డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
94407 32392
శ్రీరంగపట్నం వద్ద కావేరి నదీతీరం
పుస్తకాలు జ్ఞానాన్ని ఇస్తాయి, మానవ స్పందనలను ద్విగుణీకృతం చేస్తాయి! ఆలోచనలు, చర్చలు అంతర్గత కోణాలను బట్టబయలు చేసే అవకాశం ఉంది! అయితే పర్యటనలు, ప్రత్యక్ష అనుభవాలు కల్పించే వెసులుబాట్లు అదనంగా చాలా వుంటాయి. పుస్తకాలు వ్యక్తుల ఆలోచనలకు ఆనవాళ్ళు కనుక, సదరు రచయిత చూసిన లేదా వ్యక్తపరచిన విషయాలను, ఆలోచనలను పాఠకులు తమ అనుభవం, ఆసక్తి, ఊహ ఆధారంగా అందుకోవడం తప్పనిసరి. అందు వల్ల అర్థం కాని, బయటకు కనబడని పరిమితులు ఎన్నో ఏర్పడతాయి. ఇవి వ్యక్తికీ వ్యక్తికీ పూర్తిగా కూడా మారవచ్చు. కనుకనే జ్ఞానంతో కూడిన అనుభవం చాలా ఉత్తమమైనది!
మిగతా వాళ్ళకు ఎటువంటి అనుభూతినిస్తుందో తెలియదు కానీ బెంగుళూరుకు వంద కిలోమీటర్ల ప్రాంతంలో వుండే హిందూపురం చుట్టుపక్కల తొలి పదిహేడు, పద్దెనిమిదేళ్ళు గడిపిన నాకు మైసూరు చాలా రకాలుగా కనపడుతూ వుండేది! మైసూరు పాకు, మైసూరు చారు, మైసూరు బోండా ఇలాంటివి తిండి పదార్థాలు కాగా- మైసూరు సిల్కు, మైసూరు సిల్క్ చీరలు, మైసూరు అగరుబత్తులు, మైసూరు శాండల్ సోపు మొదలైనవి మరికొన్ని సందర్భాల్లో వినబడుతుండేవి, కనబడుతూండేవి. వీటికి మించి కొలతకు (మా కొనతట్టుపల్లె ప్రాంతంలో) సుమారు లీటరు పరిమాణాన్ని సేరుగా పరిగణించేవారు. అయితే మైసూరు సేరని వేరే కొలత కూడా వుండేది. అంటే అది సవాసేరు లేదా సేరున్నర! అలాగే దంతాలు, రోజ్వుడ్, ప్యాలెస్, మహరాజు అంటూ కూడా మైసూరు ప్రస్తావన వస్తూండేది. లేపాక్షి నంది విషయం వచ్చినప్పుడు మైసూరు చాముండీ కొండల్లో వుండే నంది గురించి కూడా చర్చకు వచ్చేది!
నిజానికి మా వూరికి మైసూరు మహా దూరం ఏం కాదు. మా పల్లెకు బెంగుళూరు 120 అయితే, మైసూరు ఆ బెంగళూరుకు అంతకు కొంచెం ఎక్కువ- అంటే 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే మైసూరు వెళ్ళే అవకాశం లేదు, గనుక అప్పటికి కోరికా లేదు. సరిగ్గా పదేళ్ళ క్రితం 2013 మార్చిలో ఓ నాలుగైదు రోజులపాటు మైసూరులో ఉన్నాం. ఆ సమయంలో నేను కడప ఆకాశవాణి కేంద్రంలో పనిచేస్తున్నాను. అప్పట్లో మైసూరు వెళ్ళడానికి కారణం కందాళ శ్రీనివాసాచార్య. వీరు నేను తిరుపతిలో ఎమ్మెస్సీ చదివే 1985-86 కాలంలో పరిచయమైన మిత్రులు. నేను తిరుపతిలో వుండగానే, యుపిఎస్సీ ప్రకటన ఆధారంగా తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ వున్న శ్రీనివాసాచార్య సెంట్రల్ ఇనిస్టిట్ట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (సిఐఐఎల్, మైసూరు)లో ఉద్యోగంలో చేరారు. ఆయన మైసూరు వెళ్ళిన కొంతకాలానికి ఆకాశవాణి ఉద్యోగంతో నేను గోవా వెళ్లిపోయాను.
దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత నేను హైదరాబాదులో పనిచేస్తున్నప్పుడు డా శ్రీనివాసాచార్య ఆచూకీ తెలిసింది. వారు మైసూరు వచ్చి వెళ్ళమని ఎన్నోసార్లు చెబుతూ వచ్చారు. ఫలితంగా తర్వాత 2013లో మైసూరు వెళ్ళి డా. శ్రీనివాస్ అతిథిగా సిఐఐఎల్ సంస్థ గెస్ట్ హౌస్లో ఆ నాలుగైదు రోజులు గడిపాం. ఇలా వెళ్ళినప్పుడు మా ఇద్దరికీ భక్తి కన్నా విజ్ఞానం, విహారం అనే పద్ధతిలో మా పర్యటనల్ని మార్చుకుంటూ వుంటాము. దీన్ని నా చదువు, ఉద్యోగం, రాత ఎంతో తీర్చిదిద్దాయి. పదేళ్ళ క్రితం మైసూర్ వెళ్ళినప్పుడు మైసూరు ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్, శ్రీరంగ పట్టణం, టిప్పుసుల్తాను కోట ఇంకా మేల్కోటే పట్టణంలోని చెలువ నారాయణస్వామి ఆలయం, అకాడమీ ఆఫ్ శాన్స్ క్రిట్ రీసెర్చి ఇవి కాకుండా మైసూరు దగ్గర్లో వున్న చాముండీ హిల్స్, నంజనగూడు; వంద కిలోమీటర్లు మించి దూరం వున్న వూటీ ఇలాంటివి చూశాం. ఈసారి వాటన్నిటినీ పరిహరించి మిగతా వాటిని చూడాలని అనుకున్నాం గానీ పటిష్ఠమైన ప్రణాళిక వేసుకోలేదు. మైసూరు అనగానే 1916 లో మొదలైన మైసూరు యూనివర్సిటీ, బియస్సీ ఇడి, బి.ఏ. ఇడి కోర్సులను కలిగి వుండే మానస గంగోత్రి కళాశాల, భారతీయ భాషల సంస్థ ఇలాంటివి.. ఇంకా ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ థెరపీ, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసర్చి ఇనిస్టిట్యూట్ వంటి సంస్థలున్న నగరంగా మైసూరు అంటే అదనపు గౌరవం! నిజానికి మైసూరు 1399 నుంచి 1948 దాకా ఆ ప్రాంతానికి రాజధానిగా కొనసాగింది. కనుక మహారాజా కాలేజీ, మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రారంభించిన సంస్థలు వంటివి చాలా ఉన్నాయి. రాజధాని బెంగుళూరుకు తరలిపోవడంతో ఈ నగరం అభివృద్ధి కొంచెం మందకొడి అయినా, గత డెబ్బయి ఏళ్ళలో కాలుష్యం తక్కువగా వున్న నగరంగా, రిటైర్ అయిన వారి నిలయం గా మారిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్లాస్టిక్ వాడకాన్ని దాదాపు నియంత్రించడం, జ్యూస్ తాగడానికి ఇచ్చే గొట్టాలు కూడా కాగితం తయారీకి కావడం విశేషం.
