భాషా దోషాల నివారణకు జాగ్రత్తల సూచి

దొండపాటి కృష్ణ
90523 26864

ప్రస్తుతమున్న శాస్త్ర సాంకేతిక, పోటీ ప్రపంచంలో మాతృభాషలో నెగ్గుకురావడం కష్టమని చాలామంది అభిప్రాయం. అదే నిజమనుకుంటే పరభాషలు రానివారు ఎలా మనుగడ సాగించగలుగుతున్నారనేది సమాధానం లేని ప్రశ్న. పరభాష అనేది మనం నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరడానికి ఊతమందించే చిన్న ఉపకరణం మాత్రమే! అదే పూర్తి జీవితం, జీవనమూ కాదు.
కథలు, కవిత్వం, నవలలు... ఏదైనా సాహిత్య ప్రక్రియలో మనమెంత అందుబాటులో ఉన్నామనే అంశం మీద తెలుగు భాష అస్థిత్వం ఆధారపడి ఉంటుంది. దాన్ని గుర్తించి తెలుగు భాషలో రచనలు చేస్తూ అందుబాటులో ఉండాలి. విరామ చిహ్నాలు వాడకపోతే ఏమవుతుందిలే, మనం చెప్పాలనుకున్న విషయం చేరిపోతోంది కదా, అనుకుంటే పొరబాటే...
''నేను దుకాణానికి వెళ్లాను అక్కడ లడ్డూలు పాలకోవా జిలేబిలు ఉన్నాయి అబ్బా అవన్నీ ఎంత బాగున్నాయో''
ఈ వాక్యంలో ఒక్క విరామ చిహ్నం కూడా వాడలేదు. మనమేం చెప్పాలనుకుంటున్నామో, అదే విషయం అవతలి వ్యక్తికి సూటిగా చేరుతోందా? అనేది ఆలోచిస్తే 'లేదనే' చెప్పాలి. పుల్‌ స్టాప్‌, కామా, ఆశ్చర్యార్థకంలాంటి విరామ చిహ్నాలు వాడకపోవడం వల్ల చదవడంలో కొంత గందరగోళం ఏర్పడుతోంది. ఇదే వాక్యాన్ని విరామ చిహ్నాలతో రాస్తే...
''నేను దుకాణానికి వెళ్లాను. అక్కడ లడ్డూలు, పాలకోవా, జిలేబిలు ఉన్నాయి. అబ్బా! అవన్నీ ఎంత బాగున్నాయో!''
ఇప్పుడీ వాక్యానికి పరిపూర్ణత వచ్చింది. 'నేను దుకాణానికి వెళ్లాను.' అనే వాక్యం తర్వాత పుల్‌ స్టాప్‌ పెట్టడం వల్ల వాక్యం పూర్తైనట్లు, క్రియ ఏం జరిగిందో తెలుస్తోంది. 'అక్కడ లడ్డూలు, పాలకోవా, జిలేబిలు ఉన్నాయి.' అనే వాక్యంలో కామాలు, పుల్‌ స్టాప్‌ పెట్టడం వల్ల అక్కడ ఏమేమి ఉన్నాయో తెలుస్తోంది. 'అబ్బా! అవన్నీ ఎంత బాగున్నాయో!' అనే వాక్యంలో అవి ఎలా ఉన్నాయో అనుభూతితో చెప్పినట్లు తెలుస్తోంది. ఏ విరామ చిహ్నం ఎక్కడ వాడాలో రాసేవారికి స్పష్టమైన అవగాహన అవసరం. విరామ చిహ్నాలు వాడటం వల్ల అర్థవంతమైన వాక్యం నిర్మాణమవుతుంది. ఇదే వాక్యానికి విరామ చిహ్నాలు పెట్టాల్సిన చోట పెట్టకుండా మరోచోట పెడితే అర్థమే మారిపోయే ప్రమాదముంది.
