉదార, మార్కి ్సస్టు, రాడికల్‌, సోషలిస్ట్‌, ఎకో ... ఇలా వివిధ రకాల స్త్రీవాదాలున్నాయి. భారతీయ స్త్రీలకు ఏ వాదం సమర్ధనీయమంటారు?
ఏ రకం స్త్రీవాదం అయినా స్త్రీపురుష అసమానతలను, జండర్‌ వివక్షను సంబోధించినవే. వాటిని నిర్మూలించే మార్గాలలో భేదాన్ని బట్టి ఏర్పడ్డవే ఈ స్త్రీవాద భేదాలు. సామాజిక సంస్కరణ లు, చట్టబద్ధ అవకాశాల కల్పన ఉదార స్త్రీవాదం వర్గపోరాటంలో భాగంగా శ్రామికవర్గ మహిళా విముక్తితో ముడిపడి మొత్తం స్త్రీల సమస్య పరిష్కార ఆకాంక్ష, ఆచరణ మార్క్సిస్టు స్త్రీవాదం. స్త్రీలంతా ఒక వర్గం అన్న భావన రాడికల్‌ స్త్రీవాదంలో ముఖ్యాంశం. స్త్రీల దేహాత్మల మీద, ఆలోచనల మీద, ఆచరణ మీద, మొత్తంగా జీవితం మీద పురుషుల అధికారాన్ని స్థిరపరచిన పితస్వామ్యం వివక్షకు మూలం అన్న గ్రహింపు ప్రాతిపదికగా శరీరం, హదయం, మెదడు ఉన్న మనుషులుగా స్త్రీలు అస్తిత్వ స్పహతో ఐక్యంగా విముక్తి మార్గాలను ఆవిష్కరించుకొనటం దీని లక్ష్యం. తనకన్నా భిన్నమైన వర్గంగా పురుషుడు, స్పర్ధకు, సవాల్‌కు విషయం అవుతాడు. మార్క్సిస్టు స్త్రీవాదంలోని వర్గ దక్పథాన్ని రాడికల్‌ స్త్రీవాదంలోని పితస్వామ్యాన్ని పరస్పర సంబంధంలో అర్ధం చేసుకొనటం, స్త్రీవిముక్తి ఉద్యమాలను వర్గపోరాటంలో భాగంగా అభివద్ధి చేసుకొనటం సోషలిస్టు స్త్రీవాదం. భారతీయ స్త్రీలకే కాదు, ఏ దేశపు స్త్రీలకైనా ఏదో ఒక స్త్రీవాద భేదాన్ని సర్వరోగ నివారిణిగా సూచించలేం. ఎందుకంటే ఇవన్నీ విడివిడి విషయాలు కావు కనుక. ఒకటి ప్రముఖంగా ఉంటూనే మిగిలిన మూడింటిలోని ఏ ఒకటి రెండైనా సమాంతరంగా జీవన వ్యవహారంలో భాగమవుతుంటాయి. ఇవి చట్టాలు కావు, ఈ దేశంలో వీటిని అమలు చేద్దామనుకొనటానికి. దక్పథానికి సంబంధించినవి. భిన్న వర్గాల భిన్న స్త్రీ సమూహాలు మళ్ళీ ఒక్కొక్కరుగా ఎవరి చైతన్యాన్ని బట్టి వాళ్ళు తమ తమ అనుభవానికి, అవసరానికి అక్కరకు వచ్చే, ఆకాంక్షల పరిపూర్తికి తోడ్పడగలిగే సూత్రాన్ని ఏ స్త్రీవాద భేదం నుండైనా స్వీకరించి ఆచరణగా మార్చుకోవచ్చు. ప్రధానంగా ఇది వ్యత్యాసాల సమాజం. ధనిక పేద కులమత, స్త్రీపురుష వ్యత్యాసాలతో సంక్లిష్టంగా ఉండే భారతీయ సమాజాన్ని అర్ధం చేసుకొనటానికి సోషలిస్టు స్త్రీవాదం కొంచం ఎక్కువ ప్రయోజనకారి అనుకొంటు న్నాను.
స్త్రీవాదం లేవనెత్తిన మౌలిక ప్రశ్నలకు కొన్నింటికైనా పరిష్కారాలు లభించాయంటారా?
