గజల్ రచయిత్రి, కవయిత్రి భైరి ఇందిర (60) గత కొంతకాలంగా క్యాన్సర్తో బాథపడుతూ... 19.2.2023వ తేదీన హైదరాబాదులో కన్నుమూశారు. కడదాకా నిండైన ఆత్మస్థైర్యంతో జీవించి, అందరికీ స్ఫూర్తిని పంచి, 'నేను పోయినప్పుడు' అనే తన వీలునామా కవితను రాసుకున్న అక్షరజీవి ఇందిర. ఖమ్మం జిల్లా ఇల్లెందులో బైరి రామ్మూర్తి - వెంకటరమణ దంపతులకు 19 డిసెంబర్ 1962న ఆమె జన్మించారు. ఇల్లందు ,హైదరాబాదు, వరంగల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి ఉపాధ్యాయ శిక్షణ కూడా చేశారు.
తండ్రి ప్రోత్సాహంతో సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. వివాహానంతరం దీక్షతో చదివి 1997లో ప్రభుత్వ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు. ఖమ్మం జిల్లాలోని మాణిక్యారం ఉన్నత పాఠశాలలో తన ఉద్యోగ జీవితానికి శ్రీకారం చుట్టారు. యుటిఎఫ్, సాహితీ స్రవంతి లలో పనిచేశారు. అక్షరాస్యత ఉద్యమంలోనూ, సైన్సు ప్రచార ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఎన్నో ప్రచార గీతాలు రాశారు. తనదైన అంకితభావంతో ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు.
9వ తరగతిలోనే ఇందిర 'ఉక్కు పిడికిళ్ళు' పేరిట ఓ కవిత రాశారు. 1996 నుంచి తన సాహితీ సృజనను విస్తృతం చేశారు. తరచూ కవిత్వం రాస్తూ స్థానిక సంస్థల కవి సమ్మేళనాల్లో పాల్గొనేవారు. తనలోని అభ్యుదయ భావాలకు కవిత, మినీ కవిత, గేయం, కథ, వంటి ప్రక్రియలను వేదికలుగా చేసుకున్నారు. చివర్లో మిత్రుల సూచనల మేరకు గజల్ రచన చేపట్టి అందరినీ అబ్బుర పరుస్తూ అనేక శక్తివంతమైన గజల్స్ రాసి తెలంగాణా 'తొలి గజల్ రచయిత్రి'గా పేరొందారు. అలవోకలు (2005), అభిమతం(2007) హైకు/మినీ కవితా సంపుటాలు, తెలంగాణ గజల్ కావ్యం (2016), మన కవులు గజల్ (2018) ఘనచరితలు గేయ కవిత్వం (2019) వంటివి వెలువ రించారు. తన సాహితీ కృషికి పలు పురస్కారాలు పొందారు. ఆమె మృతికి సాహితీ స్రవంతి, తెలంగాణా సాహితి, టియుటిఎఫ్, ప్రజా నాట్యమండలి సంతాపం ప్రకటించాయి. ఒక మంచి రచయిత్రిని, సామాజిక కార్యకర్తనూ కోల్పోయామని విచారం వ్యక్తం చేశాయి.