భూత భవిష్యత్‌ వర్తమానాల 'పుస్తకాలం'

ఎమ్వీ రామిరెడ్డి
98667 77870

చిరిగిన చొక్కానైనా తొడుక్కోబీ ఒక మంచి పుస్తకం కొనుక్కో.
- కందుకూరి వీరేశలింగం
మనసులేని మనిషి, పుస్తకం లేని ఇల్లు నిరర్థకం. ఆస్తులూ అంతస్తులూ సమస్త బాంధవ్యాలూ కోల్పోయినా, పుస్తకం ఒక్కటీ తోడుగా ఉంటే చాలు. అది మనల్ని పునర్నిర్మిస్తుంది. రక్తమాంసాలు ఎక్కిస్తుంది. జవజీవాలు ప్రసాదిస్తుంది. ఇంత సాహిత్యాన్ని ప్రసాదంగా పెడుతుంది. సాహిత్యం జీవితాన్ని ఉన్నతీకరిస్తుంది. సమాజాన్ని సమున్నతం చేస్తుంది. పుస్తకాలు ప్రసాదించిన వెలుగులోనే ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకున్న, తీసుకుంటున్న మహానుభావులు ఎందరో ఉన్నారు.
కానీ, ప్రస్తుతం పుస్తకం బిక్కమొహం వేసి దీనంగా చూస్తోంది. తనను తాకే చేతుల సంఖ్య తగ్గిపోయిందన్న దిగులుతో కుంగిపోతోంది. డిజిటల్‌ యుగంలో తన ప్రాధాన్యాన్ని విస్మరిస్తున్న మనిషి వంక జాలిగా చూస్తోంది. పుస్తకం విలువ తెలియని మనిషి కళాహీనంగా, చైతన్యరహితంగా నిస్సారమైన జీవితాన్ని అనుభవిస్తాడన్న జాలి అది. పుస్తక ప్రాభవం గుర్తించని వ్యక్తులు ఈ సమాజంలో వెలుగుధారలు నింపలేరన్న జాలి అది.
చదివేవారి సంఖ్య తగ్గిపోతోందనీ, పుస్తకం బూజు పట్టిపోతోందనీ తెగ బాధపడే బదులు... అధ్యయనపు ఆవశ్యకతను వివరించే మేలు ఒకటి తలపెడితే పోలా... అనుకున్నారు పరిశోధకుడు, సాహితీవేత్త జి.ఎస్‌.చలం. అనుకున్నదే తడవు, పని ప్రారంభించారు. పుస్తక ప్రాధాన్యం తెలియజెప్పటానికి తానేమీ పుంఖానుపుంఖాలుగా రాయలేదు. ఇప్పటికే ఆ పనిచేసిన వారిని దుర్భిణీ వేసి వెతికి పట్టుకున్నారు. 'పుస్తకం'పై ప్రముఖులు వెలిబుచ్చిన అమూల్యమైన అభిప్రాయాలూ, విశ్లేషణాత్మక వ్యాసాలూ, కనువిప్పు కల్గించే కవితలూ వార్తా కథనాలూ, ఆణిముత్యాల్లాంటి సూక్తులూ గుదిగుచ్చారు. అన్నిటినీ ఒకచోట చేర్చి అక్షరాభిషేకం చేశారు. ఆ సంకలనాన్ని 'కాలం' ఒడిలో నిలబెట్టాలనుకున్నారు. అందుకే 'పుస్తకాలం' అని నామకరణం చేశారు.
్జ్జ్జ
'ఈ ప్రపంచంలో మన కళ్లెదుట కనిపించే దేవతలే పుస్తకాలు' అంటారు అబ్రహాం లింకన్‌.
''ఒక సంస్క తిని నాశనం చేయటానికి పుస్తకాలను కాల్చే పనిలేదు. జనం వాటిని చదవకుండా చూస్తే చాలు'' అంటారు అమెరికన్‌ రచయిత రే బ్రాడ్చరీ.
''పుస్తకాన్ని కాల్చడానికి మించిన పెద్ద నేరాలున్నాయి. అందులో ఒకటి వాటిని చదవకపోవటం'' అంటారు రష్యన్‌ కవి జోసెఫ్‌ బ్రాడ్‌స్కీ.