సామాజిక మాధ్యమాలు పెరిగాక రాయడమనేది విస్తతమైంది. మొబైల్‌ ఫోన్‌ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడంతో మనం పంపాలనుకున్న సందేశం క్షణాల్లో చేరిపోతోంది. అందునా సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం బట్వాడా విపరీతంగా జరుగుతోంది. ఈ ప్రాసెస్‌ లోనే తెలుగులో రాసేవాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇలా సంబరపడేలోపే విశ్వవ్యాప్తం అవుతోన్న తెలుగు భాష లిపిలో అక్షర దోషాలు చంద్రుడిలో మచ్చలా మిగిలిపోతున్నాయి. మన తప్పిదాన్ని ఫోన్‌ మీదకు నెట్టేయ్యడం బాధ కలిగిస్తోంది. 'మా ఫోన్‌ కీబోర్డులో సరైన ఫీచర్స్‌ లేవ'ని అక్షర దోషాలను పట్టించు కోకుండా పంపేస్తున్నారు. రాసేటప్పుడు వ్యాకరణం సరిగ్గా ఉందో లేదో చూసుకోకుండా పంపడం పూర్తిగా మన తప్పే అవుతుంది.
మన పక్కన 'అక్షర సుమాలు' అనే పుస్తకం ఉంటే ఆ ఈ తప్పిదాల నుంచి తప్పించుకోవచ్చు. అదెలాగో ప్రముఖ రచయిత్రి నండూరి సుందరీ నాగమణి ఈ పుస్తకంలో చక్కగా వివరించారు. ఈ పుస్తకం అధ్యయనం చేయడం మూలంగా మన తప్పులను సరిచేసుకునే మార్గం తెలుస్తుంది.
''తెలుగుభాష పట్ల నాగమణికి గల అభిమానం, ఆరాధన అపరిమితం. ఎవరే చిన్న తప్పు రాసినా, దాన్ని సరిచేయాలన్న తపన, ఆ తప్పు పునరావృతం కాకూడదన్న కోరిక వీరిలో మెండు. ఎదుటివారు విసుక్కుంటారేమోనన్న భయంగానీ, ఆ కారణంగా తనను ద్వేషిస్తారేమోనన్న శంకగానీ నాగమణి లో అణుమాత్రం కూడా కానరావు. కేవలం దోషరహితమైన తెలుగును అందరూ అలవరుచుకోవాలన్న కోరికే తప్ప, వ్యక్తులను ద్వేషించని మంచి మనస్తత్వం ఆమె స్వంతం'' అని రచయిత్రికి గల భాషాభిమానాన్ని సమకాలీన రచయిత గండ్రకోట సూర్యనారాయణ శర్మ తన ముందుమాటలో వ్యక్త పరిచారు.
ఇది ముమ్మాటికీ నిజం. రచయిత్రితో పరిచయమున్న ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ధృవీకరిస్తారు. ఆమెతో పరిచయం పెరిగితే మనం చేసే రచనల్లో అక్షర దోషాలు లేకుండా చూసుకోవడం అలవడుతుంది. ఆమెతో పరిచయం అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టే ఇలా 'అక్షర సుమాలు'గా మన ముందుకొచ్చారు.
'తెలియక కొందరు, తెలిసి కొందరు, తెలిసీతెలియక కొందరు, నిర్లక్ష్యం వల్ల కొందరు తప్పులు రాస్తున్నారు. రాసిన తప్పులన్నీ అలాగే ప్రచురితమైపోతే, రేపు అవన్నీ తప్పులతోనే పుస్తకాలుగా రూపు దిద్దుకుంటే, భావితరాలకు అందే ఈ పుస్తకాల్లో ఉన్నదే అసలైన తెలుగని, దోషభూయిష్టమైన పదాలను సరైనవిగా రేపటి పాఠకులు నేర్చునే ప్రమాదముంది. దీన్ని నివారించాలంటే ఏమి చేయాలి?' అన్న ఆమె ఆలోచన అక్షర సుమాలుగా రూపుదిద్దుకుందేమో అన్పిస్తోంది.