పదేళ్ళక్రితం చూసినప్పుడు నాకు స్ఫురించలేదు కానీ, ఈసారి గమనిస్తే మైసూరు, చంఢగీర్ నగరంలా నాకనిపిం చింది. చంఢగీర్ మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక నిర్మించు కున్న నగరం. ఈ నగరం మధ్యలో పెద్ద పెద్ద చెట్లు వుండే తోటలు ఎన్నో కనబడ తాయి. ఈ మైసూర్ నగరం పూర్తి టొపోగ్రఫీ గురించి చెప్పలేను కానీ, ఇక్కడ కూడా చెట్లు, తోటలు చాలా కనబడతాయి. అదే సమయంలో బెంగుళూరు కన్నా ఓ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత సగటున ఎక్కువ వుంటుంది కనుక నివాసానికి చాలా అనుకూలం గా వుంటుంది. ఇప్పుడు మైసూర్ కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు, హుబ్లీ - ధార్వాడ నగరాల తర్వాత మూడో పెద్ద నగరంగా నిలుస్తోంది. సంస్క ృతీ ప్రతీకగా ఉంటూ సాఫ్ట్వేర్ రంగంలో కర్ణాటకలో బెంగు ళూరు తర్వాత స్థానం ఆక్రమించింది కానీ ట్రాఫిక్ సమస్య దాదాపు లేకుండా హాయినిస్తోంది. బెంగుళూరులో లాగా కాకుండా ఎయిర్ పోర్టు మైసూరులో కొంచెం దగ్గరగా వుంటుంది.
2023 సంక్రాంతికి మేము వెళ్ళాలనే ఆలోచన ఉమేష్, రాజేశ్వరి దంపతులది. కదిరి ప్రాంతానికి చెందిన తెలుగు కుటుంబం కోలారు, శ్రీనివాసపుర ప్రాంతానికి ఎప్పుడో తరలి వెళ్ళి, 9 దశాబ్దాల క్రితం ఉపాధి కారణంగా బెంగుళూరులో స్థిరపడింది. అటువంటి కుటుంబంలో జన్మించిన సూత్రం ఉమేష్ నాతో పాటు 1991లో యుపిఎస్సి ద్వారా ఆకాశవాణి/ దూరదర్శన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా ఎంపికైన రంగస్థల ఔత్సాహిక కళాకారుడు (అప్పటికి). నంద్యాల ఇంటి పేరుగా వుండే శ్రీమతి రాజేశ్వరి పూర్వీకులు కర్నూలు ప్రాంతం వారు. కనుక ఈ దంపతులు ఇరువురూ ఇంట్లో తెలుగు మాట్లాడే వ్యక్తులు! ఇప్పుడు మైసూరులో ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారు.
ఆకాశవాణి/దూరదర్శన్లో నాలుగు దశాబ్దాల క్రితం కొందరు ఘనాపాటీలు రహస్యంగా చేసిన ఘనకార్యాలతో ఈ నలభై ఏళ్ళ కాలంలో నాలుగు విడతలుగా 1983-91 మధ్య కాలంలో ఎంపికైన ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్స్ సర్వీసులో చాలా రకాలుగా నష్టపోయారు. ఈ విషయాలు సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత (అంటే 2006 తర్వాత) ఓ మాదిరిగా బోధపడటం మొదలైంది! ఫలితంగా కొంత ఆలోచన మొదలై ఈ విషయాలు చర్చించుకోవడానికి తరచు కలిసేవాళ్లం. అలా 2014-15 ప్రాంతంలో ఉమేష్ బెంగుళూరు నుంచి మదరాసు వచ్చి మా సహౌద్యోగులను కలిశారు. తెలుగు మాతృభాష కారణంగా మా స్నేహం మొదలై ఇద్దరి స్వభావాలరీత్యా బలపడింది. అంతలో నేను తిరుపతికి మదరాసు నుంచి బదిలీ మీద వచ్చాను. తను సకుటుంబంగా బెంగుళూరు నుంచి తిరుపతి వచ్చి, తిరుపతి నుంచి మేం నలుగురం మదరాసు వెళ్ళాలని ప్రణాళికలు వేసుకున్నాం. అయితే అవి సాకారం కాకముందే ఉమేషుడికి అండమాన్ దీవుల్లోని పోర్టుబ్లయర్ ఆకాశవాణికి బదిలీ అయ్యింది. నన్ను బదిలీ మీద గానీ, పర్యటనగా గానీ పోర్టు బ్లయర్ ఉమేష్ రమ్మనేవారు. అయితే అవి రెండూ సాధ్యం కాకముందే నేను హైదరాబాదుకు బదిలీ మీద వచ్చేశాను. తరువాత కొంత కాలానికి తను మైసూరు ఆకాశవాణికి కేంద్ర నిర్దేశిత బాధ్యతల మీద వచ్చారు. ఒకవైపు కోవిడ్, ఇంకోవైపు తన బదిలీ, మరోవైపు నా పదవీ విరమణతో ఆ దంపతులను కలిసే వీలు 2023 జనవరిలోనే సాధ్యమైంది. ఇదీ, మా మైౖసూరు ప్రయాణం నేపథ్యం!