స్త్రీవాదం లేవనెత్తిన మౌలికప్రశ్నలు వివక్షకు, భార్యాభర్తల సంబంధాలకు, స్త్రీల లైంగికతపై నియంత్రణకు, కుటుంబాధి కారానికి, కులమత ఆధిపత్యాలకు సంబంధించినవి. ఈ ప్రశ్నలు అన్నీ కాకపోయినా కొన్నైనా, బీజరూపంలోనైనా స్త్రీవాదం తెలియని కాలాలలో కూడా ఉన్నవే. వాటిని వ్యక్తిగత చైతన్యంతో ఎవరుఎలా పరిష్కరించుకొనటానికి ప్రయత్నించారో సంప్రదాయ సాహిత్యాన్ని పరిశీలిస్తే కథల రూపంలో ఇచ్చిన నమూనాల ద్వారా తెలుస్తుంది. స్త్రీవాదం ఒక సిద్ధాంతంగా పదునెక్కిన ఆధునిక కాలానికి ఈ ప్రశ్నలు మరింత స్పష్టంగా, సూటిగా ఉద్యమ స్థాయిలో ముందుకు వచ్చాయి. తెలుగునాట ఈ చైతన్యం వ్యాపించిన డెబ్బై ఎనభయి దశకాలనుంచి, ఈ నలభై యాభై ఏళ్ల కాలం మీద ఆ ప్రశ్నలకు పరిష్కారాలు లభించాయా అంటే స్త్రీలలో ఆత్మగౌరవ చైతన్యస్థాయిని, పురుషులలో ప్రజాస్వామిక స్ఫూర్తిని కొంతవరకు పెంచినమాట నిజమే కానీ, గుణాత్మకమైన మార్పులు వచ్చాయని మాత్రం చెప్పలేం. ఎందుకంటే స్త్రీవాదం వేసిన ప్రశ్నలు ఉపరితల సాంస్కతిక నిర్మాణాలకు, భావజాలానికి సంబంధించినవి. వాటికి వేళ్ళు ఆర్థిక పునాది లోపల బలంగా నాటుకొని ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ సమూహాలు, ఏ వ్యక్తులు ఆ నిర్మాణాలతో, భావజాలంతో ఎంతెంత సంఘర్షణ పడుతున్నారో, సంస్కారాలలో మార్పుకు ఎంతవరకు దోహదం చేసారో చెప్పగల గణాంకాలు తియ్యటం అసంభవం. భావజాల సంఘర్షణ తీవ్రతను, సంస్కారాల్లో మార్పు ను కొలవగల సాధనాలు లేవు. ఈ పరిస్థితుల్లో పరిష్కారాలు లక్ష్యంగా మార్పుదిశగా జరిగే మందగమనమే కనిపిస్తుంది. సాంస్కతిక విప్లవం నిరంతరం కొనసాగవలసినది, దీర్ఘకాలిక మైనది కూడా. తక్షణ అవసరాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు గీటురాళ్ళుగా స్త్రీవాదం లేవనెత్తిన ప్రశ్నల పరిష్కారానికి జరుగు తున్న ప్రయత్నం వర్తమాన చరిత్ర.
ప్రాచీన సాహిత్యాన్ని స్త్రీవాద దక్పథంతో పునర్విమర్శ, విశ్లేషణ చేయటం లాంటివి జయప్రభ గారు, ఓల్గా గారు చేశారు. మీరు ఆధునిక దక్పథంతో మాత్రమే విశ్లేషణ చేశారనుకుంటాను.
ప్రాచీన సాహిత్యాన్ని స్త్రీవాద దక్పథంతో విశ్లేషించే పని 1984 నాటికే మొదలు పెట్టాను. అది యాదచ్ఛికం కాదు. సమకాలీన సమాజంతో చేస్తున్న సంభాషణ పరిణామం. 1977లో ఎం.ఏ పూర్తిచేసి అధ్యాపక వత్తిలోకి ప్రవేశించిన నాకు యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల విద్యార్థి రాజకీయాలు రగులుకొంటున్న ఉత్తర తెలంగాణా విప్లవోద్య మాన్ని పరిచయం చేశాయి. సజన, అరుణతార, ప్రజాసాహితి పత్రికలు కొత్త సామాజిక ఆదర్శాలలోకి ఆలోచనలు విచ్చుకొనేలా చేశాయి. విరసం సభల ఉపన్యాసాలు ఉత్తేజాన్ని ఇచ్చాయి. మార్క్సిస్టు సిద్ధాంత అధ్యయనం పట్ల ఆసక్తి పెరిగింది. మార్క్సిస్టు మూల సూత్రాలు మొదలైన పుస్తకాలు, మార్క్సిస్టు దక్పథం నుండి ప్రపంచ చరిత్రను వ్యాఖ్యానించిన పుస్తకాలు చదువుతుంటే ఆలోచనలకు కొత్తవెలుగు వచ్చిన అనుభూతి. తెలుసుకొంటున్న విషయాలను చదువుతున్న సాహిత్యానికి అన్వయించి చూసు కొనటం, నలుగురితో పంచుకొనటానికి రావిశాస్త్రి, శ్రీశ్రీ వంటి వారి కథలపై విమర్శ వ్యాసాలు వ్రాయటం జరిగింది.
