రావెల సాంబశివరావు
99590 89630
అడిగోపుల వెంకటరత్నమ్ గారి 'కొత్తగాలి'లోని కవితలు చదువుతూంటే నవయుగ కవి చక్రవర్తి జాషువా కవి కనుల ముందు నిలుస్తారు. 'వసుధ శాసింపగల సార్వభౌముండగును / ధీరుడగు, భిక్షకుండగు, దీనుడగును/ దు:ఖితుండగు నిత్య సంతోషియగును/ సత్కవి ధరింపరాని వేషములు గలవె/ అడిగోపుల కవిత్వమూ అంతే! 'పచ్చని ఆకుల పట్టు చీరె ధరించి / పసుపు పూలను అలంకరించుకొంటుంది/ ఉష్ణతాపం తట్టు కోలేని సూర్యుడు/ అప్పుడప్పుడూ చెట్టు కొమ్మల్లో దూరి/ సేద తీరుతాడు'.
చిగురించని బతుకుల్ని చిగురించిన వృక్షం చూస్తునే వుంటుంది. జననం మరణం మధ్య బెయిలు లేని, విడుదల లేని వంటింటి కారాగారంలో జీవిత ఖైదీగా మారే ఇల్లాలు కని పిస్తూనే వుంటుంది. కొండల్లో, కోనల్లో నడిచి వచ్చిన స్త్రీ మూర్తిగా సతీసహగమనంలో కాలిపోతుంది. కన్యాశుల్కం వరకట్నాల్లో సమిధైంది. సమస్త యుగాల్లో చిరంజీవిగా నిలిచింది. ఆమె శ్వాసిస్తూ మరో ప్రపంచానికి ఊపిరిలూదగలదు.
ఈయన కవిత్వం చదివిన తరువాత రకరకాల దు:ఖా నందాశ్రువులు మన మనసును వీడవు. అందులోనూ మరీ ముఖ్యంగా జాతీయ జెండాగా నిలిచిన రైతు దురవస్థ. కాలం నడుస్తున్న తీరు ఈ కవి సునిశిత విమర్శకు గురవుతుంది. నాగల్ని అంటుకట్టుకొన్న హాలికుడు ఈ కవి దృష్టిలో బలరాముని వారసుడు! ఈయన కవితల్లో యింకా 'మనకు ఎన్ని ఉగాదులు పలకరించి వెళ్ళినా/ ఎన్ని ఉదయాలు ఉదయించి వెళ్ళినా/ ఉదయించని వెతలవారు' దర్శనమిస్తారు. మారుతున్న యుగంలో మారని గమనాన్ని గుర్తుకుతెస్తూ - ఒయాసిస్సులోని నీళ్ళన్నీ ఎడారి కార్చిన కన్నీళ్ళుగా ఎడారి దు:ఖాన్ని కళ్ళకు కట్టిస్తాడు. ఇంటింటి జాబిల్లులయిన పసివాళ్ళు ఈయన కవిత్వంలో కేరింతలు కొడతారు. ఈ 'కొత్తగాలి'లో అడిగోపుల పాఠకుల్ని ఎలుగెత్తిన విశ్వగీతానికి శ్రోతలుగా మారమంటున్నాడు. చేతులెత్తి నమస్కరించి అర్థించిన వాడి చేతి నొప్పిని ఖాతరు చేయక అర్జీ అందుకొన్న చేతుల్లోని తెలివితనాన్ని, తెలివితక్కువ తనాన్ని తూర్పారబడతాడీ కవి. విలయాన్ని సృష్టించిన వరుణున్ని పగిలిన అద్దం ముక్కలో నుండి ఒకసారి తన ముఖాన్ని తాను చూసు కోవడం మంచిదని చురకేయటం కన్పిస్తుంది. స్పర్శను ఒకసారి మాటగా, ఒకసారి మౌనంగా, ప్రతిసారి ఔషధంగా తీర్చిదిద్దగల సత్తా ఈ కవిది. అందుకే ఆనందాన్ని మాటల్లో అనువదించు కోమనే ఎల నవ్వును అలా పంచటం. 'నిప్పును కనుగొన్న మానవుడు/ నాటి నుండి/ ప్రపంచాన్ని పొయ్యిలో వేసి / కాల్చటం మొదలైంది' అని భావించినా కాలం చిగురిస్తుంది అనే భరోసాను కల్పించటం బాగుంది.