''ఏ యువత అయితే నవీన సాంకేతిక పరిజ్ఞానంతో తమ భావాలను తెలుగులో వ్యక్తం చేస్తున్నారో, వారందరికీ సరైన మార్గదర్శనం చేయాల్సిన ఆవశ్యకత ఇప్పుడొచ్చింది. వాక్యనిర్మాణం గురించి, విరామ చిహ్నాల గురించి, ప్రశ్నార్థ కాలు- వాటి వినియోగిత గురించి, లేదా ఉటంకింపులు గురించిన విషయాలను సోదాహరణంగా సులభగ్రాహ్యంగా తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. చెప్పదలుచుకున్న అంశం ద్వారా వ్యక్తం చేస్తున్నామనే విషయంలో ఎలాంటి వాక్య నిర్మాణం ఉండాలనే అంశాల గురించి ప్రస్తుత ఇంటర్నెట్‌ ఆధారిత యువతరానికి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.'' అన్న తెలంగాణా ప్రభుత్వం, భాషా సాంస్క ృతిక విభాగం సంచాలకులు ూమిడి హరికృష్ణ నొక్కి వక్కాణించడం ద్వారా ఈ పుస్తకం రావాల్సిన ఆవశ్యకతను గుర్తెరగవచ్చు.
ఈ పుస్తకం ఎవరినీ కించపరచదు. ఓవర్‌ లుక్‌లో దొర్లిపోయే అక్షర దోషాల్ని పట్టి మన ముందు పెట్టటానికి దోహదపడుతుంది. ప్రస్తుతం ఇటువంటి పుస్తకం ఆవశ్యకత ఎంతైనా ఉంది. పుస్తకం చదవడం ప్రారంభిస్తే గంటలో పూర్తి చేస్తాం. మరోగంటలో మర్చిపోకుండా ఉండాలంటే రచన చేశాక ఒకసారి ఈ పుస్తకంలోని అభ్యాసాలతో సరి చూసుకోవాలి.
ఈ పుస్తకాన్ని సులభతరమైన పద్ధతిలో రాసిన నండూరి సుందరీ నాగమణి అభినందనీయురాలు. ఎంతవరకూ మనం రాసే తప్పుల గురించేకాక డెస్క్‌టాపు, లాప్టాప్‌ (కంప్యూటర్లలో) లలో అందుబాటులో ఉన్న తెలుగు సాఫ్ట్‌ వేర్‌ ద్వారా తప్పులు రాకుండా ఎలా టైప్‌ చేయాలో కూడా కొన్ని అధ్యాయాల్లో తెలియజేయడం బాగుంది. అంతేకాకుండా కొత్తగా కథారచన చేస్తున్న వారికోసం సూచనలూ ఉన్నాయి. రచనలు ఎలా చేయాలి? కథా రచనలో ఉన్న మూడు పురుష కోణాలు ఏమిటి? వాటినెలా వాడాలి? రచయితలు అనుసరించాల్సిన విషయాలు ఏమిటి? అనేవి స్థూలంగా చర్చించడం జరిగింది.
ఈ పుస్తకంలోని అంశాలను ఆకళింపు చేసుకుని, అనుసరిస్తే, మీ రచనలు చదివాక ఎవరూ మిమ్మల్ని 'మీకు తెలుగు రాయడం వచ్చా?' అని అడగరంటే నమ్మండి.
ఇప్పుడొస్తున్న రచనల్లో ఆంగ్ల పదాలు విపరీతంగా దొర్లిపోతున్నాయి. వాటి స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కారణం, రచన చేయాలన్న తపన ఉన్నా, భాషపై పట్టు లేకపోవడం. సహజత్వానికి దగ్గరగా ఉండాలని మేము ఇలా ఆంగ్ల పదాలు రచనల్లో చొప్పించాల్సి వస్తోందని కొందరు వాదిస్తున్నారు. అచ్చమైన తెలుగు రాస్తుంటే అర్థం కావడంలేదని మరికొందరంటున్నారు. రచయితే తెలుగు భాషపట్ల చిన్నతనం ప్రదర్శిస్తే భాష మనుగడ ఏం కావాలి? దశాబ్దాలు గడిచాక చరిత్ర పుటల్లో తెలుగు పదాలు కనుమరుగై పోతాయని మర్చిపోతే ఎలా? భాషపై పట్టు పెంచుకుందాం, అక్షర దోషాలను పరిహరిస్తూ రచనలు చేద్దామని తన వంతు ప్రయత్నంగా ఈ పుస్తకాన్ని వెలువరించిన రచయిత్రి నండూరి సుందరీ నాగమణిని అభినందిద్దాం.