జనవరి 11న సాయంకాలం 7 గంటలకి కాచిగూడా- మైసూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో రిజర్వు చేసుకున్న కంపార్ట్ మెంట్లో ప్రవేశించాం. ఈ రైలు మాకు చిరపరిచితమైన జడ్చర్ల, మెహబూబ్నగర్, కర్నూలు, డోన్ (ద్రోణాచలం), గుత్తి, అనంతపురం, ధర్మవరం పెనుకొండ, హిందూపురం గుండా ప్రయాణం చేసి పిమ్మట దొడ్డ బళాపురం, బెంగుళూరు, రామ్ నగరం, మాండ్య మీదుగా ఉదయం 9.30కు మైసూరు జంక్షన్ చేరింది. జనవరి నెల, బెంగుళూరు ప్రాంతం, వేగంగా కదిలే రైలు కనుక శృతిమించిన చల్లదనాన్ని భరించక తప్పలేదు! ముందు రోజు హాయిగా రైలుపెట్టెలోకి ఎక్కిన తర్వాత సిద్ధం చేసి తెచ్చుకున్న భోజనాన్ని కానించి హాయిగా పడుకుంటే బెంగుళూరు రాకముందే మనం లేచిపోక తప్పదు. ఇక బెంగు ళూరు నుంచి కెంగేరి, రామ్ నగరం, మాండ్య ఈ స్టేషన్లలో బాగా పేరుమోసిన మద్దూరి వడలు, తట్ట ఇడ్లీలు, దోసెలు ఇలా అన్నీ టేస్టు చేస్తూ టిఫిన్ అయిపోయిందనిపించాం. తెలిసిన మిత్రుడున్నాడు కనుక ఎలాంటి సమస్య కూడా లేకుండా గంట లోపే విజయనగర ఏరియాలో వుండే వారి నివాసానికి వెళ్ళాం.
అప్పటికి ఒక్క రెండురోజులు సంబంధించి కూర్గు వైపుకు ప్రయాణం అనుకుని మడికెర వైపుకు నిర్ణయించుకున్నాం. దానికి సంబంధించి వారం క్రితమే అక్కడి రిసార్ట్సులో అకామొడేషన్ బుక్ చేసుకున్నాం. కనుక మొదటిరోజు మధ్యాహ్న భోజనం తరువాత శ్రీరంగపట్టణం, కావేరీ నదిని చూడాలని నేనూ, మా ఆవిడ హంస టాక్సీలో బయల్దేరాం. పది, పదిహేను కిలోమీటర్ల దూరంలో వుండే శ్రీరంగపట్టణం కోట, టిప్పు సమాధి ఇదివరకే చూశాం గనుక అప్పుడు మిస్సయిన రంగనాథస్వామిని, గుడిని ఇప్పుడు చూడాలని మొదట నైమిషాంబా దేవి గుడికి వెళ్ళాం. అది కావేరీ నది ఒడ్డునే వుంటుంది. కృష్ణానది, గోదావరీ నది, ప్రకాశం బ్యారేజ్, నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్ చూసిన నాకు కావేరీ నది ఏమాత్రం ఉత్సాహాన్ని కానీ, ఆనందాన్ని కానీ కలిగించలేదు. రంగనాథస్వామి ఆలయాన్ని చూసుకుని మా మిత్రుడి నివాసానికి వెళ్లేముందు 'రంగాయన' వెళ్ళాము.