ఈయన కవిత్వం మనిషికీ మనిషికీ మధ్యన మతం తన చిట్టా విప్పరాదంటుంది. అంధులకు సైతం ఈయన కవిత్వం సూర్యుణ్ణి దీపంగా చేసి చూపెట్టగలదు. ఈ కవికి కలలు కనటమూ వచ్చు. అందుకే కంచెల్లేని, కందకాల్లేని, సిపాయిల్లేని, బందూకుల్లేని దేశ సరిహద్దుల్ని కలగన్నాడు! ఈయన స్వప్నాలలో ఉప్పునీటి సముద్రం మంచినీటి సముద్రంగా మారిపోతుంది. రైతు తల గుడ్డే మకుటంగా మారాజు అవుతాడు. కలలకొక నీతి వుంది కనుక కలలు చెదిరిపోరాదనేది ఈ కవి నినాదంగా కనిపిస్తుంది. శ్రీశ్రీ సకల వృత్తుల సమస్త లక్షణాల్ని ఈ కవి తన బాణీలో 'కూడికలో తీసివేత'గా కూర్చుకొంటాడు.
'గోదావరి విలయకేళి' కవితలో - గలగలా కదలి వచ్చే గోదారి పరుగెత్తి, పరుగెత్తి పది మండలాల్ని ముంచివేసింది. ఆ సమయంలో ఈ కవి భావన ఎంత సరికొత్తగా వున్నదో చూడండి. 'అఆలు దిద్దే వయసువాడికి / ఆంగ్లచదువెందుకని / సరస్వతి పుస్తకాల్ని / నీటికి అందించింది'. 'సాయం చెయ్యని చేతులెందుకు' అనే అబ్రహం లింకన్ ఉపన్యాసాన్ని గుర్తుచేసి/ 'సాయం చెయ్యని చేతులకిప్పుడు / అగ్నిస్నానం చేయించాలి' అంటుంది లావారూపం ధరించి ప్రవహించే ఈయన కవిత్వం. కర్తది బరువు/ కర్మది భారం/ క్రియది విషాదం అంటూ సరికొత్త వ్యాకరణాన్ని బోధిస్తుంది. అయినా / 'అమ్మ ఆవు / ఇల్లు ఈగ చదువుతూ / ప్రాథమిక విద్యాసౌధంలో / మాతృభాష మల్లెల సౌరభం' శ్వాసించే గుణం కూడా ఈయన కవిత్వపు సొత్తే. 'గాయకుల సమిష్టి కృషి / పాటను పోత పోస్తే' చూడాలనుకునే నైజం ఈయన కవిత్వానిది. 'అస్తమయం/ ఉదయం మధ్య/ జాగరూకతే నమ్మకం' అని కూడా గుర్తు చేస్తుంది.
ఆధునిక కవిగా ఈయన ఎంతటి ఆదర్శవాదో అంతటి ప్రకృతి ప్రేమికుడు. నీటిని నాట్యమయూరిగా, మాయల మారిగా, విధ్వంసకారిగా, సుఫలధారిగా వివరిస్తూ అరవై నాలుగు కళల్నీ నీటికి అంటుకడతాడు. ఈయన కవిత్వంలో నిత్య కల్యాణం, పచ్చతోరణంగా సంస్కృతిని పంచే పల్లెటూళ్ళు దర్శనమిస్తాయి. అయితే పడవకు, తీరానికి, కాడికి, అర్రుకు, కలానికీ, కరానికీ గల బంధం సన్నగిల్లటాన్ని చూచి ఈయన కలం కన్నీరొలుకు తుంది.