మౌఖిక రూపం నుంచి రాళ్ల మీదికీ, రాగి రేకుల మీదికీ; చర్మ, తాటాకులు, చేతి కాగితం మీదికీ లిపి వ్యాపించింది. లిపి, ముద్రణ అనే అంశాలు తలచుకునేటప్పుడు అశోకుడు, షుల్జీ, విలియం కేరీ వంటి మహానుభావులను స్మరించుకోవాలి. అచ్చుయంత్రాన్ని తయారు చేయటానికి జొహాన్‌ గుటెన్‌ బర్గ్‌ పడిన కష్టాలు, భారతీయ భాషల్లో ముద్రణ యజ్ఞానికి శ్రీకారం చుట్టిన విలియం కేరీ వెతల గురించి తెలుసుకోకపోతే, అసలు పుస్తకం విలువే తెలియదు.
'ముద్రిత గ్రంథాల చరిత్ర మహౌన్నతం' శీర్షికన బెజవాడ శరభయ్య రాసిన వ్యాసంలో గ్రంథాల పుట్టుపూర్వోత్తరాలు, అవి మనిషిని సానబెట్టిన వైనంతోపాటు గాంధీ, నెహ్రూ, వీరేశలింగంలపై పుస్తకాల ప్రభావం వంటి అంశాలను ఆసక్తికరంగా వివరించారు. ముఖ్యంగా ప్లేటో రచన రిపబ్లిక్‌, అరిస్టాటిల్‌ ఎథిక్స్‌, పాలిటిక్స్‌, పోయిటిక్స్‌ మాకియవెల్లి, ద ప్రిన్స్‌, సర్‌ థామస్‌ మోర్‌, యుటోపియా, జాన్‌ లాక్‌, సివిల్‌ గవర్నమెంట్‌, రూసో; సోషల్‌ కాంట్రాక్ట్‌, థామస్‌ పేస్‌; ఏజ్‌ ఆఫ్‌ రీజన్‌, జాన్‌ స్టూవర్టు మిల్‌; ఆన్‌ లిబర్టీ, రిప్రజెంటేటివ్‌ గవర్నమెంట్‌- గ్రాంట్‌ అల్లెన్‌; ఇవల్యూషన్‌ ఆఫ్‌ ద ఐడియా ఆఫ్‌ ద గాడ్‌ వంటి గ్రంథాలు ప్రపంచగతి మార్చిన తీరును గొప్పగా విశ్లేషించారు. 'పుస్తకాలు లేని గది ఆత్మలేని శరీరం వంటి'దని ఓ విదేశీయుడు చెప్పిన విషయాన్ని సందర్భాను సారంగా ప్రస్తావించారు శరభయ్య.
బాల్యం నుంచే గోర్కీ జీవితాన్ని పుస్తకాలు ఎలా మలుపు తిప్పగలిగాయో 'వెలుతురు దారి'లో తెలుసుకోవచ్చు. పుష్కిన్‌, గొగోల్‌, టర్జెనోవ్‌, లెర్మంటవ్‌, చెహౌవ్‌ తదితర రచయితలు తనకిష్టమైన 'పుస్తకాల చెరసాల'లో మగ్గిపోయేలా చేశారంటారు గోర్కీ. ''ప్రజలను అంధకారంలో ఉంచి, వారి మూర్ఖపుటలవాట్ల నుండి, అజ్ఞానం నుండి రాజకీయంగా లాభాలు పొందుతున్న వ్యవస్థకు నిప్పు పెట్టాలంటే పుస్తకాలే సాధనం'' అంటారు ముల్కరాజ్‌ ఆనంద్‌ 'మానవ జీవితంపై పుస్తకాల ప్రభావం' వివరిస్తూ.