మధ్యాహ్నం కావేరి నది వైపు వెళ్ళినప్పుడు తారసపడిన మైసూర్ ఆకాశవాణి భవనం లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళగానే మా మిత్రుడు ఉమేశ్ ఆఫీస్ రూం పక్కనే ఉన్న 'నాదాలయ' నన్ను ఆకర్షించింది. అది ఇటీవల కాలంలో వచ్చిన అదనపు సోయగం. నిజానికి అన్ని పెద్ద ఆకాశవాణి కేంద్రాల్లో సంగీత వాయిద్యాలు ఉంచడానికి ఓ గది కేటాయిస్తారు. ఈ కేంద్రంలో దాన్ని అందంగా అర్థవంతంగా సంగీతకారుల ఫోటోలు, సమాచారం తో పాటు గదిని సంగీత వాయిద్యాలుంచే రీతిలో మేళవించారు! అదీ మైసూర్ ఆకాశవాణి ప్రత్యేకత.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ నాటకరంగ శాఖ నిర్వహణలో నడిచే 'రంగాయన' పేరెన్నికగన్న జాతీయస్థాయి రంగభూమి. 'బహురూపి' పేరున ప్రతిఏటా సంక్రాంతికి పలు భారతీయ భాషల నాటక ప్రదర్శన సంక్రాంతికి వుంటుంది. అయితే 2023లో కర్ణాటక రాష్ట్ర విధాన సభ ఎన్నికల దృష్ట్యా ఈసారి 2022 డిసెంబర్ 8-15 తేదీల మధ్య ఈ 'బహురూపి' ఉత్సవం జరిగింది. మొన్న జరిగిన ఉత్సవంలో ఏడు రాష్ట్రాలకు చెందిన, ఏడు భాషల నాటకాలతోపాటు కన్నడ, తుళు భాషల్లోని పన్నెండింటితో కలిపి మొత్తం 20 నాటక ప్రదర్శనలు జరిగాయి. ఏకకాలంలో వేర్వేరు వేదికలపై ఈ జాతీయ నాటకాలతోపాటు మంచి చర్చలు, సినిమా ప్రదర్శనలు, జానపద కళా ప్రదర్శనలు, యక్షగానాలు, పుస్తక హస్తకళల ప్రదర్శనలు, భోజనాలయాలు ఎంతో ఆకర్షించాయి.
1989లో బి.వి.కారంత్ పూనికతో మొదలైన ఈ 'రంగాయన'లో సంవత్సరం పొడవునా రంగస్థలం సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూంటాయి. పిల్లలకు, కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు, దసరా పండుగకు, ఇంకా సుబ్బయ్య నాయుడు, బెంగళూరు నాగరత్నమ్మ పేరున నాటక ప్రదర్శనలకి సంబంధించిన చర్చా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ 34 ఏళ్ళకాలంలో సుమారు 110 నాటక ప్రదర్శనలు జరిగాయని 'బహురూపి' కార్యక్రమం తాజా ఆహ్వాన పత్రిక చెబుతోంది. మామూలుగా అయితే ఈ కార్యక్రమం లేకపోతే రంగాయనకు తాళాలు వేస్తారు. ఆ రోజు ఒక ప్రైవేటు స్కూలు సంబంధించిన కార్యక్రమం జరుగుతోంది కనుక అక్కడ ఉన్న ఏర్పాట్లను కొద్దిగా పరిశీలించి తృప్తిపడ్డాను. అదే సమయంలో మున్ముందు సంక్రాంతి సమయంలో ఒక వారం పాటు వచ్చి ఈ బహుభాషల నాటకాలని చూడాలని నిర్ణయించుకున్నాను.
(ఇంకా ఉంది)