ఆ సమయంలోనే దేశమంతటా విద్యారంగంలో మహిళా జీవన అధ్యయనాలను ప్రవేశ పెట్టటానికి జరుగుతున్న ప్రయత్నాల గురించిన ఎరుక కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకు లను నిలువనీయలేదు. మహిళాజీవన అధ్యయనం ఒక్క తరగతి గదికే పరిమితమైంది కాదని సమాజంలో స్త్రీల జీవిత స్థితిగతుల అవగాహన లేకుండా అది సమగ్రం కాదనే అవగాహనతో 1982లో యూనివర్సిటీ అధ్యాపకులం కొందరం కలిసి స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ ఏర్పాటు చేసుకున్నాం. సాహిత్య విద్యార్థిగా సాహిత్యంలో స్త్రీల జీవన స్థితిగతుల అధ్యయనం నాకు లక్ష్యం అయింది. అప్పుడే చారిత్రక విభాత సంధ్యలలో మహిళా జీవిత వికాసమెట్టిదో తెలుసుకొనటానికి సంప్రదాయ సాహిత్య అధ్యయనం అవసరం అని తెలిసింది. సాహిత్యాన్ని ఉపయోగించుకొంటూ చరిత్రను వ్యాఖ్యానించిన కొశాంబిని, ఇరావతీ కార్వేని (యుగాంతం) చదువుకొనటం నన్ను ఆ వైపుకు నడిపించాయి. ఆ క్రమంలో వచ్చిన భారతంలో భార్యభర్త సంబంధాలు వ్యాసం 1984 నాటిది. అక్కడి నుండి నా పరిశోధనలు పురాణేతిహాసాలను, పాల్కురికి సోమనాధుడి సాహిత్యాన్ని, శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని కేంద్రంగా చేసుకొని చేసిన విశ్ల్లేేషణలు అన్నీ స్త్రీ వాదం వెలుగులో సాగినవే. అలంకార శాస్త్రం పాఠంగా చెప్తూ రస సిద్దాంతం మొదలైన వాటిని ఆ కోణం నుండి విశ్లేషించకుండా ఉండలేక పోయాను. ఈ రకమైన వ్యాసాలను అన్నిటినీ 1998లో 'సంప్రదాయ సాహిత్యం - స్త్రీవాద దక్పథం' పేరిట సంపుటిగా ప్రచురించాను. 'ప్రాచీన సాహిత్యం -మరో చూపు' (2008) సంపుటిలో కూడా ఇలాంటి వ్యాసాలు ఉన్నాయి.
చివరిగా, స్త్రీవాదాన్ని కొనసాగిస్తున్న రచయిత్రులకు మీ సందేశం ఏమిటి?
స్త్రీవాదం అనేకమంది స్త్రీల అనుభవాలనుంచి వివక్షకు కార ణాలను గుర్తించటం దగ్గర రూపొందిన సిద్ధాంతం. ఇందులో స్త్రీల లైంగికత, లైంగిక స్వేచ్ఛలకు సంబంధించిన చర్చ ఒక భాగం. అవగాహన అక్కడ ఆగిపోతే అది వ్యక్తి జీవితానికి సంబం ధించిన ప్రయోగాలతో ముగుస్తుంది. స్త్రీలు అంతా ఒకటే అన్న స్త్రీవాద సూత్రం దగ్గర ఆగిపోతే భిన్న వర్గాలు, కులాలు, మతాలు ఉన్న దేశంలో భిన్నవర్గాల స్త్రీల ప్రత్యేక అస్తిత్వ సమస్యలను గుర్తించలేని, అర్థం చేసుకోలేని పరిమితికి లోనవడం జరుగు తుంది. అది బాధిత స్త్రీల మధ్య ఉండవలసిన సహౌదరత్వానికి, ఐక్యతకు భంగకరం మాత్రమే కాక సామాజిక అంతరువుల యథాతథ స్థితిని కాపాడేది అవుతుంది. అందువల్ల ఈ నాడు స్త్రీవాదం జీవితాన్ని జండర్‌ వివక్షను అర్ధం చేసుకొనటానికి సాధనమని నమ్మే వాళ్ళు, వివక్షలేని సమాజాన్ని కోరుకొనేవాళ్ళు కుల మత వర్గ వివక్షలనుండి విముక్తికి భిన్నపాయలలో సాగే ఉద్యమాల సాపేక్షతలో స్త్రీవాద అవగాహనను ఎప్పటికప్పుడు సరిచేసుకొంటూ ఉండాలి. అది ఆరోగ్యకరమైన, ప్రజాస్వామిక మానవ సంబంధాల నిర్మాణానికి అత్యవసరమైన షరతు.