తన సంపాదనలో అధిక భాగం పుస్తకాలు కొనటానికే వెచ్చించేవారట అంబేద్కర్‌. పై చదువులకు విదేశాలు వెళ్లినప్పుడు ఎక్కువ ధనం పుస్తకాలకే ఖర్చయ్యేదట. రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వెళ్లినప్పుడు శ్రీనివాసన్‌ చేత 32 పెట్టెల నిండా పుస్తకాలు ఇంటికి పంపిన అంబేద్కర్‌ భారత్‌ తిరిగి వచ్చేటప్పుడు తనవెంట మరో 24 పెట్టెల నిండా పుస్తకాలు తెచ్చుకున్నారట. ఈ విషయాలు చదివినప్పుడు ఆయన అపార మేధకు కారణమేమిటో బోధ పడటం లేదూ!
అప్పట్లో పల్లెపట్టుల్లో పుస్తకాల పరిస్థితి ఎలా ఉండేదో వివరించారు మధురాంతకం రాజారాం. పట్నం వెళ్లేవారిని 'కాస్త ఈ పుస్తకం కొని తే నాయినా' అని బతిమాలే వాతావరణాన్ని చిత్రించారు. మర్యాద రామన్న కథలు, మదన కామరాజు కథలు, బట్టి విక్రమార్క కథలు, తెనాలి రామలింగం కథల దగ్గర్నుంచి సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి అనే బృహత్‌ జానపద నవల దాకా ఎన్నో పుస్తకాల గురించి మధురంగా చెప్పారు. ''ఎంతటి బృహత్‌ గ్రంథాన్ని తెరిచి చూసినా మచ్చుకొక్క అచ్చుతప్పు కనిపించదు గదా! అచ్చయిన ఫారాలను నోటీసు బోర్డుపైన అతికించి, ఒక అచ్చుతప్పు కనిపెట్టిన వారికి అర్ధరూపాయి పారితోషికం ప్రకటించేవారట! ఒక ప్రచురణ సంస్థగా వావిళ్ళ వారు, ఒక పత్రికగా ఆంధ్రపత్రిక వారు చేసినంత భాషా సాహిత్యసేవలు మన విశ్వవిద్యాలయాలన్నీ కలిసి చేయగలిగాయా అన్నది నా అనుమానం!'' అంటారు మధురాంతకం.
'పుస్తకాలే నన్ను పులిని చేశాయి' అని చెప్పిన వేలుపిళ్లై ప్రభాకరన్‌ 'చదివే అలవాటులో భాగంగానే భారత జాతీయో ద్యమంతోనూ, సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌ సింగ్‌, బాలగంగాధర్‌ తిలక్‌ వంటి అమరవీరులతోనూ నాకు గాఢమైన మానసిక సాన్నిహిత్యం ఏర్పడింది' అంటారు. 2009లో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఈ వ్యాసాన్ని 'పుస్తకాలం'లో చేర్చటం చలం ప్రత్యేక కృషికి నిదర్శనం.
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 'అనుభవాలూ జ్ఞాపకాలూను'లోంచి సేకరించిన భాగం 'శ్రవణానందం' పేరిట ఆకట్టుకుంటుంది. 'ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని లైబ్రరీ ఎవరికి ఏయే ఉపకారాలు చేసిందో నాకు తెలియదు కాని, ఆ లైబ్రరీ నాకు మాత్రం తెలియని లోకాలను చూపెట్టింది' అంటారు రాచకొండ విశ్వనాథశాస్త్రి.
్జ్జ్జ
''నేను చదివినదంతా నా మనసులో మెదుల్తూంది. ఋగ్వేద అగ్నిసూక్తాలు, దశోపనిషత్తులు, గీత, సంస్క ృత నాటకాలూ, సంగం యుగం నాటి పంచ మహాకావ్యాలూ, బుద్ధచరిత్ర, హిమాలయమంత పోగుపడే జైన, బౌద్ధ, వేదాంత దర్శన, శంకర గానలహరి, కబీరు, పోతన, బసవేశ్వరుడు, త్యాగరాజ స్వామి, ఆళ్వారుల మహిమాన్విత భక్తిగీతాలు- ఇవన్నీ గుర్తున్నాయి. టాగూర్‌, ప్రేమ్‌చంద్‌, శరత్‌, చలం, సుబ్రమణ్య భారతి, కేశవ్‌ సుత్‌, నజ్రుల్‌ ఇస్లాం, నిరాలా, తోరూ దత్‌, మన్‌మోహన్‌ ఘోష్‌, గోపీనాథ్‌ మొహంతి గుర్తున్నారు' అంటూ 1987లోనే ఆంధ్రప్రభ వారపత్రికలో వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన వ్యాసం మనల్ని పట్టి కుదిపేస్తుంది. నవోదయ రామ మోహనరావు 'పుస్తకాలు లేని ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించి, అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో జురాసిక్‌ టెక్నాలజీ మ్యూజియం' గురించి చెప్పిన విషయం అబ్బురపరుస్తుంది.