ఆకాశం పాతదే. అయినా ఎప్పటికప్పుడు అది కొత్తగా కనిపిస్తుంది. గాలి పాతదే / అయినా మలయమారుతం/, వడగాలి, చలిగాలి అంటూ ఎన్నెన్ని సరికొత్త వేషాలో ఋతువు ఋతువునా ప్రతి సంవత్సరం. నేల పాతదే కాని పండించే పద్ధతులు సరికొత్తవైనప్పుడు పండేది నిక్కంగా ముక్కారు పంటలే! సంగీతం పాతదే కావచ్చు కాని సరికొత్త యమకాలు, గమకాలు వినూత్న రాగాలకు స్వాగతం పలుకుతాయి. రాజ్యం పాతదయినా కొత్త రాజ్యాంగాన్ని అంటుకడితే సరికొత్త వసంతమే అనేది ఈ కవి ఆశ, ఆశయం కూడా.
ప్రజాస్వామ్యానికి సూత్రాలు సంధిస్తూ, వాటికి స్పందిస్తూ మనిషి అలసిపోయాడు. 'చైతన్యం పల్లవించి/ ఎలుగెత్తిన చోట/ మారణకాండై మనిషి మాయం కారాదన్నది/' ఈ వామపక్ష అభిమాని ప్రగాఢ వాంఛ. 'కాలాన్ని మింగిన పరిశ్రమకు/ గడియారంపై అంకెలు కనపడవు' అంటాడీ శ్రామికవర్గ పక్షపాతి. 'శ్రమ ఉపశమనానికి జాబిల్లి దివ్యౌషధం' అంటూ మళ్ళీ ముంతకజ్జాయపు రుచుల్ని అందింపజూస్తుంది ఈయన కవిత్వం.
'ఆసుపత్రి కనువిప్పదు/ అధికారం నోరు మెదపదు / చోదకులదే పాలన/ సారధులదే శాసనం' అంటూ నడుస్తున్న భారతం కవితలో రోగుల అవస్థలు కళ్ళకు కట్టిస్తాడు. అయితే అదంతా చూస్తూ కూడా ఆయనకు మౌనం కప్పుకొన్న మనిషిని చూస్తే ఈసడింపే. ఈయన కవితల నిండా ఎన్నెన్ని దృశ్యా దృశ్య దు:ఖాలో! యుద్ధాల్లో మంచి యుద్ధాలు వుండవనేది జగ మెరిగిన సత్యమే. 'యుద్ధం ముగిసాక' రొమ్మిరిసిన రెండు దేశాలు శిథిలాల్ని వెతుక్కోవాల్సిందే. ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలు శకలాలు గా చరిత్రకెక్కాల్సిందే. యుద్ధంలో విజయాలుండవు. అటూ ఇటూ పరాజయాలేనని ఫక్కున నవ్వుతాడు.
ఈయన కాలచక్రం 'ఒకసారి ఆనందాశ్రులై/ ఒకసారి దు:ఖాశ్రులై' కన్పిస్తుంది. 'గంటగంటకు రాగాలాపనై అప్రమత్తం చేస్తుంది. బొజ్జ నిండిన పాప ఉయ్యాల్లో చేసే సంగీత సాధన శాస్త్రాల్లో లేని రాగాలను రాగ రంజితం గావిస్తాయి'. ఈ కవి దృష్టిలో వాహ్యాళి చెయ్యటమంటే / కేవలం శరీర వ్యాయామం కాదు/ మనస్సులోని సంగీతం మోసుకురావటం. ఆకలి గొన్న భిక్షగాడు సొరకాయ బుర్రకు బిగించిన తీగను / వాకిట నిల్చి మీటితే/ మదిని కదిల్చిన సంగీతాలు వినిపిస్తాయి/ మెతుకు విదిల్చిన కరాలు కన్పిస్తాయి/ 'సరిగమలు'గా! ఉభయ సంధ్యల మధ్య ఎంతటి ప్రకృతి విన్యాసం. 'చూసి నడువు నాయనా!' అనే మాట అమ్మ సమాధి నుండి విన్పించటమంటే శోకం నుండి శ్లోకం తన్నుకు రావటం కాదా' అన్పిస్తుంది. అలాగే 'నాణేనికి మరోవైపు' చూపిన ఈ బాణీనేమనాలి? మండు వేసవిలో కులూ మనాలీలో కులుకుతున్నట్లుగా వుంటుంది! 'ఉభయ సంధ్యల మధ్య' ప్రకృతిది ఎంతటి విన్నాణమో!