''నాకు నేనే నన్ను అధ్యాయులుగా చింపుకుంటున్నాను. జలజలా రాలే కన్నీళ్లు, మెలి తిప్పేసే ఆకలి, ధారలుగా కారే జ్ఞాపకాలు, ఒలికిపోయిన ప్రేమలు, అకారణ వెలివేతలు, ఒక్కో అధ్యాయంలో నిండి ఒక్కొక్కరు టాల్‌స్టారు, గొగోల్‌, దోస్తావిస్కీ, మార్య్కుజ్‌, కామూ, ప్రేమ్‌చంద్‌, మంటో, కిషన్‌ చందర్‌, తగళి, పొట్టేకాట్‌, కారంత, రావిశాస్త్రి, పతంజలి, కేశవరెడ్డి- మొత్తం వీళ్లే! ఇక నేనున్నదెక్కడీ' అంటూ 'పుస్తకాల చితి మీద నుంచి...' శీర్షికన రాసిన జె.వి.ఎన్‌.మూర్తి వ్యాసం చాలాకాలం

మనల్ని వెన్నాడుతుంది.
పదిహేడేళ్ల వయసులో చదివిన 'ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌' (అమెరికా మాజీ అధ్యక్షుడు) జీవిత చరిత్ర తనను ఎంతగా ప్రభావితం చేసిందో దేవినేని మధుసూదనరావు వివరించారు.
'నేను పుస్తకాలు లేకుండా జీవించలేను' అంటాడు థామస్‌ జెఫర్‌సన్‌. హారీ పోటర్‌ పుస్తకాలను మన పిల్లలూ విపరీతంగా కొని చదివారు. 'పోన్లే, అట్లా అయినా పిల్లలు పుస్తకాలు చదువుతున్నా'రని సరిపెట్టుకుందామంటే, 'పాతకాలపు కాన్వెంటు పిల్లలు ఆ పుస్తకాలు కొన్నారేగానీ- నారాయణ, శ్రీ చైతన్యలాంటి విద్యాసంస్థల పిల్లలు ఆ దాపులకు రాలే'దని ఓ బుక్‌షాపు ఓనర్‌ కుండబద్దలు కొట్టి మరీ చెప్పాడని కాకర్లమూడి విజరు తేల్చిపారేశారు. రోజుకు కేవలం 15 నిమిషాలైనా చదవటానికి కేటాయిస్తే, సంవత్సరానికి 1800 పేజీలు చదవగలమని బీవీ పట్టాభిరామ్‌ ఒక అద్భుతమైన చిట్కా చెప్పారు. పాటించేస్తే పోలా! నార్మన్‌ విన్సెంట్‌ పీలే రాసిన 'ది పవర్‌ ఆఫ్‌ పాజిటివ్‌ థింకింగ్‌', వేన్‌డైన్‌ 'పుల్లింగ్‌ యువర్‌ ఓన్‌ స్ట్రింగ్స్‌', ఆంథోని రాబిన్స్‌ 'అన్‌లిమిటెడ్‌ పవర్‌' వంటి పుస్తకాలు లక్షలాది ప్రజల జీవితాల్ని మార్చేశాయని పట్టాభిరామ్‌ చెప్పారు.
'లోకం కథల లతల పందిరి' అంటారు రవీంద్రనాథ్‌ టాగూర్‌. పుస్తకాలతోపాటు పెద్దలు పిల్లలకు కథలు చెప్పాల్సిన ఆవశ్యకత, తద్వారా పిల్లల్లోని సృజనశక్తులు వికసించే తీరును వివరించిన టాగూర్‌ వ్యాసం పాఠకులకు అదనపు తాయిలం.
తన తాతయ్య స్ఫూర్తితో, అమెరికాలో గ్రామగ్రామాన గ్రంథాలయాలు స్థాపించటానికి ఆస్తులు వెచ్చించిన ఆండ్రూ కార్నెజీ ప్రేరణతో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ద్వారా పదివేల గ్రంథాలయాలకు పుస్తకాలు కొనిచ్చినట్లు సుధామూర్తి చెప్పిన విషయాలు మనలోనూ కదలిక తెస్తాయి. యు.కె.లో ప్రతి ఒక్క పిల్లాడికీ ఆరు బాలల పుస్తకాలు అందుబాటులో ఉంటే, మన దేశంలో 11 మంది పిల్లలకు ఒక్క బాలల పుస్తకం అందుబాటులో ఉందని ప్రస్తావించిన సాక్షి దినపత్రిక సంపాదకీయాన్ని సైతం చేర్చటం చలం అచంచల కృషికి నిదర్శనం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి వంటి ప్రముఖ దినపత్రికలు, మరికొన్ని వార-మాస పత్రికలు పుస్తక ప్రాధాన్యంపై వెలువరించిన విలువైన సంపాదకీయాలను చేర్చి ఈ సంకలనాన్ని సంపద్వంతం చేశారు.
కె.ఎన్‌.వై.పతంజలి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, చలసాని ప్రసాదరావు, చుక్కా రామయ్య, నార్ల వెంకటేశ్వరరావు, పి.వి.సుబ్బారావు తదితరులు రాసిన వ్యాసాలు పుస్తకం విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తాయి. పుస్తకం చివర్లో అనుబంధంగా
ఇచ్చిన కవితలు, తెలుగు-ఇంగ్లిషు భాషల్లోని విలువైన సూక్తులు పుస్తకాన్ని మరింత వెలుగులో ఆవిష్కరించే దారిదీపాలు.
పుస్తక ప్రాధాన్యం గురించి మాట్లాడిన వారిలో ఎక్కువమంది చేసిన గొప్ప సూచన ఏమిటంటే- మహాత్మా గాంధీ ఆత్మకథ (సత్యశోధన) తప్పనిసరిగా చదవాలి. పిల్లలతో చదివించాలి.
'పుస్తకాలం' పుస్తకం చదివితే కొన్ని వందల మంచి పుస్తకాల పేర్లు, వాటి రచయితల గురించి కొంతయినా తెలుసుకో గలుగుతాం. చరిత్ర అట్టడుగున పడి కనిపించని కొన్ని కోణాలైనా అవగతమవుతాయి. (ఉదా: 1820 ప్రాంతంలో అమెరికాలో నల్లవారు చదువుకుంటున్నట్లు రుజువైతే బొటనవేలు, చూపుడువేలు తెగకోసేవారట) (పేజీ నం. 86)
ప్రపంచంలో తొలి పుస్తక ప్రదర్శన జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగింది. 500 ఏళ్లకు పైగా ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఏటా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన జరుగుతూనే ఉంది. మన దేశంలో కోల్‌కతాలో గడచిన నాలుగున్నర దశాబ్దాలుగా ఏటా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన జరుగుతోంది.
ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాలు, నగరాల్లోనూ పుస్తక ప్రదర్శనలకు ఆదరణ లభిస్తోంది. ఈ ఆదరం మరింత పెరగాలి. అధ్యయన దాహం పెరగాలి. పిల్లల్లో పఠనాసక్తి పరవళ్లు తొక్కాలి. పుస్తకం వెలుగులో ఈ సమాజం చైతన్యభరితం కావాలన్న సత్సంకల్పంతో జి.ఎస్‌.చలం ప్రచురించిన ఈ సంకలనం నిజంగా తెలుగువారికి ఒక వరం. మంచి పుస్తకం, విజ్ఞాన ప్రచురణలు (9440503061) సహకారంతో ఈ సంకలనాన్ని అమూల్య కానుకగా అందించటం అభినందనీయం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.