ఈయన కవిత్వం ఎల్లప్పుడు విరుచుకుపడుతూ అలాగే వుండిపోదు. అభ్యర్థనలతో ఆదుకోగలదు కూడా. ఈ కవితామ తల్లి ఎంతటి శక్తిమంతురాలయినా 'సూర్యుణ్ణి ఈరోజు ఉష్ణం తగ్గించు నాయనా అంటే - మేఘాల్ని కప్పుకొన్న సూర్యుడు నేలపై చలువ పందిళ్ళు పరుస్తాడు'. ప్రయాణంలో పదనిసలు ఒకరు చెప్తే వినేవి కావు.. ఎవరికి వాళ్ళు స్వయంగా చదువు కోవాల్సిందే. బాధ్యత గల కవిగా ఈయన కూడా నూతన శకానికి రారమ్మని స్వాగతం పలికాడు. అయితే మనిషిని చూస్తే భయం, చేయి కలిపితే భయం భయంగా వున్న రోజులవి. అలా ముఖాలకు గుడ్డలు చుట్టుకొని, మూతులు కట్టుకొని కూడా స్వాగతం పలకడం జరిగింది.
ఒకానొక కోపానికి బలై.. కుక్క మూడు కాళ్ళ జంతువైనా.. గురి తప్పని వేటగాడి బాణం గూట్లో పక్షి రెక్కను తెగేసినా/ గాలి కుంటుతో ఎద్దు నడక పట్టుతప్పినా.. వాటన్నింటినుండి గట్టెక్కిన రైతు తలగుడ్డలోని రాజసాన్ని చూడగలవాడీ కవి. 'సగానికి సగం చెట్టు నరకబడినా తిరిగి చిగురిస్తుంది'లే అనే భరోసా - ఎంతయినా ఋతుధర్మం తెలిసిన వాడు కదా! అయినా ఈయన కవిత్వంలో భూమి పిడికిలి బిగించక మానదు - అబద్ధాల ద్విపాత్రాభినయాన్ని చూసి పంజరాన చిలకలు చదివిన వారికి స్త్రీ స్వేచ్ఛకు ఈ కవి ఎంతగా కంకణం కట్టుకున్నాడో అవగత మవుతుంది. 'ఆమె ఒకసారి వంటగది పంజరం / ఒకసారి పడకగది పావురం / ఒకసారి వడ్డన గది బొంగరం... విశాల విశ్వంలో ఆమె చెదిరిన చిత్రం.' 'నేను విశ్వమేఖల / నాది విశ్వశాంతి' అని ప్రకటించుకొన్న కవి అడిగోపుల. పాదంలో బొటనవేలు స్థానాన్ని తన వచన పద్య పాదంలో ఎంత బాగా బిగించాడో... ఈ కవికుల అధినాయకునికి జయహో...!
అడిగోపుల 'కొత్తగాలి' కవులపాలిటి ఏరువాక. సమస్త ఉపమానాలు కొత్తగాలి చుట్టూ గిరికీలు కొడుతుంటాయి.
''దారులన్నీ మూసుకున్నాక / మార్గావిష్కరణే కొత్తగాలి
చూపులన్నీ మసకేశాక / క్రాంతి కావడమే కొత్తగాలి
మాటలన్నీ మూగబోయాక/ గర్జించటమే కొత్తగాలి
కొత్తగాలిని స్వయంగా ఆస్వాదించేందుకు సిద్ధం కండి.
(కొత్తగాలి : అడిగోపుల వెంకటరత్నమ్, సెల్: 9848252946,
పుటలు 144, వెల రూ. 150. ప్రతులకు : ప్రజాశక్తి, విశాలాంధ్ర బ్రాంచీలు)